అనకాపల్లి : మాతృభాషతో పాటు ఆంగ్ల భాషపై ఆసక్తి పెంచుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ అధ్యాపకుడు డాక్టర్. విల్లూరి ఉమామహేశ్వరరావు రచించిన ‘ఫోనెటిక్స్ ఏ బిగినర్స్ గైడ్‘ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మాతృభాషతో పాటు, ఇంగ్లిష్, హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడం వల్ల పంపంచంలో ఎక్కడికై నా వెళ్లి తిరిగిరావచ్చన్నారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నేటి ప్రపంచీకరణలో చేసే వృత్తితో సంబంధం లేకుండా, తన విద్యార్హత సంబంధం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడడం అనేది ఒక సర్వసాధారణమైన విషయంగా మారిందన్నారు. ఇంగ్లిష్ ఉచ్ఛారణ పడకుండా నిజమైన ఇంగ్లిష్ వారిలాగే మాట్లాడగలిగితే అటువంటి వ్యక్తికి ఈ ప్రపంచం ఎర్ర తివాచీ పరుస్తుందని, అలాగే వారు ఎక్కడైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు సునాయాసంగా సంపాదించగలరని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మాట్లాడించడానికి మార్కెట్లో చాలా పుస్తకాలు దొరుకుతాయని, తాను రాసిన ఫోనెటిక్స్ ఏ బిగినర్స్ గైడ్ అనే పుస్తకం ఇంగ్లిష్లో ఏ పదాలను ఎలా పలకాలి, వాటిని స్పష్టంగా పలికే విధానం, ఏ పదాలకు ఎక్కడెక్కడ వత్తి పలకాలి, అలా పలకడం ద్వారా ఒకే మాటకి రెండు మూడు అర్థాలు ఎలా వస్తాయి అనే విషయాలను రచయిత ఈ పుస్తకంలో వివరించిన తీరు ఇంగ్లిషు భాషను దాని సరైన ఉచ్ఛారణతో నేర్చుకోవాలి అనుకునే పాఠకులకు ఎవరికై నా ఈ పుస్తకం ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


