breaking news
Teacher jobs Appointment
-
ప్రతిభకు పాతర
తక్కువ ర్యాంక్ వారికి కాల్ లెటర్లు డీఎస్సీలో నాకు బీసీ–ఎ కేటగిరీలో 5వ ర్యాంకు వచ్చింది. ఇదే కేటగిరీలో నాకంటే ముందున్న నలుగురికి, నా తర్వాత 6, 7 ర్యాంకుల వారికి కాల్ లెటర్లు వచ్చాయి. నాకు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. అధికారులకు చెబితే వెయిట్ చేయండి అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – శెట్టి బాబూరావు, సంగం మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా18 పోస్టులుంటే 14 మందికే పిలుపు విజయనగరం జిల్లా డీఎస్సీలో ఎస్జీటీకి సంబంధించి బీసీ–ఏ విభాగంలో 18 పోస్టులు ఉన్నాయి. ఈ లెక్కన 18 మంది మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు రావాలి. అయితే ఒకటి నుంచి 14వ ర్యాంకు వరకు మాత్రమే పిలిచారు. 16వ ర్యాంకు వచ్చిన నాతో సహా 15, 17, 18 ర్యాంకుల వారికి కాల్ లెటర్లు రాలేదు. డీఈవోకు వినతిపత్రం అందజేశాం. పరిశీలిస్తామని చెప్పారు. – శ్రావ్య, విజయనగరం జిల్లా ఎస్జీటీ అభ్యర్థినిసాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: డీఎస్సీ నియామకాల్లో కూటమి ప్రభుత్వ కుతంత్రం కొత్త పుంతలు తొక్కుతోంది. అభ్యర్థులను మోసగిస్తున్న తీరు రోజుకో రూపంలో బయట పడుతోంది. కాల్ లెటర్ల జారీలో ‘టెస్టింగ్’ల పేరుతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవితవ్యాన్ని నట్టేట ముంచేసినట్టే.. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఇంకా కాల్ లెటర్లు పంపక పోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు.. వెనుక ఉన్న వారికి లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వక పోవడంపై అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. దీంతో పాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఈపీటీ) పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి, నాట్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం. ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాసవ్వలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు. ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 15 వేల మందికి పైగా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపామని అధికారులు చెబుతున్నా ‘మేము మెరిట్ లిస్టులో ఉన్నా కాల్ లెటర్లు రాలేదు’ అని చెబుతున్న వారు వేలల్లో జిల్లాల్లో కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో అంత దారుణంగా అక్రమాలు జరుగుతుంటే, అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు.. రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు దబాయించి.. తర్వాత జారుకుని..డీఎస్సీ నిర్వహణ తీరు పారదర్శకంగా, చట్టంలో పొందు పరిచిన నిబంధనల ప్రకారం కంటే.. కూటమి రాజకీయ వార్ రూమ్ నుంచి క్షణక్షణం నిర్ణయాలను మార్చుకునే అనుకూలత మధ్య సాగుతోందని విమర్శలొస్తున్నాయి. టీజీటీ–స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం చూస్తుంటే.. ప్రభుత్వం నిర్లజ్జగా తన అక్రమాల నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. తాను పొందుపరిచిన నిబంధనలను చివరి నిమిషంలో విశృంఖలంగా మార్చేసి వేలాది మంది అభ్యర్థుల జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొడుతోంది. వాస్తవానికి టీజీటీ–స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులైన గణితం, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు రాసిన వారికి ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టు అవసరం లేదని నోటిఫికేషన్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. పైగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ సిలబస్, పరీక్ష విధానం.. చివరికి హాల్ టికెట్లోనూ ఇదే అంశాన్ని పొందు పరిచారు. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు మంచి మార్కులతో అర్హత సాధించారు. తీరా, కాల్ లెటర్లు పంపే సమయంలో టీజీటీ–స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఈపీటీ పాస్ కాలేదని పేర్కొంటూ వారిని అనర్హులుగా ప్రకటించడం డీఎస్సీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. పరిస్థితిని గుర్తించిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను నేరుగా సంప్రదిస్తే.. అధికారులు దబాయింపునకు దిగారని వాపోయారు. ఆధారాలను చూపితే.. చివరికి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. అందుకు అనుగుణంగా స్పెషల్ టీజీటీ పోస్టులకు ఈపీటీ తప్పనిసరి అని ఉన్న కాలమ్ను శనివారం వెబ్సైట్ నుంచి తొలగించారు. కానీ, అర్హులకు కాల్ లెటర్లు పంపేదానిపై స్పష్టత ఇవ్వలేదు. అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలుడీఎస్సీ నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సర్టిఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడుస్తోంది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు కూడా ఆయా పరీక్షలను వేర్వేరుగా నిర్వహించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు. మెరిట్ ప్రకారం మూడు పోస్టులకు కాల్ లెటర్లు పంపాల్సి ఉన్నా, దరఖాస్తులో తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్లు పంపారు. అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా, కేవలం ఒక్క పోస్టు(ఎస్జీటీ)కే పరిమితం చేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చేసిన తీరుపై అభ్యర్థుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 46 మంది అభ్యర్థులు తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్లు వచ్చాయని రాత పూర్వకంగా డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వికలాంగుల కోటాలో తనకు అర్హత ఉన్నప్పటికీ కాల్ లెటర్ రాలేదని కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జరుగు సుమతి ఆవేదన వ్యక్తం చేశారు.