సాక్షి, పాడేరు: సీజనల్ వ్యాధులు విజృంభించకుండా వైద్యబృందాలు అప్రమత్తమై జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. మంగళవారం ఆమె హుకుంపేట పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇక్కడ రోగులకు అందిస్తున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పరిసరాలు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జ్వరాలతో బాధపడే ప్రజలు సకాలంలో పీహెచ్సీలకు చేరుకుని వైద్యసేవలు పొందాలన్నారు. సికిల్సెల్ ఎనీమియా మరణాలు నియంత్రణకు వైద్యబృందాలు కృషి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలను ఆధునిక సదుపాయాలతో మోడల్ ఆరోగ్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని, సరిపడా మందులను ముందుగానే నిల్వ చేసుకోవాలని ఆదేశించారు. అనారోగ్యంతో ఆస్పత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది స్నేహభావంతో మెలగాలన్నారు.అనంతరం తలారిసింగి జంక్షన్లోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.ఇక్కడ బాలికలకు అందుతున్న విద్యా, వసతి సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. గిరిజన విద్యార్థినులకు మెరు గైన విద్యను అందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి సంపూర్ణత అభియాన్ 2.0
జిల్లా సమగ్రాభివృద్ధికి సంపూర్ణత అభియాన్ 2.0 ఒక దిక్సూచి అని కలెక్టర్ నిశాంతి అన్నారు. జిల్లాలోని పలుశాఖల అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. సంపూర్ణత అభియాన్ ద్వారా జిల్లా అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పకడ్బందీ ప్రణాళికలతో జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు.విద్య,వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు మాతాశిశు మరణాల రేటును తగ్గించి వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. యువత, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు పేదరిక నిర్మూలన కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆదేశించారు. మారుమూల గ్రామాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలన్నారు.ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్పడాల్, డీఈవో రామకృష్ణారావు, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్, సీపీవో ప్రసాదరావు, డ్వామా పీడీ విద్యాసాగర్, డీఆర్డీఏ పీడీ మురళీ, ఏడీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్ పాల్గొన్నారు.


