పెట్రో భారంపై
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
● పెట్రోల్ బంకుల వద్ద వినూత్న ధర్నాలు
● ప్రభుత్వ కార్యాలయాల్లో వినతిపత్రాలు
● నిత్యావసరాలపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం
● తక్షణమే తగ్గించాలని డిమాండ్
● ర్యాలీల్లో భారీగా పాల్గొన్న ప్రజలు
మాడుగుల రూరల్ : మాడుగులలో పెట్రోల్ బంక్ వద్ద నిరసన తెలుపుతున్న మాజీ డిప్యూటీ సీఎం బూడి, ఈర్లె అనురాధ, పార్టీ శ్రేణులు
సాక్షి, అనకాపల్లి: పెరుగుతున్న పెట్రో ధరలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. నిత్యావసర వస్తువులపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపుతున్న ఈ ధరలను తక్షణమే తగ్గించాలనే ఒకే ఒక్క డిమాండ్తో పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చారు. జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వినూత్న రీతిలో ధర్నాలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ ఆందోళనలకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించడంతో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెట్రో ధరలను తగ్గించే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని వైఎస్సార్ సీపీ నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రో ధరలపై నిరసన కార్యక్రమాలు జరిగాయి.
● మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మాడుగుల ఆర్టీసీ బస్టాండ్ నుంచి టౌన్లో గల పెట్రోల్ బంక్ వరకూ ర్యాలీగా నిరసన చేశారు. అనంతరం తహసీల్దార్ కె. రమాదేవికి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, మండల పార్టీ అధ్యక్షుడు వేమవరపు పెదబాబు, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పాల్గొన్నారు.
● చోడవరంలో నియోజకవర్గంలో నియోజకవర్గ పరిశీలకులు గండి రవికుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
● యలమంచిలి నియోజకవర్గంలో నియోజకవర్గ పరిశీలకుడు కోలా గురువులు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. యలమంచిలి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎంపీపీలు గొట్టిముక్కల శ్రీనుబాబు, కోన బుజ్జి, జెడ్పీటీసీ దూళి నాగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంక ర్రావు, యలమంచిలి టౌన్ అధ్యక్షుడు బోద్దపు యర్రయ్యదొర పాల్గొన్నారు.
● పాయకరావుపేట నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఎస్.రాయవరం మండలంలో అడ్డురోడ్డు క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు పైల రమేష్, మధువర్మ, గెడ్డమూరి శ్రీనివాసరావు, గొర్ల గోవిందరావు,నక్కపల్లి జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, పాయకరావుపేట టౌన్ అధ్యక్షులు ధనిశెట్టి బాబురావు, ఎస్.రాయవరం మండల వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న పాల్గొన్నారు.
● అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్రాజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎ.గంగాధర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
● నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండల కేంద్రాల్లో ఆయా పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో నిరసన జరిగింది.
నర్సీపట్నం టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ ఆధ్వర్యంలో.. నర్సీపట్నం సేనాపతి వెంకటరత్నం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మీతో పాటు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
గొలుగొండ మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు కొరుప్రోలు పాణి శాంతారామ్ ఆధ్వర్యంలో గొలుగొండ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసి ఎమ్మార్వో కాకర నూకరాజుకు వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ గజ్జెలపు మణికుమారి, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
నాతవరం మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్ చందన రేఖకు వినతి పత్రం అందజేశారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ కాపరపు అప్పలనర్స, జిల్లా కమిటీ సభ్యులు కరక అప్పలరాజుతో పాటు సర్పంచ్, ఎంపీటీసీలు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
● పెందుర్తి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి వద్ద భారీ మానవహారం చేసి అనంతరం బీఆర్టీఎస్ రహదారి మీదుగా పెందుర్తి రెవెన్యూ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం రెవెన్యూ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో తలుపునకు అంటించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు శరగడం చిన అప్పలనాయుడు, గండి రవి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడిగుడ్ల దేవిసాంబ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.


