తుమ్మపాల : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్ధంగా నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే పురోగతిపై మంగళవారం ఇన్చార్జి డీఆర్వో వై.శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మిలతో కలసి ఆమె మండల స్థాయి బూత్ లెవల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు.
అంటువ్యాధుల నివారణకు ఇన్స్పెక్షన్ కమిటీలు
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ఇతర నివాస సంస్థల్లో అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా పరిపాలన జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కమిటీలు సంక్షేమ వసతి గృహాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి పారిశుధ్యం, తాగునీటి నాణ్యత, ఆహార భద్రతతో పాటు విద్యా ర్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలన్నారు.


