ఇన్స్పేస్ శిక్షణ పొందిన ‘నన్నయ’ అధ్యాపకురాలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ శీలం రాజ్యలక్ష్మి భారత అంతరిక్ష శాఖకు చెందిన ఇన్ స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అఽథారైజేషన్ సెంటర్) ఆధ్వర్యంలో ఆరు రోజుల శిక్షణను పూర్తి చేశారు. ఈ విషయాన్ని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మంగళవారం విలేకరులకు తెలిపారు. బెంగళూరులోని దేవనపల్లిలో ఈ నెల 4 నుంచి 9 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ లాంచ్ వెహికల్ డిజైన్, మిషన్ ప్లానింగ్, అవియానిక్స్ అభివృద్ధి, గైడెన్స్ – నావిగేషన్ – కంట్రోల్, టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ వ్యవస్థలపై విస్త్రతంగా అవగాహన కల్పించారన్నారు. ఆమెను వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ తదితరులు అభినందించారు.


