వర్షాకాలపు రోగాలపై జాగ్రత్తలు అవసరం
మూగ జీవాలకు పొంచి ఉన్న ముప్పు
మేకలు, గొర్రెలు ఇతర జీవాలకు ముందస్తు టీకాలే శ్రీరామరక్ష
మాడుగుల: వర్షాకాలం ప్రారంభం కావడంతో మూగ జీవులకు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. జోరీగలు, దోమలు వల్ల గొంతువ్యాపు, గాలికుంటు, తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముందస్తు జాగ్రతలు వల్ల ఈ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చునని పశువైద్యాధికారులు చెబుతున్నారు.
చిటికి వ్యాధి
వర్షాకాలం ప్రారంభం కావడంతో పచ్చిక చిగురులు రావడంతో మేకలు, గొర్రెలు, వీటితో పాటు సూక్ష్మజీవులను తినడం వల్ల కడుపులోకి వెళ్లి విష పదార్థాలు విసర్జించడం వల్ల జీవాలు చెంగున ఎగిరి మృత్యువాత పడతాయి. కొన్నిసార్లు కాళ్లు బిగించి ఊపిరాడక మృతి చెందుతాయి. వర్షాకాలం ముందు ఈ చిటికి వ్యాధి ప్రబలకుండా నాలుగు నెలలు పైబడి గొర్రె పిల్లలకు నివారణ టీకాలు వేసుకోవాలి.
గొంతువ్యాపు
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో గొంతువ్యాపు (గురకవ్యాధి) ప్రమాదకరమైనది. ఈ వ్యాధి సోకిన జీవాలకు ఉష్ణోగ్రత పెరిగి గొంతువాపు వచ్చి శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఈ వ్యాధులు ప్రబ లకుండా వర్షాకాలం ముందు టీకాలు వేయించాలి.
ముందస్తు వ్యాక్సిన్ వేయించాలి
వర్షాల్లో పశువులను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మేతకు తీసుకువెళ్లినపుడు తుప్పలు ఉన్న చోట పాము కాటుకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. తగిన మోతాదులు మేత వేయాలి. ఉరుములు, మెరుపులు వచ్చినపుడు పశువులను పాకల్లో ఉంచాలి. సీజనల్గా ముందస్తుగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు వేయించాలి.
–వి. చిట్టినాయుడు, ఏడీ మాడుగుల
సీజనల్ వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తలు
వర్షాకాలంలో జీవాలను పాకల్లో ఉంచాలి
చిత్తడి, బురద నేలలో జీవాలను తోలరాదు
ముందుజాగ్రత్తగా యాంటీ బయోటిక్ వేక్సిన్లు వేసుకోవాలి
ఎటువంటి వ్యాధి లక్షణాలున్నా సరే పశువైద్యులను వెంటనే సంప్రదించాలి


