● ‘వీబీజీ రామ్ జీ’ రద్దు చేయాలని డిమాండ్
పాదయాత్ర చేస్తున్న ఉపాధి కూలీలు, గిరిజన సంఘాల నాయకులు
రావికమతం: దేశవ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని యఽథావిధిగా కొనసాగించాలని కోరుతూ పీవీటీజీ సంఘాల ఆధ్వర్యంలో గిరిజన ఉపాధి కూలీలు, మహిళలు బుధవారం పాదయాత్ర చే శారు. వీబీ జీ రామ్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలుగు, పారలు, గంపలు పట్టుకుని గర్నికం నుంచి రావికమతం వరకు పాదయాత్ర జరిపారు. మండల రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ప్లకార్డులతో ఆందోళన చేశారు. కల్యాణపులోవ, అజేయపురం, జెడ్.జోగుంపేట, తాడిపర్తి, టి.అర్జాపురం, కోట్నాబిల్లి, జెడ్.బెన్నవరం తదితర గ్రామాల్లో తక్షణమే ఉపాధి పనులు చేపట్టి ఆగస్టు వరకు కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత బడ్జెట్లో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాత, కొత్త కోట్నాబిల్లి, కె.గదపపాలెం, రామన్నదొరపాలెం గిరిజన గ్రామాల్లో సెల్ సిగ్నల్ లేకపోవడంతో ఫేస్ యాప్లో నమోదు కావట్లలేదని వాపోయారు. చాలా ఇబ్బందులు పడుతూ సిగ్నల్ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని, లేకపోతే మస్తర్లు నమోదు కావడం లేదని ఆరోపించారు. వెంటనే సెల్ టవర్ వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.


