breaking news
subhalagnam
-
వివాహేతర సంబంధం: కోటిన్నరకు భర్తను అమ్మేసింది!
భోపాల్: కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన ‘శుభలగ్నం’ సినిమా మీకు గుర్తుంది కదా. ఇందులో ఆమని తన భర్త అయిన జగపతి బాబును రోజాకు కోటి రూపాయలకు అమ్మేస్తుంది. 90లలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. తాజాగా అచ్చం ఈ సినిమాను తలపించే ఓ సంఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. 1.5 కోట్ల రూపాయలు తీసుకుని తన భర్తను మరో మహిళకు సొంతం చేసిన ఈ సంఘటన మంగళవారం భోపాల్ ఫ్యామిలీ కోర్టులో జరిగింది. ఈ కేసు స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలు.. తన తండ్రి ఆఫీసులో మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ తన తల్లితో గొడవ పడుతున్నాడంటూ ఓ బాలిక భోపాల్ పోలీసు స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు తరచూ గొడవ పడటం వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందని, దీని వల్ల తాను, తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామంటూ బాలిక పోలీసుల ముందు వాపోయింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసు విచారణను భోపాల్ ఫ్యామిలీ కోర్టుకు తరలించారు. దీంతో దీనిపై విచారణ ప్రారంభించిన ఫ్యామిలీ కోర్టు బాలిక తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ కౌన్సిలింగ్లో బాలిక తండ్రికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో కోర్టు ఆ వ్యక్తిని తన భార్యతోనే ఉండాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయితే అతడు తన ప్రియురాలితోనే ఉంటానని చెప్పాడు. అంతేగాక తన భార్య నుంచి విడాకులు కావాలని కోరాడు. దీనికి అతడి భార్య నిరాకరిస్తూ.. అతను మరో పెళ్లి చేసుకుని తన దారి తను చూసుకుంటూ తన పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించింది. అయినప్పటికి అతడు తన ప్రియురాలితోనే ఉంటానని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో కోర్టు వారికి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చింది. అయినప్పటికి సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ క్రమంలో చివరకు అతడి భార్య ఓ షరతుపై విడాకులకు అంగీకరించింది. అదేంటంటే తన భర్త ఆమెతో ఉండాలంటే సదరు మహిళ తనకు డబ్బులు చెల్లించాలని చెప్పింది. దీనికి కూడా తన భర్త ప్రియురాలు అంగీకరించడంతో ఆ మహిళ తనకు ఖరీదైన ప్లాటుతో పాటు రూ. 1.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి ఆమె భర్త ప్రియురాలు తాను సెటిల్మెంట్ క్యాష్ కింద కేవలం రూ. 27 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పింది. దీనికి సదరు మహిళ తాను అడిగింత డబ్బు చెల్లిస్తేనే విడాకులు ఇస్తానని స్పష్టం చేసింది. అయితే ఈ డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసమే తాను డిమాండ్ చేశానని, తనకు డబ్బు మీద ఆశతో కాదని పేర్కొంది. -
ముహూర్తం బాగుంది..
