పరవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎస్ఎంఎస్–1లో జూన్ 8న జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.కోటి ప్రకటించి జ్యూడిషియల్ విచారణ జరిపించాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు వర్క్ర్స్ యూనియన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మెయిన్గేట్ వద్ద స్టీల్ప్లాంట్ ప్రమాద మృతులకు శుక్రవారం ఘన నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ ప్రమాదాలకు పూర్తి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రవేటీకరణ విధానాలే కారణమన్నారు. నాశిరకం ముడి సరుకును వాడడం, యంత్రాల మరమ్మతులు చేయకపోవడం, అనుభవం ఉన్న కార్మికులను తొలగించడం, కార్మికులపై విపరీతమైన పనిభారం మోపడం వంటి కారణాలే ఈ ప్రమాదానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రూ.కోటి చెల్లిస్తూ క్షతగాత్రులకు రూ.50 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు గోవిందరాజు, నాగేశ్వరరావు, నాయుడు, శ్రీను, సత్తిబాబు, అప్పారావు, రమణ తదితరులు పాల్గొన్నారు.


