వైఎస్సార్సీపీ హయాంలోనే
పూడిమడక రోడ్డు విస్తరణకు బీజం
రహదారి విస్తరణ బాధితులకు అండగా ఉంటాం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్
మునగపాక: వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ విప్ ధర్మశ్రీపై ఎమ్మెల్యే విజయకుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూడిమడక రోడ్డు విస్తరణకు బీజం పడిందని చెప్పారు. అయితే రోడ్డు విస్తరణ పనులను వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్ చెప్పడం విచారకరమన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీపై ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు.పంచదార్ల కొండ వద్ద గ్రావెల్ తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయంటూ ధర్మశ్రీ విలేకరుల సమావేశంలో చెప్పడం తప్పుకాదని చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రాపకం కోసం పార్టీకి చెందిన సీనియర్లు పేర్నినాని,అంబటి రాంబాబు,గుడివాడ అమర్నాఽథ్,ధర్మశ్రీలు ప్రయత్నిస్తున్నారంటూ విజయకుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి దగ్గర ఈ నాయకులకు గుర్తింపు ఉంది కాబట్టే వారికి మంత్రి పదవులు, ప్రభుత్వ విప్ వంటి పదువులు ఇచ్చారన్నారు.
పూడిమడక రోడ్డు విస్తరణకు తొలి నుంచి వైఎస్సార్సీపీ సానుకూలంగా ఉందని, అయితే రైతులు,బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నేరుగా అకౌంట్లో జమ అయ్యేలా చూడాల్సింది పోయి,వైఎస్సార్సీపీ నేతలపై అభాండాలు మోపడం సరికాదన్నారు.
విలేకరుల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు ఆడారి అచ్చియ్యనాయుడు,దేశంశెట్టి శంకరరావు,అచ్యుతాపురం జెడ్పీటీసీ లాలం రాము, కో–ఆప్షన్ జెడ్పీటీసీ నర్మాల కుమార్,ఎంపీపీ కోన సంద్య బుజ్జి, మాజీ జెడ్పీటీసీ భీముని వేంకటేశ్వరరావు,పార్టీ నాయకులు మారిశెట్టి సూర్యనారాయణ,పిన్నమరాజు రవీంద్రరాజు,ఉమ్మిడి జగన్, ఈత బాబూరావు,నాగేశ్వరరావు,బొద్దపు శ్రీరామమూర్తి,దొడ్డి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.


