అరకులోయటౌన్: ప్రకృతిని రక్షించుకోడానికి, మన అటవీ సంపదను పెంపొందించుకోడానికి ప్రతి విద్యార్థి ఎనిమిది కంటే ఎక్కువ మొక్కలు నాటాలని కలెక్టర్ నిశాంతి అన్నారు. మండలంలోని బొండాం పంచా యతీ మజ్జివలసలో నూతనంగా నిర్మించిన ఏకలవ్య ఇంగ్లిష్ మీడియం పాఠశాలను సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ అధికారులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏఎస్ఆర్–అరణ్య అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ఒక విద్యార్థి– ఒక చెట్టు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఏఎస్ఆర్–అరణ్య ప్రోగ్రాం కార్యక్రమం ద్వారా అటవీశాఖ అధికారులు జిల్లా లోని అన్ని పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలని, విద్యార్థులను చైతన్య పరచాలని పాడేరు డీఎఫ్వో కె.ఉమామహేశ్వరి, స్థానిక రేంజ్ అధికారులు బొర్రా కోటేశ్వరరావు, శ్రీరాజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, అటవీశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


