
అందివస్తారనుకున్న యువకులు అనంతలోకాలకు..
● కొత్తూరు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం
● ఇద్దరు నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగుల మృతి
అనకాపల్లి టౌన్: అనకాపల్లి జాతీయ రహదారి ఏఎంఏఎల్ కాలేజ్ కొత్తూరు జంక్షన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి. మునగపాక మండలం చిన యాదగిరి పాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి వెంకట సూరి అప్పారావు (28), గొలుగొండ గ్రామానికి చెందిన బిడిజన నాగ సాయి బాలాజీ (24), గాజువాకకు సైనా రవి (28) కశింకోట మండలం తాళ్లపాలెం నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరు ముగ్గురూ కొత్తూరు గ్రామంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. వీరందరూ కలిసి తాళ్లపాలెంలో జరిగే శుభకార్యానికి హాజరై తిరిగి వస్తూ కొత్తూరు జంక్షన్ దాటుతుండగా వెనక నుంచి వస్తున్న వ్యాన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట సూరి అప్పారావు అక్కడికక్కడే మృతి చెందగా, బాలాజీ హాస్పటల్కు తీసుకువెళుతుండగా మృతి చెందాడు. గాయాల పాలైన సైనా రవి ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మెలిపాకలో విషాదం
మునగపాక: అందివస్తాడుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. ఒక్కగానొక్క కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగిలింది. మెలిపాకకు చెందిన మేడిశెట్టి లోవరాజు, లక్ష్మి దంపతులు వ్యవసాయం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
కుమార్తెకు వివాహం జరిగింది. కుమారుడు వెంకట సూరప్పారావు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. గురువారం రాత్రి తాళ్లపాలెంలో స్నేహితుని వివాహానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.

అందివస్తారనుకున్న యువకులు అనంతలోకాలకు..

అందివస్తారనుకున్న యువకులు అనంతలోకాలకు..