అనకాపల్లి: ఏపీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సమావేశం, నూతన కమిటీ ఎన్నిక ద్వారకా తిరుమలలో గత నెల 30వ తేదీన జరిగింది. అనకాపల్లి పట్టణం చవితిని వీధికి చెందిన విశ్రాంత డిప్యూటీ డీఈవో కె.వి.గౌరీపతిని అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు స్థానిక జార్జీక్లబ్ ఆవరణలో గురువారం గౌరీపతిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా గౌరీపతి మాట్లాడుతూ విద్యాశాఖలో విశాఖ ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వహించి, పదవీ విరమణ చేయడం జరిగిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ ఏపీ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ల్లో మండల, జిల్లా అధ్యక్షులుగా విధులు నిర్వహించి, ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఎన్.వి.వి.స్వామి, బి.కాశీవిశ్వేశ్వరరావు, ఎ.ఎన్.వి.అప్పారావు, మళ్ల చంద్రశేఖర్, జి.భీమేశ్వరరావు పాల్గొన్నారు.
అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరీపతి


