అనకాపల్లి టౌన్ : జిల్లాలో రాగల ఐదు రోజులు తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సి.ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరి నారుమళ్లు రైతులు వేసుకోవచ్చని, నేలను దున్ని తయారు చేసుకొని నారుమడి ఎత్తుగా వేసుకోవాలన్నారు. ఐదు సెంట్లు నారుమడికి 2009 కిలోల పశువుల ఎరువును, 2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కిలోల మ్యారేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలన్నారు. తగిన తేమ చూసుకొని మొక్కజొన్న పంటకు నేలను దున్ని తయారు చేసుకొని డి.హెచ్.ఎం–115, 112,119.121 రకాలను ఎకరాకు 8 కిలోలు చొప్పున తగిన దూరంలో విత్తుకోవాలన్నారు. వర్షాధార చెరకు వేసుకునే రైతులు ముదురు గడల నుంచి విత్తనాన్ని సేకరించి వర్షం పడిన చోట ఎకరాకు 20 వేలు మూడు కళ్ల మెచ్చెల చొప్పున 60 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలన్నారు. నాటే ముందు మెచ్చెలను 10 శాతం సున్నపు నీటిలో ఒక గంట సేపు ముంచి నాటుకోవాలన్నారు. అలాగే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున నాటిన మూడో రోజున చెరకు తెచ్చి కప్పాలని సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ వి.గౌరి, డాక్టర్ సిహెచ్ సీతా రామలక్ష్మి పాల్గొన్నారు.


