track and field
-
గతానికి భిన్నంగా.. తొలిసారి ఇండోర్లో అథ్లెటిక్స్ పోటీలు
భువనేశ్వర్: సంప్రదాయ అథ్లెటిక్స్కు భిన్నంగా భారత్ కూడా ఇప్పుడు ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు సిద్ధమైంది. తొలిసారిగా నేటి నుంచి జరిగే జాతీయ ఇండోర్ చాంపియన్షిప్ పోటీలకు కళింగ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. జాతీయ అథ్లెట్లందరూ సొంతగడ్డపై తొలి ఇండోర్ అనుభవానికి సిద్ధమయ్యారు. ఇండోర్ అథ్లెటిక్స్ ట్రాక్, పోటీలు భిన్నంగా ఉంటాయి. 400 మీటర్ల ట్రాక్ స్థానంలో 200 మీటర్ల ట్రాక్ ఉంటుంది. ఇటీవలే భారత్కు 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఆతిథ్య హక్కులు లభించాయి. దీంతో వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇండోర్ ఈవెంట్ల నిర్వహణ ఊపందుకోనుంది. అయితే తొలి ఇండోర్ ఈవెంట్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పాల్గొనడం లేదు. అతని ఈవెంట్ (జావెలిన్ త్రో) ఈ చాంపియన్షిప్లో లేకపోవడంతో చోప్రా అభిమానులకు ఇది నిరాశపరిచే అంశం. 3000 మీటర్ల స్టీపుల్ చేజర్ అవినాశ్ సాబ్లే కూడా ఇదే కారణంతో పోటీలకు దూరమయ్యాడు. స్ప్రింటర్ అనిమేశ్ కుజుర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రావెల్ మొట్టమొదటి జాతీయ ఇండోర్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 100 మీటర్లు, 200 మీటర్లు అవుట్డోర్ ఈవెంట్స్లో జాతీయ రికార్డు సాధించిన కుజుర్ ఇప్పుడు ఇండోర్ పోటీల్లోనూ రికార్డు నెలకొల్పేందుకు శ్రమిస్తున్నాడు. స్వరాష్ట్రం ఒడిశా తరఫున ఇండోర్ పోటీల్లో అతను 60 మీటర్ల రేసులో పోటీపడనున్నాడు. ‘నాకు ఇది తొలి ఇండోర్ ఈవెంట్. ఇక్కడ రెగ్యులర్ స్ప్రింట్ (100, 200 మీటర్లు) కాకుండా 60 మీటర్ల పోటీకి సిద్ధమయ్యాను. నిజానికి నా ప్రధాన లక్ష్యం కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు. అయితే ఇండోర్ ఈవెంట్లో నా సత్తా ఎంటో తెలుసుకునేందుకే పోటీల్లోకి దిగుతు న్నాను’ అని కుజుర్ తెలిపాడు. తమిళనాడుకు చెందిన ప్రవీణ్కు ట్రిపుల్ జంప్లో జాతీయ రికార్డు ఉంది. అయితే అతను ఈ చాంపియన్షిప్లో మాత్రం లాంగ్జంప్లో పోటీపడతాడు. హైజంప్, పోల్వాల్ట్, లాంగ్జంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్లు ఈ ఇండోర్ క్రీడల్లో ఉన్నప్పటికీ జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, హ్యామర్ త్రోలను కొన్ని కారణాల వల్ల తప్పించారు. సాధారణంగా రెగ్యులర్ అవుట్డోర్ ఈవెంట్లో ప్రత్యర్థులతో పాటు వాతావరణ సమస్యల్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ ఇండోర్ అథ్లెటిక్స్లో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. చదవండి: రాజస్థాన్లోకి షనక.. కీలక సూత్రధారి అతడే! -
జాతీయ క్రీడల్లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మూడవది
పనాజీ: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు మూడో స్వర్ణ పతకం లభించింది. సోమవారం జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి యర్రాజీ చాంపియన్గా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.22 సెకన్లలో అందరికంటే వేగంగా ఫైనల్ రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు తెలంగాణ ఖాతాలో 11వ పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వ్రితి అగర్వాల్ రజత పతకం సాధించింది. -
జోరు వర్షంలోనూ ఆగని పరుగు.. గెలిచినోళ్ల కంటే ఎక్కువ పేరు