విజయనగరంలో ఆందోళనమెగా డీఎస్సీలో బీసీ–ఏ రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ విజయనగరం కలెక్టరేట్లోని డీఈఓ కార్యాలయం వద్ద శనివారం ఎస్జీటీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డీఎస్సీలో మొత్తం 272 పోస్టులుండగా కేవలం 16 మందినే పిలిచారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన వారెవరికీ కాల్ లెటర్స్, మెసేజ్లు రాలేదని వాపోయారు. విజయనగరానికి చెందిన బీసీ–ఏ ఎస్జీటీ అభ్యర్థి శ్రావ్య, మరో 14 మంది డీఈఓ మాణిక్యంనాయుడును కలిసి, తమకు అర్హత ఉన్నా కాల్ లెటర్స్ రాలేదని విన్నవించారు. ఈ సందర్భంగా డీఈవో స్పందిస్తూ.. మరోసారి కమిటీ మొత్తం కూర్చొని అభ్యర్థుల డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. అప్పటికీ న్యాయం జరగలేదనుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. -
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
టీచర్ పోస్టుల భర్తీకి నో
ఏలూరు సిటీ : ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న డీఎస్సీ-14 అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారికి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో విద్యా వలంటీర్లుగా నియమిస్తామని ప్రభుత్వ ఓ ప్రకటన చేసింది. దీనిని అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే కోర్టులో ఉన్న వ్యాజ్యాలను బూచిగా చూపిస్తూ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు డొంకతిరుగుడు వ్యవహారం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో డీఎస్సీ మెరిట్లిస్ట్ కోసం వేలాదిమంది నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే సర్కారు విధానాలు వారిని వెక్కిరిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకే.. జిల్లాలో 662 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఒక్కో ఉపాధ్యాయ పోస్టుకు సగటున నెలకు రూ.25వేల వరకు వేతనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇలా నెలకు రూ.1.65 కోట్లు, ఏడాదికి రూ.19.86 కోట్లను కొత్త ఉపాధ్యాయులకు జీతాల రూపేణా నిధులు వెచ్చించాల్సి వస్తుంది. అదే విద్యా వలంటీర్లకు అయితే గతంలో ఇచ్చిన గౌరవ వేతనం కంటే రెట్టింపు ఇచ్చినా ఒక్కొక్కరికీ రూ.7వేల చొప్పున నెలకు రూ.46.34 లక్షలు, ఏడాదికి రూ.5.56 కోట్లతో సరిపెట్టేసే అవకాశం ఉంది. గతంలో డీఎడ్ అభ్యర్థులను విద్య వలంటీర్లుగా నియమించి నెలకు రూ.2,500, బీఎడ్ అభ్యర్థులకు రూ.3,500 గౌరవ వేతనంగా చెల్లించారు. ప్రస్తుతం అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.4,500 ఇస్తున్నారు. డీఎస్సీ-14 అభ్యర్థులను విద్యా వలంటీర్లుగా నియమించి వారికి రూ.7వేల గౌరవవేతనం నిర్ణయిస్తే సరిపోతుం దనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ఉపాధ్యాయులను తగ్గించేందుకు ఇలా విద్యా వలంటీర్ల పేరుతో పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం మోసగిస్తోంది నిరుద్యోగ ఉపాధ్యాయ యువతను ప్రభుత్వం కావాలనే మోసం చేస్తోంది. విద్యా వలంటీర్లుగా నియమించే పక్షంలో మాకు డీఎస్సీలో మెరిట్ వచ్చినా ఉపయోగం ఏంటి. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామనే నమ్మకంతో ఉంటే నామమాత్రపు వేతనంతో విద్యా వలంటీర్ పోస్టుతో సరిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. - ఎస్కే మస్తాన్, డీఎస్సీ అభ్యర్థి వృత్తి గౌరవాన్ని దిగజారుస్తోంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని విద్యా వలంటీర్లుగా నియమించాలనుకోవటం దారుణం. ఉపాధ్యాయ వృత్తికి ఉండే గౌరవాన్ని ప్రభుత్వం దిగజారుస్తోంది. విద్యా వలంటీర్లుగా నియమించేందుకే అయితే మాకు ఇన్ని పరీక్షలు అవసరమా? ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలి. - శ్రావణి, డీఎస్సీ అభ్యర్థి ఇందుకా మేం ఇంత కష్టపడింది విద్య వలంటీర్లుగా నియమిస్తే మాకు ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంటుంది. ఏటా ఏప్రిల్ నెల నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభించే జూన్ వరకూ వేచి ఉండాలి. చాలీచాలని జీతాలతో పనిచేసేందుకా మేం ఇంత కష్టపడింది. ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. - రాఘవేంద్రరావు, డీఎస్సీ అభ్యర్థి న్యాయ పోరాటం చేస్తాం ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 24 వేల మంది డీఎస్సీ అభ్యర్థులు పోస్టులు భర్తీ చేస్తారని ఎదురుచూసి నిరాశకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది అభ్యర్థులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోరాటం చేస్తారు. - ఎస్.రాము, కన్వీనర్, డీఎస్సీ ఉద్యోగ సాధన కమిటీ