ఎస్.రాయవరం: మండలంలోని రేవుపోలవరం ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి నాడు – నేడు నిధుల నుంచి రూ.3 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. అప్పట్లో ప్రారంభించిన పనులను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆపేశారన్నారు. దాంతో తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. నిధులు విడుదలయ్యాక పనులు పూర్తి చేయకపోవడం దారుణమని, ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులతోపాటు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ అర్జిలి ఎర్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.


