నర్సీపట్నం: అల్లూరి సీతారామరాజు పోరాట స్మ ృతులు నేటికీ నర్సీపట్నంలో సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గిరిపుత్రల పక్షాన..తెల్లదొరల దాస్య శృంఖాలల నుంచి విముక్తి కలిగించేందుకు అల్లూరి సీతారామరాజు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. గత చరిత్రకు సాక్షాలెన్నో నర్సీపట్నంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. దేశ స్వాతంత్య్ర ఉద్యమం స్మ ృతిచిహ్నాలతో అలనాటి బ్రిటిష్ పాలకుల పాలనను గుర్తుకు తెస్తుంది. ఈ పట్టణంలో అల్లూరి చేతులో హతమైన బ్రిటిష్ సైనికాధికారులైన హైవర్టు, కవర్టు సమాధులు, బ్రిటిష్ వారు నిర్మించిన ఏనుగుశాలలు నేటికీ పదిలంగా ఉన్నాయి. ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్న పలు బ్రిటిష్ కాలం నాటి భవనాలు గత చరిత్రను కళ్ల ముందు ఉంచుతాయి. ఆ భవనాలు రాతి కట్టడంతో రాజసం ఉట్టిపడే విధంగా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ భవనాల్లో ప్రస్తుతం సబ్కలెక్టర్, తహసీల్దార్, సబ్ట్రెజరీ కార్యాలయాలు, సబ్జైలు నిర్వహిస్తున్నారు. సబ్ట్రెజరీ కార్యాలయం లోపల గల మెట్ల మార్గం గుండా భవనంపైకి వెళ్లవచ్చు. ఈ పైభాగంలో ప్రత్యేకంగా ఉన్న ఒక గదిలో అప్పట్లో జవాను ఒకరు కాపలా ఉండేవాడు. అప్పట్లో ఈ కార్యాలయంలో సమయాన్ని తెలియజేస్తూ గంటలు కూడా మోగించేవారు. మన్యం ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తూ వారి శ్రమను దోపిడీ చేసేవాడని పేర్కొంటున్న తెల్లదొర బాష్టియన్ అప్పుడు ఇదే భవనాన్ని కార్యాలయంగా చేసుకుని తహసీల్దార్గా పనిచేశారు.సబ్ కలెక్టర్ కార్యాలయం భవనం కూడా బ్రిటిష్ పాలకులు నిర్మించిందే.