సాక్షి, హైదరాబాద్: మహానగరం పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే సుమారు 30 వేలకు పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. తరువాత 5వ తేదీ సోమవారం, 8వ తేదీ కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల్లో 60 వేలకు పైగా పెళ్లిళ్లు జరగవచ్చునని పురోహితులు అంచనా వేస్తున్నారు. హేవళంబి నామ సంవత్సరంలో ఇవే ఆఖరు ముహూర్తాలు కావడంతో చాలామంది ఈ ముహూర్తాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. తిరిగి శ్రీ రామనవమి తరువాతనే ముహూర్తాలు ఉండడంతో అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. దీంతో నగరంలోని అన్ని పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లకు అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. శివార్లలోని వందలాది ఫంక్షన్ హాళ్లు మూడు నెలల ముందే బుక్కయ్యాయి. డిమాండ్ను బట్టి హాళ్ల చార్జీలను భారీగా పెంచేశారు. కనీసం సైతం 20 నుంచి 30 శాతానికి ధరలు పెంచారు. డిజైనర్లు, ఈవెంట్ మేనేజర్లు, కేటరింగ్ సంస్థలు సైతం తమ చార్జీలను రెట్టింపు చేశాయి. ఇవి దివ్యమైన ముహూర్తాలు కావడమే.. ఫాల్గుణ మాసం బహుళపక్షం, ఆదివారం, హస్తా నక్షత్రం.. ఉదయం 7.29 గంటల నుంచి రాత్రి 10.50 గంటలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. 5వ తేదీ సోమవారం ఉదయం 7.20 నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు ముహూర్తాలు బాగున్నాయి. 8వ తేదీ ఉదయం 7.13 నుంచి రాత్రి 10.34 వరకు దివ్యమైన ముమూర్తాలున్నాయని పురోహితులు నిర్ణయించారు. మార్చి 27వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇప్పుడిప్పుడే వేసవి మొదలైంది. ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ మార్చి మొదటి వారంలోనే తంతు ముగించుకునేందుకు అనువుగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. చార్జీలు అ‘ధర’హో.. మరోవైపు డిమాండ్ను బట్టి ఫంక్షన్హాళ్ల యజమానులు చార్జీలను అమాంతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.3 లక్షలు వసూలు చేసినవారు ఇప్పుడు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద హాళ్లు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచేశాయి. పెళ్లి మండపాల అలంకరణ, డీజే, ఆర్కెస్ట్రా, భోజనాలు వంటి ఖర్చులన్నీ కలిసి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్థాయికి తగినట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు భరించలేని వారు తమ ఇళ్ల వద్దనే వేదికలు ఏర్పాటు చేసి పెళ్లిళ్లు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని అన్ని ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. నగరంలో పూల నుంచి బంగారం వరకు, బట్టలు, అలంకరణ వస్తువుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరుస పెళ్లిళ్ల దృష్ట్యా గత పది రోజులుగా 20 శాతం నుంచి 30 శాతం వరకు బంగారం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాల అంచనా. ఈ రోజుల్లో సుమారు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అభిప్రాయపడ్డారు. క్యాటరింగ్ కూడా మెనూను బట్టి ప్లేట్ ధర రూ.200 నుంచి రూ.700 వరకు తీసుకుంటున్నారు. పురోహితులు ఫుల్ బిజీ వరుస ముహూర్తాలతో నగరంలోని పురోహితులు బిజీ అయ్యారు. నగరంలో సుమారు 10 వేల మంది పురోహితులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒక్కొక్కరు ఈ మూడు రోజుల్లో 6 నుంచి 10 పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఇక బాజా భజంత్రీలకు డిమాండ్ పెరిగింది. గతంలో రూ.25 వేల వరకు తీసుకున్న బ్యాండ్ బృందాలు ఇప్పుడు కనీసం రూ.30 వేలు లేందే రానంటున్నాయి. అలంకరణ కోసం తెచ్చిన పూలు.. పూల ధరలకు రెక్కలు పెళ్లి పూలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. బొకేలు, డెకరేషన్ కోసం వాడే పూల ధరలూ ఆకాశన్నంటుతున్నాయి. జెర్బరా ఒక్కోటి రూ.40కి చేరుకోగా, కార్నేషన్ రూ.75 పైనే ఉంది. మండపాల అలంకరణకు విదేశీ పూలను అధికంగా వినయోగిస్తుండడంతో థాయిలాండ్ నుంచి ఆర్కిడ్ రకం పూలను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకొన్నట్లు పూలవ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.30లోపే లభించే ఆర్కిడ్ బంచ్ ఇప్పుడు రూ.250 దాటింది. ఈ బంచ్లో కేవలం 10 పూలు మాత్రమే ఉంటాయి. పూల ధరలు నగరమంతటా ఒకేలా లేవు. డిమాండ్ను బట్టి ఒక్కోచోట ఒక్కో రకంగా అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ఇవి బలమైన ముహూర్తాలు ఈ మూడు రోజులు బలమైన ముహూర్తాలు. ఇప్పటికైతే ఇది ఆహ్లాకరమైన వాతావరణం కావడంతో అందరూ ఈ ముహూర్తాలనే కోరుకుంటున్నారు. ఈ మూడు రోజులు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు అనుకూలంగా ఉన్నాయి. – డాక్టర్ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి, శృంగేరి శారద పీఠం ఆస్థాన పండితులు ఆర్డర్లు వదిలేసుకున్నాం.. పాతబస్తీ నుంచి వచ్చి డెకరేషన్లు చేస్తున్నాం. డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు నాలుగు ఫంక్షన్ హాళ్లు అలంకరించాల్సి వస్తోంది. పని ఒత్తిడి భరించలేక కొన్ని ఆర్డర్లను వదిలేసుకున్నాం. ధర ఎంతైనా చెల్లించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. కానీ శక్తికి మించి పని చేయలేం కదా. – అబిద్, స్టేజ్ డెకరేషన్ నిర్వహకుడు -
దేవుడు నాకు అన్నీ ఆలస్యంగానే ఇస్తాడు...
