
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు
సబ్బవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు మండలాల్లో గత రెండేళ్లుగా ఏపీఈపీడీసీఎల్కు చెందిన 42 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన కేసుల్లో ముగ్గురు నిందితులను స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సబ్బవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలోని మర్రిపాలెంకు చెందిన గరికిపాటి సాయికిరణ్,పట్నాల రాజేశ్వరరావు,మహారాణిపేటకు చెందిన నెల్ల సాయిప్రసాద్ అనే ముగ్గురు యువకులతో పాటు మరో ఇద్దరు కలిసి 2023 నవంబర్ నుంచి 2025 జూన్ వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని సబ్బవరం, ఆనందపురం, పెందుర్తి, అచ్యుతాపురం, చోడవరం, కశింకోట, యలమంచిలి, భీమిలి మండలాల్లోని ఏపీఈపీడీసీఎల్కు చెందిన ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. ఎనిమిది మండలాల్లో 42 ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేయగా, అత్యధికంగా సబ్బవరం మండలంలో 15 ట్రాన్స్ఫార్మర్లు అపహరించినట్టు డీఎస్పీ తెలిపారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ను తొలగించి, అమ్మేశారని తెలిపారు.ఈ విధంగా వారు విక్రయించిన 190 కిలోల కాపర్ వైర్ను రికవరీ చేసినట్టు చెప్పారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల విలువ రూ.54 లక్షల వరకూ ఉంటుందన్నారు.ఈ కేసుల్లో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ జి.రామచంద్రరావు,ఎస్ఐలు సింహాచలం, దివ్యలతో పాటు మిగిలిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
190 కిలోల కాపర్ వైర్ స్వాధీనం
డీఎస్పీ విష్ణు స్వరూప్