
మాటిచ్చి.. మోసగించి..
కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తూట్లు పొడిచింది. ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకంలో రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం నిబంధనల పేరిట కోత విధించింది. అర్హులైన తల్లులు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది.
అర్హుల ఖాతాల్లో జమకాని తల్లికి వందనం నగదు
● నిబంధనల పేరిట పథకం అమలుకు తూట్లు ● మాట తప్పిన కూటమి ప్రభుత్వం ● అర్హులు 1.75లక్షల మందికి పైమాటే ● 1,56,182 మందికి మాత్రమే ప్రభుత్వం జమ ● సుమారు 18 వేల మందికి పైగా కోత
నయాపైసా జమ కాలేదు
ఐదుగురు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలల్లో వేర్వేరు తరగతులు చదువుతున్నారు. ఉచిత విద్యుత్ను పొందుతున్నాం. జగనన్న సీఎంగా ఉన్నప్పడు అమ్మ ఒడి పథకంలో నగదు పొందా. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీ మేరకు ఐదుగురు పిల్లలకు రూ.13 వేల చొప్పున మొత్తం రూ.65 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని ఆశపడ్డా. మినుములూరు మీసేవా కేంద్రంలోని బ్యాంక్ ఖాతాను పరిశీలించగా నగదు జమకాలేదని తేలింది. గ్రామసచివాలయానికి శనివారం సెలవు కావడంతో సిబ్బంది సోమవారం రమ్మన్నారు.
– మర్రి దేవి, సల్దిగెడ్డ, మినుములూరు పంచాయతీ, పాడేరు మండలం
అందరికీ ఇవ్వలేదు
మాది పేద కుటుంబం. ముగ్గురు సంతానం. వారంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో ఇద్దరికి మాత్రమే తల్లికి వందనం నగదు బ్యాంక్ ఖాతాలో జమ అయింది. నా రెండో కుమార్తె పుంకురు సమీరా పాడేరు మండలం కందమామిడి జీటీడబ్ల్యూ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈమెకు సంబంధించిన తల్లికి వందనం నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో అర్హులందరికీ జమ చేయాలి.
– పుంకురు కుమార్, బోసుబెడ, అరకులోయ మండలం
సాక్షి,పాడేరు: జిల్లాలో తల్లికి వందనం పథకం అమలు గందరగోళంగా మారింది. ఎన్నికలకు ముందు ‘నీకు 15వేలు, నీకు 15వేలు, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తాం’ అంటూ చేసిన ప్రకటనలు ప్రచారానికే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతోనే నిరాశ మొదలైంది. తాజాగా రెండో ఏడాది పాఠశాలలు తిరిగి తెరిచే రోజున ‘తల్లికి వందనం’ డబ్బులు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా ఆనందపడ్డారు. అందరికీ జమకాకపోవడంతో నిరాశ మిగిల్చింది. నిబంధనలను సాకుగా చూపి మొండిచెయ్యి చూపిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఇచ్చిన మాటకు కట్టుబడి..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు జేసింది. 2022–23లో ఇంటికి ఒకరు చొప్పున జిల్లాలో 1,01,170 మంది విద్యార్థులకు అమ్మ ఒడి ఆర్థిక సాయాన్ని వారి తల్లుల ఖాతాల్లో జమచేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం అమలు జేస్తామని, ఒకొక్కరికి రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించింది. గత విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా పంగనామం పెట్టింది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ,ప్రజల డిమాండ్తో ఎట్టకేలకు తల్లికి వందనంను అమలుజేసినప్పటికి నిబంధనల పేరుతో చాలామంది తల్లులకు జాబితాలో చోటు లేకుండా పోయింది.
అర్హులు 1.75లక్షలమంది ఉన్నా..
జిల్లాలో ఒకటి నుంచి టెన్త్ వరకు విద్యార్థుల సంఖ్య సుమారు 1.75 లక్షలు దాటే ఉంది. 90శాతం గిరిజన కుటుంబాలు జిల్లాలో ఉన్నాయి. ప్రతీ
కుటుంబంలోను విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని 2913 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వతరగతి వరకు 1,69,175 మంది విద్యార్ధులు చదువుతున్నారని గణాంకాల్లో విద్యాశాఖ పేర్కొంది. ఇంటర్ విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరినీ కలుపుకుంటే మొత్తం 2 లక్షల వరకు ఉంటారు. అయితే జిల్లాలో 1,52,053 తల్లులకు చెందిన 1,56,182 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులని, వీరందరికీ అమలు అవుతోందని విద్యాశాఖ చెబుతోంది. వీటికి సంబంధించిన జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచింది.
నగదు జమకాక..
తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల్లో చాలామంది ఖాతాల్లో నగదు జమకాలేదు. వీరంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం లబ్ధిపొందారు. అప్పట్లో వీరందరికీ ఖాతాల్లో నగదు జమ అయింది. వీరికి ప్రస్తుత ప్రభుత్వంలో శనివారం మధ్యాహ్నం వరకు నగదు జమకాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శనివారం గ్రామసచివాలయాలు, బ్యాంకులకు సెలవు కావడంతో అందుబాటులో ఉన్న ఏటీఎంలకు వెళ్లి చెక్ చేసుకున్నారు. అర్హుల్లో చాలామందికి జమకాకపోవడంతో ఉసూరుమన్నారు.

మాటిచ్చి.. మోసగించి..

మాటిచ్చి.. మోసగించి..

మాటిచ్చి.. మోసగించి..