కూటమి కుట్ర!
కాంట్రాక్టర్పై
● గ్రామ ఆరోగ్య కేంద్రం బిల్లు ఆపడానికి గండి బాబ్జీ, అరుణ పంతం
● సబ్బవరం మండలం మొగలిపురంలో వెల్నెస్ సెంటర్ నిర్మాణం
● బిల్లు మొత్తం రూ.7,50,314 ఏడాది క్రితం పంచాయతీ ఖాతాలో జమ
● చెల్లించవద్దని అధికారులపై టీడీపీ నేత గండి బాబ్జీ ఒత్తిడి
● కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో 35సార్లు బాధితుడి వినతి
● విసిగి వేసారి అధికారులను నిలదీసిన కాంట్రాక్టర్ యడ్ల నాయుడు
● న్యాయం చేయమని అర్థిస్తే పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన అధికారులు
● వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి కావడమే నిరాదరణకు కారణం!
సాక్షి, అనకాపల్లి:
కేవలం వైఎస్సార్సీపీ నాయకుడన్న భేద భావంతో కాంట్రాక్టర్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సేవాభావంతో ముందు సొంత డబ్బులు ఖర్చు చేసి ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించిన వ్యక్తికి బిల్లు చెల్లించకుండా రాజకీయంగా వేధిస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో 35 సార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. బాధిత కాంట్రాక్టర్ యడ్ల నాయుడు వాదన ప్రకారం.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సబ్బవరం మండలం మొగలిపురం గ్రామంలో గ్రామ ఆరోగ్య కేంద్రం మంజూరైంది. వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు అయిన యడ్ల నాయుడు సొంత నిధులతో భవనం నిర్మి,చారు. రూ.7,50,314 నిధులు ఖర్చయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఎన్ఆర్ఈజీఎస్ ఖాతాకు ఈ నిధులు జమ అయ్యాయి. ఏడాది దాటినా బిల్లు చెల్లింపు మాత్రం జరగడం లేదు.
ఎన్నికల కక్షే కారణమా?
గత సర్పంచ్ ఎన్నికల్లో గండి బాబ్జీ భార్య గండి అరుణపై తన అక్కను పోటీ చేయించినందుకే వ్యక్తిగత కక్షతో ఈ బిల్లును అడ్డుకుంటున్నారని యడ్ల నాయుడు ఆరోపించారు.‘గత రెండు సంవత్సరాలుగా ఈ గ్రామ ఆరోగ్య కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్కు సేవలు అందిస్తోంది. ప్రజలకు నిరంతరం ఉపయోగపడే ఇలాంటి ఒక్క నిర్మాణమైనా మీ హయాంలో చేశారా‘ అని యడ్ల నాయుడు గండి బాబ్జీని ప్రశ్నించారు.
మౌనం దాల్చిన అధికారులు
’జీరో రికవరీ’ రిపోర్ట్ ఉన్నప్పటికీ, ప్రజలకు నిత్యం ఉపయోగపడే గ్రామ ఆరోగ్య కేంద్రం బిల్లును ఏడాది నుంచి నిలిపివేశారు. రాజకీయ ఒత్తిడే కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. కాంట్రాక్టరు 35సార్లు ఫిర్యాదులు చేసినా, నిధులు సిద్ధంగా ఉన్నా బకాయి చెల్లించలేదు. రాజకీయ ఒత్తిడితోనే ఉన్నతాధికారులు స్పందించడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది.
నాణ్యత లోపం
లేకపోయినా..
గ్రామ సర్పంచ్గా వ్యవహరిస్తున్న టీడీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జీ భార్య అరుణ ఇందుకు కారణమని యడ్ల నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టేందుకు సర్పంచ్ గండి అరుణ ఈ నిర్మాణంపై రెండుసార్లు క్వాలిటీ ఎంక్వయిరీ కూడా చేయించారని, ఆ తనిఖీల్లో ఇంజినీరింగ్ అధికారులు ’జీరో రికవరీ’ (నాణ్యతలో ఎలాంటి లోపం లేదు) అని రిపోర్ట్ ఇచ్చారని, ఆరు నెలలు కావస్తున్నా బిల్లు చెల్లించకుండా గండి బాబ్జీ అధికారులపై ఒత్తిడి తెచ్చి అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. పీజీఆర్ఎస్లో 35 సార్లు వినతి అందజేసినా జిల్లా పంచాయతీ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీంతో సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో బాధిత కాంట్రాక్టర్ యడ్ల నాయుడు.. తనకు న్యాయం చేయాలని అడగడానికి వెళ్లగా ఫిర్యాదు నమోదు చేయలేదు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించకపోగా.. తమపై దూషణలకు దిగారంటూ అదుపులోకి తీసుకొని అనకాపల్లి రూరల్ పోలీస్స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్బంధించారు.
బిల్ అడగానికి వెళ్లాను..
నేను 35 సార్లు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. న్యాయం చేయాలని మరోసారి కోరాలని సోమవారం ఉదయం కలెక్టరేట్కు వెళ్లాను. అక్కడ సిబ్బంది నా ఫిర్యాదును నమోదు చేయలేదు. అయినా కలెక్టర్ విజయ కృష్ణన్ గారిని కలిసి నేరుగా నా సమస్య చెప్పుకుందామంటే కలెక్టరాఫీస్ సిబ్బంది వెళ్లనీయలేదు. ఇంతలో కలెక్టర్ పిలవగా లోపలికి వెళ్లి నా ఆవేదన వివరించారు. బిల్లు చెల్లించమని అడిగాను. పోలీసులతో బయటకు నెట్టి అనకాపల్లి రూరల్ పోలీసుస్టేషన్కి తీసుకొని వెళ్లి అక్కడ నిర్బంధించారు. నావైపు న్యాయం ఉంది. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను.
– యడ్ల నాయుడు, బాధిత కాంట్రాక్టర్
కూటమి కుట్ర!


