breaking news
on time perfomance
-
ఇండిగో చరిత్రలో చెత్త రికార్డు.. ఒక్కరోజే 550 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ అయిన ఇండిగోలో విమానాల రద్దు పరంపర గురువారం సైతం కొనసాగింది. బుధవారం 200 విమానాలు రద్దుకాగా గురువారం ఒక్కరోజే మరో 550కుపైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యలు, అననుకూల వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల రద్దీ, విమాన విధుల సమయ కాలపరిమితి(ఎఫ్డీఐఎల్) నిబంధనల అమలు వంటి సమస్యల ధాటికి ఇండిగో విమాన సర్వీసులను కంపెనీ రద్దుచేయక తప్పలేదు. సిబ్బంది కొరత, మెరుగైన జీతభత్యాల కోసం కొందరు పైలట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవులు పెట్టి వేరే చోట్ల ఇంటర్వ్యూలకు హాజరవడం వంటి మరెన్నో కారణాలు జతకలిసి ఇండిగో విమానసర్వీసులను మరింత ఆలస్యంచేస్తున్నాయి. దీంతో గురువారం దేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. సమయానికి రాకపోకలను సూచించే ఆన్టైమ్ పంక్చువాలిటీ(ఓటీపీ) విషయంలో ఇండిగో డిసెంబర్ మూడో తేదీన కేవలం 19.7 శాతాన్ని మాత్రమే చేరుకోగల్గిదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే 172 విమానాలు రద్దయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్లో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో తలెత్తిన సమస్యకు పైలట్ల కొరత సైతం కారణమన్న వార్తల నేపథ్యంలో ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఎల్పీఏ) ఘాటుగా స్పందించింది. ‘‘ నిరాటంకంగా విమానం నడిపే పైలట్ పూర్తి ఆరోగ్యంగా ఉండటం కోసం ‘కొత్త ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్’ నిబంధనల ప్రకారం పైలట్ మరింతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పైలట్ విశ్రాంతి/సెలవులో ఉంటే అదనపు పైలట్లతో విమాన సర్వీసుల్ని కొనసాగించాలి. అంతమంది పైలట్లు ఇండిగోలో లేరు. ఇటీవల ఇండిగో కొత్త పైలట్లను నియమించుకోవడం ఆపేసింది. దీంతో పైలట్ల కొరత ఏర్పడి విమానాలను రద్దుచేయాల్సి వస్తోంది’’ అని ఏఎల్పీఏ వ్యాఖ్యానించింది. ఇండిగో రోజుకు సగటున 2,300 విమానసర్వీసులను నడుపుతోంది.ఫిబ్రవరి 10దాకా ఇంతేసమస్య పూర్తిగా సద్దుమణగాలంటే ఫిబ్రవరి పదో తేదీదాకా ఆగక తప్పదని ఇండిగో గురువారం మరో బాంబు పేల్చింది. అంటే అప్పటిదాకా సమయానికి ఇండిగో విమాన రాకపోకలు సవ్యంగా ఉండకపోవచ్చని సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఈ మేరకు ఇండిగో గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు వివరణ ఇచ్చింది. ‘‘ రోజువారీ విమానాల సంఖ్యను డిసెంబర్ 8వ తేదీ నుంచి తగ్గిస్తాం. గతంలో మాదిరి విమానసర్వీసులు యథాతథ స్థాయికి చేరుకోవడానికి ఫిబ్రవరి10దాకా వేచి ఉంచాల్సి రావొచ్చు. రానున్న రోజుల్లో రద్దయ్యే విమానాల సంఖ్య భారీగా ఉండొచ్చు’’ అని ఇండిగో స్వయంగా ప్రకటించింది. -
ఆన్టైమ్లో బెస్ట్.. ఆకాశ ఎయిర్
తరచూ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికులు విమానాల ఆలస్యం, రద్దు వంటి సమస్యలతో ఎప్పుడోసారి ఇబ్బందులు పడే ఉంటారు. ఇలాంటి సమస్యలు అన్ని ఎయిర్లైన్స్లోనూ ఉంటాయి. అయితే దేశంలోని ఏయే విమానయాన సంస్థలో ఇలాంటి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయనే దానిపై పౌర విమానయాన సంస్థ తాజాగా గణాంకాలు విడుదల చేసింది. సమయ పనితీరు (ఆన్టైమ్ పర్ఫార్మెన్స్- OTP) మెరుగ్గా ఉన్న ఎయిర్లైన్స్ జాబితాలో ఆకాశ ఎయిర్ (Akasa Air) అగ్రస్థానంలో ఉంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2023 నవంబర్ నెలలో ఆకాశ ఎయిర్ సమయ పనితీరు 78.2 శాతం వద్ద ఉంది. ఇండిగో సంస్థ 77.5 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. 72.8 శాతం ఓటీపీతో విస్తారా మూడవ స్థానంలో ఉండగా స్పైస్జెట్ 41.8 శాతంతో ఆధ్వాన సమయ పనితీరును నమోదు చేసింది. ఇక అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 62.5 శాతంతో రెండో అధ్వాన ఆన్టైమ్ పర్ఫార్మెన్స్ ఎయిర్లైన్గా నిలిచింది. ఫ్లై బిగ్.. రద్దుల్లో అత్యధికం దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాలలో నమోదైన వివరాల ఆధారంగా దేశీయ విమానయాన సంస్థల ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ను లెక్కించారు. ఇక నవంబర్లో దేశీయ విమానయాన సంస్థల మొత్తం సరాసరి రద్దు రేటు 0.73 శాతంగా ఉంది. ఇందులో ఫ్లై బిగ్ అత్యధికంగా 7.64 శాతం రద్దు రేటును నమోదు చేయగా ఎయిర్ ఇండియా రద్దు రేటు అత్యల్పంగా 0.10 శాతంగా నమోదైంది. ఇండిగో విమానాల రద్దు రేటు 0.90 శాతంగా ఉంది. ఈ ఏడాది నవంబరులో దేశీయ విమానయాన సంస్థలకు సంబంధించి ప్రయాణికుల నుంచి మొత్తం 601 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదు రేటు ప్రతి 10,000 మంది ప్రయాణికులకు సుమారు 0.47గా ఉంది. ఇండియావన్ ఎయిర్పై అత్యధికంగా ప్రతి వెయ్యి మంది ప్రయాణికులకు 99.1 ఫిర్యాదులు చొప్పున నమోదయ్యాయి. ఇక విస్తారా, ఇండిగో సంస్థలు వరుసగా 0, 0.1 ఫిర్యాదు రేట్లు నమోదు చేశాయి. -
ఆలస్యం అయ్యిందో.. జీతం కట్!
ఇటీవలి కాలంలో ఎయిరిండియా విమానాలు తెగ ఆలస్యం అవుతున్నాయి. దీనిపై ఎయిర్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడమే ఇందుకు కారణమని గుర్తించి, ఇకమీదట అలా ఆలస్యంగా వస్తే జీతాల్లో కోత పెడతామని హెచ్చరించింది. ఈనెల 1 నుంచి వీటిని అమలు చేస్తోంది. ఈ ఆదేశాలను పౌరవిమానయాన రంగం ప్రధాన కార్యదర్శి సోమసుందరన్ జారీ చేశారు. ఈ ఆదేశాలు పైలట్లకు, కేబిన్ సిబ్బంది, ఇంజనీరింగ్ స్టాఫ్కు వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆఖరికి క్యాటరింగ్ చేసే వారి వల్ల కూడా ఆలస్యం అవకూడదని నిబంధనలు విధించారు. సిబ్బందిలో ఎవరికి జీతాలు ఇవ్వాలన్నా.. ఆలస్యానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిసిన తర్వాతే ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల్లో ఎయిరిండియా విమానాలే ఎక్కువగా ఆలస్యం అవుతున్నాయని సోమసుందరన్ ఇటీవల తెలిపారు. ఎయిర్ పోర్టుల వద్దనే ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఉంచామని ఎయిర్ ఇండియా కార్యదర్శి అన్నారు. అన్ని ఎయిర్ పోర్టులకూ దీన్ని అమలు చేయనున్నారు. అయితే.. ఈ నిబంధనలను సీనియర్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఎయిర్ ఇండియా ఉద్యోగుల పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ప్రయాణంలో అనుకోకుండా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని వారు ఎయిర్ ఇండియా బోర్డుకు తెలిపారు. విమానాల ఆలస్యానికి కేబిన్ సిబ్బంది కొరతే 80 శాతం కారణం అవుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు. సమయానికి విమానాలు రాకపోతే జీతాల్లో కోత ఉండటం సమంజసం కాదన్నారు.