తెలుగింటి మధ్యతరగతి ఇల్లాలంటే ఎలా ఉంటుంది? కొంచెం కారంగా... ఇంకొంచెం గారంగా... మరికొంచెం మమకారంగా... కాస్తంత వెటకారంగా... అసలు ఇదంతా ఎందుకు? అచ్చం ఆమనిలా ఉంటుందంటే సరిపోతుందిగా. నిజమే... ఆమె చేసిన పాత్రలన్నీ అలాంటివే. శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం, శుభసంకల్పం, ఆ నలుగురు... కన్నడ అమ్మాయి అయిన ఆమని ఇలాంటి సినిమాలతో తెలుగింటి పిల్ల అయిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై అప్పుడప్పుడూ తళుక్కుమంటోన్న ఆమని గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ చదివితే కొంతలో కొంతైనా ఆ లోటు తీరుతుంది. మీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా అనిపిస్తోంది? తృప్తికరంగా ఉంది. ఇప్పుడిప్పుడే మంచి పాత్రలకు అవకాశం వస్తోంది. ‘ఆ నలుగురు’ తర్వాత ‘దేవస్థానం’కి దాదాపు ఎనిమిదేళ్లు విరామం తీసుకున్నారు. మళ్లీ రెండేళ్లకు ‘చందమామ కథలు’ చేశారు. ఎందుకీ గ్యాప్? ‘ఆ నలుగురు’ తర్వాత నాకు మంచి పాత్రలు రాలేదు. వచ్చినవి కూడా నా వయసుకు మించిన పాత్రలు కావడంతో నేనే ఆసక్తి కనబరచలేదు. నాలుగు పదుల వయసులో ఉన్నా మరీ ముసలి వయసు పాత్రలు చేయడం సరిగ్గా అనిపించలేదు. అందుకే తిరస్కరించా. ఒకవేళ నేను వృద్ధ పాత్ర చేసినా, సినిమాలో దానికో అర్థం ఉండాలి. అలాంటివైతే తప్పకుండా చేస్తా. రానున్న మీ ‘చందమామ కథలు’లో మీకు నచ్చిన అంశాలేంటి? నా కెరీర్లో ఇప్పటివరకు నేనిలాంటి సినిమా చేయలేదు. ఒక సినిమాలో ఎనిమిది కథలు అనగానే, భలే అనిపించింది. అన్ని కథలూ బాగుంటాయి. పెద్ద నరేష్ గారిది, నాదీ ఒక కథ. స్వచ్ఛమైన ప్రేమ కలకాలం నిలుస్తుందనీ, ప్రతి ఒక్కరికీ ఒక తోడు కావాలనీ మా కథ చెబుతుంది. తెలుగులో నా తొలి హీరో నరేష్. ‘జంబలకిడి పంబ’ తర్వాత ఇద్దరం కొన్ని సినిమాలు చేశాం. మళ్లీ ఇన్నేళ్లకు మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒకసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళితే.. కథానాయికగా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. అది తొందరపాటని ఎప్పుడైనా అనిపించిందా? లేదు. అప్పటికే చాలా సినిమాలు చేసేశాను. ఇక, జీవితంలో స్థిరపడితే బాగుంటుందనే ఆలోచన బలంగా ఉండటంతో పెళ్లి చేసుకున్నాను. ‘ఇన్నేళ్లూ తీరిక లేకుండా సినిమాలు చేశావ్ కదా.. ఇక విశ్రాంతి తీసుకో’ అని మావారు అనడంతో, సినిమాలు చేయలేదు. మీది ప్రేమ వివాహం... పైగా మతాంతర వివాహం కాబట్టి, అత్తగారింట్లో సర్దుకుపోవడానికి ఏమైనా ఇబ్బంది అనిపించిందా? నాకు కుల, మతాల పట్టింపు లేదు. కానీ, అత్తగారింటి వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పట్టింది. ఏ ఆడపిల్ల విషయంలో అయినా ఇది సహజమే కదా. అయితే, మా ఇల్లు సర్వమత సమ్మేళనం అనొచ్చు. అన్ని దేవుళ్లూ ఒకటే అని మా భావన. దేవాలయాలతో పాటు దర్గాలకూ, చర్చిలకూ వెళతాను. మావారు కూడా నాలానే! గతంలో ఆయన సినిమాలు