ఆదిలాబాద్టౌన్: బాధితులకు పోలీసు వ్యవస్థ అండగా నిలుస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారులు ఎస్పీకి నేరుగా తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు విధులు ఆటంకపర్చిన వారిపై చర్యలు
పోలీసుల విధులు ఆటంకపర్చిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. 24 గంటల పాటు పోలీసులు ప్రజా రక్షణలో విధులు నిర్వహిస్తున్నారని తెలి పారు. సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడటం, విధులు అడ్డుకునే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఇటీవల నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ పోలీసు స్టేషన్ల పరిధిలో వేర్వేరు ఘటనల్లో పోలీసు విధులను ఆటంకపర్చిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలపై సమీప పోలీసు స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు.


