గృహ నిర్బంధం పిరికిపంద చర్య
ఆదిలాబాద్: బీజేపీ నాయకులను నిర్బంధించడం పిరికిపంద చర్య అని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఘటిక క్రాంతి కుమార్ అన్నారు. పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సోమవారం పలువురు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి టూటౌన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కౌన్సిలర్లు పద్మవార్ రాకేశ్, గంట జీవన్ తదితరులున్నారు.
గుడిహత్నూర్: బీజేపీ అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ సహా పలు వురు నాయకులు హైదరాబాద్ తరలివెళ్లేందుకు సమాయత్తం అవుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు సీఐలతో పాటు స్థానిక ఎస్సై శ్రీకాంత్ సుమారు 20 మంది సిబ్బందితో బ్రహ్మానంద్ ఇంటికి చేరుకున్నారు. ఆయనను స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లిన బ్రహ్మానంద్ తప్పించుకొని బయటకు వెళ్లి పోయాడు. ఎంతకీ రాకపోవడంతో పోలీసులు చేసేది లేక బయట ఉన్న ఆయన కారు టైర్లకు చువ్వ గుచ్చి గాలి తీసి వెనుదిరిగారు. అంతకు ముందే పార్టీ మండలాధ్యక్షుడు కేంద్రే శివాజీని, బీజేవైఎం అధ్యక్షుడు రాజేందర్తో పాటు ఇతర నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. ఉదయం స్టేషన్కు చేరుకున్న బ్రహ్మానంద్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తన కారు టైర్లను పాడు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మానంద్ పోలీసులపై ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా చేపడుతున్న నిరసనపై పోలీసులు అత్యుత్సాహంతో నిర్భందించడం సరికాదని ఆయన విలేకరులకు తెలిపారు.
పోలీసులు కారు టైర్ల నుంచి గాలి తీసేశారిలా..


