breaking news
Tamil Nadu Film Directors Association
-
రూ. 100 కోట్లతో సినిమా నిర్మిస్తాం: ప్రొడ్యూసర్
తమిళనాడు సినీ దర్శకుల సంఘ సభ్యుల కోసం రూ.100 కోట్లతో సినిమాను నిర్మిస్తానని నిర్మాత కలైపులి ఎస్.థాను అన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో దర్శకుడు భాగ్యరాజా జట్టుపై ఆర్కే సెల్వమణి జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకారం కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఎన్నికల అధికారి సెంథిల్ నాథన్ సభ్యులతో పదవీ ప్రమాణం చేయించారు. దర్శకుడు భారతీరాజా అధ్యక్షతన దర్శకుడు విక్రమన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత కలైపులి ఎస్.థాను మాట్లాడుతూ దర్శకుల సంఘం సభ్యుల కోసం తాను రూ.100 కోట్ల బడ్జెట్తో చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నటీనటులందరూ అందులో నటించాలన్నారు. అందులో వచ్చిన లాభాన్ని దర్శకుల సంఘం, పెప్సీ సభ్యులందరూ పంచుకోవచ్చునని, ఆ చిత్రానికి దర్శకుడెవరు? కథ ఏమిటి? ఎవరెవరు నటిస్తారు అనేది దర్శకుల సంఘమే నిర్ణయించాలన్నారు. థాను నిర్ణయాన్ని సంఘం అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి స్వాగతించారు. ఆ చిత్రంలో ప్రముఖ నటీనటులదరూ నటించేలా మంచి కథను తయారుచేసిన దర్శకునికి రూ.50 లక్షలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆ చిత్రం ద్వారా వచ్చే లాభాన్ని సినీ కార్మికులందరికీ సమానంగా పంచుతామన్నారు. అదేవిధంగా సహ దర్శకులను ప్రోత్సహించే విధంగా ఏటా 70 మంది సహాయ దర్శకులతో లఘు చిత్రాలు రూపొందించడానికి సదుపాయాలు చేస్తామన్నారు. ఇకపై అసిస్టెంట్, అసోసియేట్ దర్శకులకు సంఘం ద్వారా వేతనాలను అందించనున్నట్లు వెల్లడించారు. -
62 మంది దర్శకుల అరుదైన నిర్ణయం
చెన్నై: తమిళనాడు చిత్ర దర్శకుల సంఘం అరుదైన నిర్ణయం తీసుకుంది. పరిశోధనల కోసం తమ మరణానంతరం శరీరాలను దానం చేయాలని 62 మంది దర్శకులు, మరో ఇద్దరు వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలసి అంగీకార పత్రాలను అందజేశారు. దర్శకుల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని జయలలిత అభినందించారు. సీఎంను కలిసిన వారిలో తమిళనాడు చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్తో పాటు కేఎస్ రవికుమార్, వాసు, ఆర్కే సెల్వమణి తదితరులు ఉన్నారు. పరిశోధన కోసం శరీరాన్ని దానం చేయాలని దర్శకుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో తాను వెల్లడించగా, అందరూ సానుకూలంగా స్పందించారని విక్రమన్ చెప్పారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ను స్ఫూర్తిగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కమల్ హాసన్ కూడా తన శరీరాన్ని పరిశోధనల కోసం ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. మరణానంతర శరీరాలను దానం చేసే విషయంపై దర్శకుల సంఘం జిల్లాల్లో ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని విక్రమన్ చెప్పారు.