ఆటపై ఇష్టం.. గెలవాలన్న పట్టుదల ఉంటేనే ఛాంపియన్స్గా నిలుస్తారని అంటారు. అంతిమంగా ఆటలో ఒకరే ఛాంపియన్ కావొచ్చు..ఒకవేళ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనా చివరి వరకు పోటీలో ఉండాలని కోరుకుంటారు కొందరు. ఆ కొందరి నుంచి పుట్టిందే కంబోడియాకు చెందిన అథ్లెట్ బౌ సామ్నాంగ్. ఓటమి ఖరారైనా జోరు వర్షంలోనూ సామ్నాంగ్ తన పరుగును ఆపలేదు. 5000 మీటర్ల రేసును వర్షంలోనే పూర్తి చేసి ఆటపై తనకున్న మక్కువను చూపించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం దిశగా సాగి గెలవాలన్న తన పట్టుదలను పరిచయం చేసింది. తోటి అథ్లెట్లు పక్కకు తప్పుకున్నా తాను మాత్రం లక్ష్యాన్ని వీడలేదు. అందుకే రేసులో గెలిచిన అథ్లెట్ కంటే బౌ సామ్నాంగ్కు ఎక్కువ పేరొచ్చింది. 22 నిమిషాల 52 సెకన్లలో రేసు పూర్తి చేసిన అనంతరం సామ్నాంగ్ ఎమోషనల్ అయింది. దేశ జాతీయ జెండాతో అక్కడున్న వారికి అభివాదం చేసింది. జోరు వర్షంలోనూ తన పరుగుకు మద్దతిచ్చిన అభిమానులకు కృతజ్క్షతలు తెలిపింది. రేసులో బౌ సామ్నాంగ్ ఓడినా అభిమానుల మనసులను మాత్రం గెలుచుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బౌ సామ్నాంగ్ పేరు ట్రెండింగ్లో ఉంది. కంబోడియా రాజధాని నమ్ పెన్ నగరంలో జరిగిన సౌత్ఈస్ట్ ఏషియన్ గేమ్స్లో ఈ అద్బుతం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన 5000 మీటర్ల రేసులో వియత్నాంకు చెందిన గుయన్ తి వోనా విజేతగా నిలిచింది. ఇక రేసు అనంతరం కంబోడియా ప్రధాని హున్ సన్.. బౌ సామ్నాంగ్ అంకితభావానికి ముచ్చటపడి 10వేల డాలర్లను రివార్డుగా ఇవ్వడం విశేషం. బౌ సామ్నాంగ్ను ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ) ఆకాశానికెత్తింది. రేసు ఓడిపోయి ఉండొచ్చు.. తన అంకితభావంతో విజేతను మించిపోయింది అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం బౌ సామ్నాంగ్ రేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Even if you're in last place. 🏃 Even if the weather is terrible. 🌧️ Even if it feels like you can't do it. 🚫 𝙉𝙚𝙫𝙚𝙧 𝙜𝙞𝙫𝙚 𝙪𝙥 💪 Nothing was going to stop Cambodia's Bou Samnang 🇰🇭 from finishing the women's 5,000 metre race at the #SEAGames. pic.twitter.com/iVMxwqVrFQ — The Olympic Games (@Olympics) May 9, 2023 View this post on Instagram A post shared by The Guardian (@guardian) -
'అదంతా అబద్ధం.. డబ్బు నాకు ముఖ్యం కాదు'
లెజెండరీ స్ప్రింటర్.. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైన సంగతి తెలిసిందే. కింగ్స్టన్ అనుబంధ కంపెనీలో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్లో బోల్ట్ పెట్టుబడులు పెట్టగా.. షేర్స్లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండానే అతని అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం డబ్బులు మాయం చేసిన సంస్థపై కోర్టులో కేసు వేయగా విచారణ కొనసాగుతుంది. తాజాగా బోల్ట్ తన అకౌంట్ నుంచి డబ్బులు మాయమవడంపై స్పందించాడు. కోట్ల రూపాయలు నష్టపోవడంతో బోల్ట్ మానసికంగా కుంగిపోయాడని వార్తలు వచ్చాయి. ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో బోల్ట్ ఆ వార్తలను ఖండించాడు. ''మనం కష్టపడి సంపాదించిన రూపాయి కళ్లముందే పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం నాకు బాధాకరం.. చాలా నిరాశ చెందాను. అయితే నేను మానసిక వేదనకు గురయినట్లు కొన్ని వార్తలు వినిపించాయి. ఈ విషయంలో నాకు నేను కన్ఫ్యూజ్ అయ్యను. ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నా. డబ్బు పోయినందుకు బాధగానే ఉన్నప్పటికి మనసు మాత్రం ముక్కలవ్వలేదు. ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలనేది మా లాయర్లు చూసుకుంటారు. ఆ బాధ్యతను వారికి అప్పగించాను. నా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మీకందరికి తెలుసు నాకు ముగ్గురు పిల్లలు.. వాళ్లతో పాటు నా తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో అనవసర ఒత్తిడికి గురవ్వడం ఇష్టం లేదు. ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది.'' అని చెప్పుకొచ్చాడు. 2017లో అథ్లెటిక్స్కు గుడ్బై చెప్పిన బోల్ట్.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఉసెన్ బోల్ట్ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. చదవండి: భారత్తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్ -