నిర్మించేవారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మళ్లీ సినిమాల్లో నటించాలని అనిపించడానికి కారణం? కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి తీరిక లేనంతగా పని చేసిన తర్వాత ఒక్కసారిగా ఖాళీగా ఉంటే, కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత బోర్ కొట్టడం, బాధ కలగడం రెండూ జరుగుతాయి. అలాంటి పరిస్థితిలోనే నేను మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకున్నాను. సినీ ప్రపంచంలోని జోష్కి దూరం కావాలని దాదాపు ఎవరూ అనుకోరు. మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నానని మావారితో అనగానే ‘ఓకే’ అన్నారు. మీ వైవాహిక జీవితంలో ఏవో ఆటుపోట్లు ఎదురయ్యాయని వార్త వచ్చిందే! నా వైవాహిక జీవితం బాగుంది. నాకూ, మావారికీ మధ్య ఎలాంటి మనస్పర్థలూ లేవు. హైదరాబాద్కు మారిపోవచ్చు కదా అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. మావారు స్థిరపడింది చెన్నై అని తెలిసిందే. మా అత్తగారింటిని వదులుకుని నేను హైదరాబాద్కు రాలేను. కానీ, నా కారణంగా షూటింగ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. అందుకే, హైదరాబాద్కు మారకపోయినా ఫరవాలేదు. ఒకవేళ నా వైవాహిక జీవితం గనక సరిగ్గా లేకపోతే, నేను హైదరాబాద్కు షిప్ట్ అయిపోయి ఉండేదాన్ని కదా! సినిమాలపరంగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న మీరు ఆ మధ్య వివాదాల్లో నిలిచారు. మీరు తనను హింసించారంటూ మీ మరదలు పేర్కొన్నారు కదా? డబ్బులు ఆశించి ఆడిన డ్రామా అది. నా సోదరుడు, అతని భార్య విడిపోవాలనుకున్నారు. కానీ, నన్ను కూడా వివాదంలోకి లాగితే డబ్బులు తీసుకోవచ్చు కదా! వాళ్లు అనుకున్నది సాధించారు. అది సాధించే క్రమంలో లేనిపోని దుష్ర్పచారంతో నన్ను చెడ్డదాన్ని చేశారు. నేనేంటో, నా స్వభావం ఎలాంటిదో సినిమా పరిశ్రమలో ఉన్న అందరికీ తెలుసు. షూటింగ్ లొకేషన్లో ఎంత క్రమశిక్షణగా ఉంటానో, అందరినీ ఎలా గౌరవిస్తానో కూడా తెలుసు. నేను వరకట్నం కోసం వేధించానని నిందించారు. కథానాయికగా ఓ ఏడెనిమిదేళ్లు విరామం లేకుండా సినిమాలు చేసి, చాలా డబ్బు సంపాదించుకున్నాను. ఇక, నాకు వేరేవాళ్ల డబ్బు ఎందుకు? ఒక్కసారిగా ఇలాంటి వివాదంలో ఇరుక్కున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాధపడ్డా. ఆ అమ్మాయి నాతో బాగానే మాట్లాడేది. నిజానికి తాను నన్ను నిందించలేదనీ, అదంతా మీడియా వాళ్ల సృష్టే అనీ ఆ తరువాత ఓ సందర్భంలో పేర్కొంది. కానీ, పనిగట్టుకుని అలా చేయాల్సిన అవసరం మీడియాకు ఎందుకుంటుంది? నన్ను బజారుకీడ్చడానికి ప్రయత్నం చేయలేదంటూ ఆమె నన్ను నమ్మించే ప్రయత్నం చేసింది. నేనేమీ అనలేదు. అంతా ఆ పైవాడు చూసుకుంటాడని వదిలేశాను. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా మా మధ్య గొడవలేం లేవు. తను, నా సోదరుడు నాతో బాగానే ఉంటున్నారు. వాళ్ల పిల్లలను నా సొంత పిల్లల్లా చూసుకుంటాను. మరి.. మీ పిల్లల గురించి..? ఇంకా లేరు. ఆ దేవుడు నాకన్నీ ఆలస్యంగానే ఇస్తాడు. ఇది కూడా అంతే అనుకుంటున్నాను. కానీ, ఆలస్యంగా ఇచ్చినవన్నీ నాకు ఆనందాన్నే ఇచ్చాయి. కాబట్టి, ఈ ఆనందాన్ని కూడా చవి చూస్తాననే నమ్మకం ఉంది. అన్నీ ఆలస్యంగా అంటే.. సినిమాల్లో అవకాశాలకి చాలా కష్టాలు పడ్డారా? కొంతమంది నాయికల్లా సులువుగా హీరోయిన్ను అయిపోలేదు. చాలా కష్టాలు పడ్డా. అవకాశాలు తెచ్చుకోవడానికి సమయం పట్టింది. అందుకే నాకు ఆ విలువ తెలుసు. సినిమా మీద ప్రేమే కాదు భక్తి కూడా ఉంది నాకు. హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా? మా నాన్నగారు చలనచిత్రాల పంపిణీదారుడిగా చేసేవారు. కానీ, నేను పెరిగి పెద్దయ్యేసరికే విరమించుకున్నారు. దాంతో సినిమా రంగంలో ఉన్నవాళ్లతో టచ్లో లేరు. నాకేమో చిన్నప్పటి నుంచీ హీరోయిన్ కావాలని ఉండేది. కానీ, హీరోయిన్గా అంటే నాన్న ఒప్పుకోలేదు. అమ్మ ప్రోత్సహించడంతో చెన్నైలో ఉన్న మా బంధువు ఇంటికెళ్లాను. ఆయన కూడా సినిమా రంగానికి చెందినవారే. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయేవి. చివరికి ‘పుదియ కాట్రు’ అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేసినా, తెలుగులో వచ్చినంత గుర్తింపు రాలేదు. ఇక్కడ ‘మిస్టర్ పెళ్లాం’, ‘జంబలకిడి పంబ’, ‘శుభలగ్నం’... ఇలా మంచి మంచి సినిమాల్లో అవకాశం వచ్చింది. మాతృభాష కన్నడంలో కన్నా తెలుగులో పేరు రావడం పట్ల మీ ఫీలింగ్? ఇక్కడ గొప్ప గొప్ప పాత్రలు చేశాను. ఇప్పటికీ నన్ను చాలామంది ‘శుభలగ్నం ఆమని’ అంటున్నారు. నన్ను తమ కుటుంబ సభ్యురాలిలా ప్రేక్షక జనం భావిస్తున్నారు. ఏ నటికైనా ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. ఇంతకీ మీ అసలు పేరు? వెండితెరపై మిమ్మల్ని ‘ఆమని’ని చేసిందెవరు? నా అసలు పేరు మంజుల. దర్శకులు ఇ.వి.వి. సత్యనారాయణ గారే నా పేరును ‘ఆమని’ అని మార్చారు. ‘నీ పేరు మార్చేశాం’ అని ఒకరోజు ఆయన చెబితేనే తెలిసింది... ‘ఆమని’ అని పెట్టారని. సినిమా రంగంలో మీకు అత్యంత సన్నిహిత మిత్రులెవరు? సౌందర్య, నేను ప్రాణ స్నేహితురాళ్లలా ఉండేవాళ్లం. ఇద్దరం బెంగళూరు వాళ్లమే. మా మధ్య స్నేహం పెరగడానికి అదో కారణం కావచ్చు. ఎందుకంటే, ఎప్పుడైనా షూటింగ్స్లో విరామం దొరికి, బెంగళూరులో ఉన్నామనుకోండి... తప్పకుండా కలిసేవాళ్లం. సౌందర్య వాళ్ల అమ్మ నన్ను కూడా ఓ కూతురు అనుకుంటారు. నేను, సౌందర్య వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేంత ఆప్తమిత్రులం. ఆమె మరణం నిజం కాకపోయి ఉంటే బాగుండు అని ఇప్పటికీ అనిపిస్తుంటుంది. ఆ మధ్య ఓ టీవీ షో చేశారు. మళ్లీ అలాంటి ఆలోచన ఉందా? అది సరదాగా చేశాను. ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి, టీవీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. ఇప్పుడూ అంతే. కాకపోతే మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను. - డి.జి. భవాని