
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. 108 స్వర్ణసంపెంగలతో అష్టోత్తర పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు.
ఘనంగా నిత్యకల్యాణం
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.
విశేషంగా గరుడసేవ
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ విశేషంగా జరిగింది. ఆలయ బేడామండపంలో ఉదయం ఈ సేవను నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వెండి గరుడవాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. విశేష హారతులిచ్చారు. పూజలో పాల్గొన్న భక్తులను గరుడవాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు.