తుమ్మపాల: జిల్లాలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం జరిగిన దిశా (జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మానటరింగ్ కమిటీ) సమావేశంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్బాబు, బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ, కె.ఎస్.ఎన్.ఎస్. రాజులతో కలిసి వారు వివిధ అంశాలపై సమీక్షించారు. జలజీవన్ మిషన్ ద్వారా జిల్లాల చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 68 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రహదారికి ఇరువైపులా సోలార్ లైటింగ్ ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు. నాలుగైదు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాలను రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలతో పూర్తయ్యే వాటికి నిధులు మంజూరు చేయాలని జెడ్పీ సీఈవో సత్యనారాయణమూర్తిని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మళ్ల సురేంద్ర, బత్తుల తాతయ్యబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