అదరగొడుతున్న అథ్లెట్లు.. స్టీపుల్ఛేజ్లో అవినాష్ సాబ్లేకు రజతం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు అదరగొడుతున్నారు. తొమ్మిదో రోజు వరుసగా రెండు రజతాలతో సత్తా చాటారు. తొలుత మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్తో బోణీ కొట్టగా.. తాజాగా పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. SILVER FOR SABLE🥈@avinash3000m wins a 🥈in Men's 3000m Steeplechase event at #CommonwealthGames2022 with a Personal Best and National Record (8.11.20) Congratulations Avinash. India is very proud of you 🤩#Cheer4India #India4CWG2022 pic.twitter.com/lSmP1Ws4sk — SAI Media (@Media_SAI) August 6, 2022 అవినాష్ 8:11.20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు జాతీయ రికార్డును నెలకొల్పాడు. అవినాష్.. కేవలం 0.05 సెకెన్ల తేడాతో స్వర్ణాన్ని కోల్పోయాడు. కెన్యాకు చెందిన అబ్రహామ్ కిబివోత్ (8:11.15) స్వర్ణం, అదే దేశానికి చెందిన ఆమోస్ సెరమ్ (8:16.83) కాంస్య పతకాలు సాధించారు. కాగా, ప్రస్తుత క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ ఇదివరకే మూడు పతాకలు గెలిచింది. పురుషుల హై జంప్లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్ జంప్లో శ్రీశంకర్ మురళీ రజతం, మహిళల 10000 మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి రజత పతకాలు సాధించారు. అవినాష్ పతకంతో ఈ విభాగంలో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఓవరాల్గా భారత్ 28 మెడల్స్తో (9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కంస్యాలు) నాటౌట్గా నిలిచింది. చదవండి: భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్లో ప్రియాంకకు రజతం -
భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్లో ప్రియాంకకు రజతం
కామన్వెల్త్ క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ మూడో పతకం (పురుషుల హై జంప్లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్ జంప్లో శ్రీశంకర్ మురళీ రజతం) సాధించింది. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ చేజిక్కించుకుంది. 43 నిమిషాల 38 సెకెన్లలో రేస్ను ముగించి ప్రియాంక.. కెరీర్లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయడంతో పాటు కామన్వెల్త్ క్రీడల రేస్ వాకింగ్లో పతకం గెలిచిన తొలి భారత మహిళా అథ్లెట్గా రికార్డుల్లోకెక్కింది. ప్రియాంక సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 27కు (9 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కంస్యాలు) చేరింది. మరోవైపు తొమ్మిదో రోజు బాక్సింగ్లోనూ భారత్ హవా కొనసాగింది. మహిళల 48 కేజీల విభాగంలో నీతూ గంగస్ కెనడాకి చెందిన ప్రియాంక దిల్లాన్పై అద్భుత విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. పురుషుల 51 కేజీల విభాగం సెమీ ఫైనల్లో అమిత్ పంగల్.. జాంబియా బాక్సర్ను మట్టికరిపించి ఫైనల్కు దూసుకెళ్లాడు. దీంతో ఆయా విభాగాల్లో భారత్కు రెండు పతాకలు ఖరారయ్యాయి. చదవండి: CWG 2022: 9వ రోజు భారత షెడ్యూల్ ఇదే -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టావ్.. అంత ఆశ్చర్యమెందుకు?
అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 400 మీటర్ల హార్డిల్స్లో ప్రపంచ రికార్డు బద్దలైంది. 400 మీటర్ల హార్డిల్స్లో అమెరికాకు చెందిన డబుల్ ఒలింపిక్ చాంపియన్.. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ సిడ్నీ మెక్లాఫ్లిన్ కొత్త రికార్డు నమోదు చేసింది. శనివారం ఉదయం జరిగిన 400 మీటర్ల హార్డిల్స్ ఫైనల్లో మెక్లాఫ్లిన్ 50.68 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో మెక్లాఫ్లిన్ తన రికార్డు తానే బద్దలు కొట్టింది. ఇంతకముందు 400 మీటర్ల హార్డిల్స్లో లాఫ్లిన్ బెస్ట్ టైమింగ్ 51.41 సెకన్లు. జూన్లో యూఎస్ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఔట్డోర్ చాంపియన్షిప్స్లో ఇదే వేదికపై పరిగెత్తి స్వర్ణం అందుకుంది. ఈ సందర్భంగా వరల్డ్ అథ్లెటిక్స్ అధికారిక ట్విటర్.. సిడ్నీ మెక్లాఫ్లిన్ ఫోటోను షేర్ చేస్తూ వరల్డ్ చాంపియన్.. వరల్డ్ రికార్డు.. మా సిడ్నీ మెక్లాఫ్లిన్..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక డచ్ రన్నర్ ఫెమ్కే బోల్ 52.27 సెకన్లలో గమ్యాన్ని చేరి రతజం అందుకోగా.. అమెరికాకే చెందిన మరో అథ్లెట్ దలీలా ముహమ్మద్ 53.13 సెకన్లతో కాంస్యం చేజెక్కించుకుంది. స్వర్ణ పతకం సాధించిన అనంతరం ఆమె చెప్పిన మాట.. ''సాధించడానికి ఇంకా పరిగెడుతూనే ఉంటాను.'' ఇక్కడ మరో విచిత్రమేంటంటే ఫైనల్స్ పూర్తయిన తర్వాత.. మెక్లాఫ్లిన్ విజేత అని తెలిసిన తర్వాత కూడా ఇది నిజమేనా అన్న తరహాలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్గా నిలిచింది. WORLD CHAMPION ‼️ WORLD RECORD ‼️ SYDNEY MCLAUGHLIN 🤯 OLYMPIC CHAMPION @GoSydGo 🇺🇸 DESTROYS HER OWN WORLD RECORD IN 5⃣0⃣.6⃣8⃣ TO CLAIM WORLD 400M HURDLES GOLD 🥇#WorldAthleticsChamps pic.twitter.com/Ilay0XwVz1 — World Athletics (@WorldAthletics) July 23, 2022 50.68. Watch it. Watch it again. Goosebumps all over. Sydney McLaughlin 🌟#WorldAthleticsChamps pic.twitter.com/GtQgTWLBuQ — Vinayakk (@vinayakkm) July 23, 2022 -
టాప్–10లో నీరజ్ పసిడి ప్రదర్శన
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో కనబరిచిన స్వర్ణ పతక ప్రదర్శన మరో స్థాయికి చేరింది. టోక్యో ఒలింపిక్స్లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో పది అద్భుత ఘట్టాల్లో అతని ప్రదర్శనకు స్థానం లభించిందని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) వెల్లడించింది. 23 ఏళ్ల చోప్రా ఫైనల్లో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి చాంపియన్గా నిలిచాడు. దీంతో ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారత అథ్లెట్గా చరిత్ర పుటలకెక్కాడు. ‘ఒలింపిక్స్కు ముందు నీరజ్ చోప్రా ప్రతిభ గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. విశ్వక్రీడల్లో బంగారు విజేతగా చరిత్ర సృష్టించాక అతని ప్రొఫైల్ ఆకాశాన్ని తాకింది. అంతలా అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు’ అని ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) తమ వెబ్సైట్లో పేర్కొంది. విజయం తర్వాత నీరజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘ఈ అనుభూతి అద్భుతమైంది. ఈ క్షణం నాతో చిరకాలం ఉండిపోతుంది. దేశానికి స్వర్ణం అందించేందుకు నాకు మద్దతు తెలిపినవారికి, ఆశీర్వదించిన వారికి ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు. ఇది లక్షల మందిని చేరుకుంది. ఒలింపిక్స్కు ముందు అతని ఇన్స్టాగ్రామ్లో 1,43,000 మంది ఫాలోవర్లు ఉండగా... ఒలింపిక్ చాంపియన్ అయ్యాక, ఆ పోస్ట్ పెట్టాక ఏకంగా 32 లక్షల మంది ఫాలోవర్లు జమ అయ్యారని డబ్ల్యూఏ తెలిపింది. రెండో ర్యాంక్కు నీరజ్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మరో ఘనత సాధించారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు ప్రపంచంలోనే రెండో ర్యాంకును చేరుకున్నారు. 1,315 స్కోరుతో నీరజ్ చోప్రా రెండో ర్యాంక్కు ఎగబాకాడు. కాగా 1,396 స్కోరుతో జర్మనీ ఆటగాడు జొహెనెస్ వెటెర్ అగ్రస్థానంలో నిలిచాడు. గత ర్యాంకింగ్స్లో 16వ స్థానంలో నిలిచిన నీరజ్ బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంక్కు చేరుకోవడం విశేషం. -
మీ జీవితం ఓ పాఠం...
పూర్తి పేరు: జేమ్స్ క్లీవ్లాండ్ ఓవెన్స్ జననం: సెప్టెంబర్ 12, 1913 విభాగం: ట్రాక్ మరియు ఫీల్డ్ ఒలింపిక్స్ స్వర్ణాలు: 4 (1936) మరణం: మార్చి 31, 1980 జెస్సీ ఓవెన్స్... అథ్లెటిక్స్ దిగ్గజం... అంతేనా..! అథ్లెటిక్స్లో పతకాలు సాధించిన అమెరికా క్రీడాకారుడిగానే గుర్తుంచుకోవాలా..! కాదు... జాత్యహంకారానికి క్రీడల ద్వారా సమాధానం చెప్పిన ఘనుడు... హిట్లర్కే ఎదురు నిలిచి నల్లజాతి తెగువను ప్రపంచానికి చాటిన యోధుడు... అది 1936వ సంవత్సరం. బెర్లిన్లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. తమ దేశ ఆటగాళ్లకు కాకుండా ఇతరులకు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా హిట్లర్ ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితుల్లో 100మీ. రేసును ఓవెన్స్ 10.3 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దీంతో ఓవెన్స్ను ఎక్కడ అభినందించాల్సి వస్తుందో అని ఆ నియంత అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత లాంగ్జంప్లో 8 మీటర్లు దుమికి మరో స్వర్ణం, 200మీ. పరుగును 20.7 సెకన్లలో పూర్తి చేసి మూడో స్వర్ణం, 4ఁ100మీ. రిలేలోనూ ఇదే ప్రతిభ చూపి నాలుగు స్వర్ణాలతో చరిత్ర సృష్టించి హిట్లర్ అవాక్కయ్యేలా చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తన ప్రతిభను నమ్ముకుని ముందుకు సాగిన ఓవెన్స్ సాధించిన ఈ చరిత్రాత్మక విజయానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నల్లజాతీయులంతా ఓవెన్స్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ స్వర్ణాలను ఒలింపిక్స్ వారసత్వ సంపదగా పరిగణిస్తారు. అందుకే గత నెలలో జరిగిన వేలంలో ఓవెన్స్ సాధించిన ఓ స్వర్ణానికి రూ. 9 కోట్ల ధర పలికింది.


