సాక్షి, అమరావతి/నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువును ఆక్రమించి ‘సృష్టి క్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పెద చెరువు కట్ట బలోపేతం, సుందరీకరణ పనులు నిర్వహించవచ్చని హైకోర్టు తెలిపింది. అయితే సుందరీకరణ పనులు చేపట్టే ముందు అందుకు సంబంధించిన కార్యాచరణను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న అయ్యన్న పాత్రుడికి సైతం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.
చెరువు ఆక్రమణ దారుణం: పొన్నవోలు వాదనలు
స్పీకర్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న పెద చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం దారుణమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఉమా శంకర గణేష్ హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పెద చెరువు కింద 345.25 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి నేతృత్వంలోని ఈ చెరువు మధ్యలో నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువును కొంత మేర పూడ్చి ఇక్కడ భారీ శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. శివ పార్వతుల విగ్రహాల ఏర్పాటునకు పిటిషనర్ వ్యతిరేకం కాదు.
చెరువు సమీపంలో ఉన్న చారిత్రక దేవస్థానంలో విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. పంటలకు ప్రాణాధారంగా ఉన్న చెరువును పూడ్చేసి విగ్రహాలను ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం. గతంలో ఇదే చెరువు సమీపంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేస్తుంటే అధికారులకు లేఖ రాసి మరీ అడ్డుకున్న అయ్యన్నపాత్రుడు, ఇప్పుడు తానే తన కుమారుడితో కలిసి చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండటం దారుణం. ఈ నేపథ్యంలో అయ్యన్న నేతృత్వంలో జరుగుతున్న చెరువు ఆక్రమణను అడ్డుకోవాలి’ అని అభ్యర్థించారు. నీటి వనరులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుతో సహా పలు హైకోర్టులు చాలా తీర్పులు వెలువరించాయని తెలియజేశారు.
ప్రభుత్వ వాదనలు తప్పని ఆధారాలతో నిరూపణ
అనంతరం ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ, చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. కేవలం చెరువు కట్టల బలోపేతం, పూడికతీత, సుందరీకరణ పనులను మాత్రమే చేపడుతున్నామన్నారు. ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు. ఈ సమయంలో సుధాకర్రెడ్డి స్పందిస్తూ, చెరువు మధ్యలో నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి అయ్యన్నపాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్న భూమి పూజ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, పెద చెరువులో చేస్తున్న నిర్మాణాలపై స్టే విధించింది.
రైతుల హర్షం: ఉమా శంకర గణేష్
స్పీకర్ తలపెట్టిన అక్రమ నిర్మాణాలపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మమ్మల్ని çకలిశారు. దీంతో వారికి అండగా నిలిచాం. హైకోర్టు తాజా ఆదేశాలతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.


