చింతపల్లి: స్థానిక గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి తీర్థమహోత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలంకరణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 నుంచి 17 వరకు నాలుగు రోజుల పాటు ఈ తీర్థమహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. జాతర సందర్భంగా పట్టణమంతటా భారీ విద్యుత్ దీపాలంకరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం చింతపల్లి పాత బస్టాండ్ ఆవరణలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దీపాలంకరణ పనులను అధికారికంగా ప్రారంభించారు. సాధారణంగా ఈ విద్యుత్ పనులు మొదలైనప్పటి నుంచి చింతపల్లిలో జాతర వాతావరణం నెలకొందని స్థానికులు భావిస్తారు. జాతరకు ఇంకా కేవలం పది రోజులే సమయం ఉండటంతో, ఏర్పాట్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయడానికి శరవేగంగా పనులు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పసుపులేటి వినాయకరావు, పోతురాజు బాలయ్య పడాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బేతాళుడు తదితరులు పాల్గొన్నారు.


