breaking news
Udaya nidhi
-
హైకోర్టు తీర్పు.. ఉదయనిధికి భారీ షాక్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విమర్శించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై నమోదైన క్రిమినల్ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగం వాస్తవానికి ‘విద్వేషపూరిత ప్రసంగం’ కిందకే వస్తుందని జస్టిస్ ఎస్. శ్రీమతి స్పష్టం చేశారు.ఉదయనిధి వ్యాఖ్యలను ‘మారణహోమానికి పిలుపు’గా అభివర్ణిస్తూ మాల్వియా చేసిన పోస్ట్లో ఎటువంటి క్రిమినల్ నేరం లేదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిని లక్ష్యంగా చేసుకుని మంత్రి ప్రసంగించారని, సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా మాల్వియా కూడా ఆ వ్యాఖ్యల బాధితుడేనని కోర్టు పేర్కొంది. డీఎంకే అనుబంధ న్యాయవాది ఫిర్యాదుతో తిరుచ్చి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కోర్టు రద్దు చేసింది.ఉద్దేశ పూర్వకంగా మాల్వియాపై శత్రుత్వాన్ని ప్రేరేపించడం, ప్రజా అల్లర్లకు కారణమవడం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్వేషపూరిత ప్రసంగం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, కేవలం ఆ ప్రసంగంపై స్పందించిన వారిపైననే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలైన మూలకారకులను విస్మరించి, బాధితులపై చర్యలకు ఉపక్రమించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.ద్రవిడ కజగం, డీఎంకే పార్టీలకు హిందూ ధర్మంపై ఉన్న వ్యతిరేకతను ఈ సందర్భంగా మాల్వియా తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, న్యాయమూర్తి దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. ఉదయనిధి తన ప్రసంగంలో పదేపదే ఉపయోగించిన ‘ఒజిప్పు’ అనే తమిళ పదానికి నిర్మూలన లేదా రద్దు చేయడం అని అర్థమని కోర్టు విశ్లేషించింది. ఇది కచ్చితంగా జాతి నిర్మూలన లేదా సాంస్కృతిక విధ్వంసాన్ని సూచిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.2023, సెప్టెంబర్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ‘కొన్ని విషయాలను మనం కేవలం వ్యతిరేకించలేం.. వాటిని సమూలంగా నిర్మూలించాలి. డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వాటిని మనం ఎలాగైతే వ్యతిరేకించకుండా అంతం చేశామో, సనాతన ధర్మాన్ని కూడా అలాగే నిర్మూలించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: ఐఐటీలో మరో విషాదం.. ఆ ఘటన మరువక ముందే.. -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి?
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు ఉదయ నిధి స్టాలిన్ సోమవారం 46వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇదే సమయంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలనే నినాదం తెర మీదకు వచ్చింది. డిసెంబరులో జరిగే యువజన మహానాడు అనంతరం ఆయనకు ప్రమోషన్ ఖాయం అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ జన్మదినాన్ని డీఎంకే యువజన విభాగం వాడవాడలా సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్నాయి. ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయ నిధి అందుకున్నారు. అదే సమయంలో డీఎంకే యూత్ నేతృత్వంలో ఉదయ నిధి కోసం ఎంగల్ అన్న ( మా అన్న)పేరిట ఓ పాటల సీడీని సిద్ధం చేసింది. అలాగే ఉదయ నిధి నటించి విజయవంతమైన మామన్నన్ చిత్రంలోని ఓ పాట ఆధారంగా మరో ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు. వీటిని మంత్రి అన్బిల్ మహేశ్ విడుదల చేశారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయ నిధి సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. తండ్రి బాటలోనే.. తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి వారసుడిగా డీఎంకే రాజకీయాల్లో ఎంకే స్టాలిన్ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. తండ్రి సీఎంగా ఉన్న కాలంలో ఆయన డిప్యూటీ సీఎంగా అధికార వ్యవహారాల్లో దూసుకెళ్లారు. తండ్రి మరణంతో డీఎంకే పగ్గాలు చేపట్టి ప్రస్తుతం సీఎంగా ద్రవిడ మోడల్ పాలన నినాదంతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో తన వారసుడు ఉదయ నిధి స్టాలిన్ను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో సినీ నటుడిగా డీఎంకే రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ నిధి ప్రజాకర్షణలో ఫలితం సాధించారు. 2021 లోక్ సభ ఎన్నికలలో తండ్రి స్టాలిన్తో సమానంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్లడమే కాదు, చేపాక్కం ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్నారు. ఏడాది తర్వాత ఆయనకు మంత్రి పదవి అప్పగించాలని పలువురు సినీయర్లు నినాదించడంతో క్రీడల శాఖను కేటాయించారు. ప్రస్తుతం డిప్యూటీ నినాదం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్ ఉంటుందా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
అధికారం కోల్పోయినా పర్వాలేదు
సాక్షి, చైన్నె : సనాతన ధర్మం నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినా పర్వాలేదని క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. వివరాలు.. సనాతన ధర్మం గురించి ఉదయ నిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు, కేసుల మోత మోగుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం రాయపేటలో ఉదయనిధి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంబేడ్కర్, పెరియార్, అన్నా వంటి మహానేతలు సనాతనం గురించి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలను తలదన్నే విధంగా తానేదో గొప్పగా మాట్లాడేసినట్టు కొందరు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. సనాతన ధర్మం వ్యవహారంలో పదవి నుంచి తప్పించినా, తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినా తగ్గేది లేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారం కోల్పోయినా బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. తమ సిద్ధాంతం ద్రవిడ మార్గం అని అధికారం తమకు ముఖ్యం కాదని, సిద్ధాంతాలే కీలకం అని వ్యాఖ్యలు చేశారు. -
కృతిక దర్శకత్వంలో ధనుష్ చిత్రం
కోలీవుడ్లో ఒక క్రేజీ చిత్ర నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సూపర్స్టార్ రజనీకాంత్ అల్లుడు, యువ నటుడు ధనుష్, డీఎంకే నేత స్టాలిన్ కోడలు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ సతీమణి కృతిక ఉదయ నిధి కలయికలో చిత్రం తెరకెక్కనుంది. కృతిక ఇప్పటికే వణక్కం చెన్నై అనే చిత్రంతో దర్శకురాలిగా తానేమిటో నిరూపించుకున్నారు. అలా గే ధనుష్ తన ఉండెర్బార్ ఫిలింస్ పతాకంపై నూతన టాలెంట్ను ప్రోత్సహిస్తూ మంచి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు కృతిక దర్శకత్వంలో చిత్రం రూపొందించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రంలో కృతిక భర్త, నటుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ చిత్రానికి సంచలన యువ సంగీత దర్శకుడు అనిరుద్ పని చేయనున్నట్లు తెలిసింది. కృతిక, అనిరుద్ ఇంతకు ముందు వణక్కం చెన్నై చిత్రానికి కలిసి పని చేయడం గమనార్హం. ధనుష్ ఒక పక్క హీరోగా హిందీలో బాల్కి దర్శకత్వంలో షమితబ్ చిత్రంతోపాటు తమిళంలో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో అనేగన్, వేల్లై ఇల్లా పట్టదారి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోపక్క శివకార్తికేయన్ హీరోగా తానా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా కృతిక దర్శకత్వంలో మరో చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.


