Spot billing agency
-
ప్రభుత్వ సొంత ప్రచారానికి ఈపీడీసీఎల్ నిధులు?
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా ఈపీడీసీఎల్ స్పాట్ బిల్లింగ్ రీడర్లు, కాంట్రాక్టర్ల పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓటర్లకు గాలం వేసేందుకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ పేరిట ప్రచారం చేస్తోంది. దీనికయ్యే ఖర్చు మొత్తం ఈపీడీసీఎల్ నిధుల నుంచి మళ్లించడంతో వీరికి జీతాలు నిలిచిపోయాయి. దీంతో ఉగాది పండగ పూట సైతం ఆనందం లేకుండా పోతోందని వాపోతున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఈ మీటర్ల నుంచి సుమారు రెండు వేల మంది స్పాట్ బిల్లింగ్ రీడర్లు విద్యుత్ రీడింగ్ను నమోదు చేస్తుంటారు. వీరికి ప్రతినెలా పీస్ రేటు కింద, ఈ కాంట్రాక్టర్లకు సూపర్వైజింగ్ చార్జీలు కింద ప్రతినెలా ఒకట్రెండు తేదీల్లో చెల్లింపులు చేస్తోంది. స్పాట్ బిల్లింగ్ రీడర్లకు మీటరుకు ఈపీఎఫ్, ఈఎస్ఐలతో కలుపుకుని దాదాపు రూ.3, కాంట్రాక్టర్లకు రూపాయి చొప్పున ఇస్తోంది. ఇలా నెలకు రీడర్లకు రూ.కోటిన్నర, కాంట్రాక్టర్లకు రూ.55 లక్షలు వెరసి రూ.2 కోట్ల వరకు చెల్లిస్తోంది. అయితే వీరికి మార్చి నెలకు సంబంధించి చెల్లింపులు ఇప్పటివరకు చేయలేదు. ఈపీడీసీఎల్లో నిధుల కొరత వల్లే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, నష్టాల్లో ఉన్న ఈపీడీసీఎల్ చెల్లింపులకు అవస్థలు పడుతోంది. గత నెలలో ఒక భారీ పేమెంట్ జరగడంతో ఆ నెల చెల్లింపుల బెడద నుంచి గట్టెక్కినట్టు చెబుతున్నారు. నిధులు మళ్లించారా? రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ముఖ్యమంత్రి దీనిని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వం వీరికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపే రేడియం స్టిక్కర్లను ముద్రించి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదార్ల ఇళ్లకు అంటించే ప్రక్రియను చేపట్టారు. ఈపీడీసీఎల్ పరిధిలో దాదాపు 10 లక్షల ఎస్సీ, ఎస్టీ కనెక్షన్లున్నాయి. వీటికయిన ఖర్చుకు ఈపీడీసీఎల్ నిధులు మళ్లించినట్టు చెబుతున్నారు. దీంతో స్పాట్ బిల్లింగ్ రీడర్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులకు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈపీడీసీఎల్ సీజీఎం (ఎక్స్పెండిచర్) జీ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా గురువారం చెల్లింపులకు అవసరమైన చర్యలు చేపట్టామని, లెటరాఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)లు ఇచ్చామని, నిధులకు ఇబ్బంది లేదని తెలిపారు. అయితే దీనిని కాంట్రాక్టర్లు, స్పాట్ బిల్లింగ్ రీడర్లు ఖండిస్తున్నారు. ఇప్పటికీ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎల్వోసీలు విడుదల కాలేదని, శుక్ర, శని, ఆదివారాలు బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో సోమ, మంగళవారాల వరకు చెల్లింపుల ప్రక్రియ చేసే అవకాశం లేదని వాపోతున్నారు. -
బిల్లుపోటు
‘ఈపీడీసీఎల్’కు స్పాట్బిల్లింగ్ సమస్య అలకబూనిన కాంట్రాక్టర్లు లేటుతో వినియోగదారులకు వాత సవరణ తెచ్చిన సీఎండీ ససేమిరాఅంటున్న కాంట్రాక్టర్లు విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)కు బిల్లుపోటు ఎదురైంది. ఇది చార్జీల పోటుకాదు. స్పాట్ బిల్లింగ్ తలనొప్పి. స్పాట్ బిల్లింగ్ ఏజెన్సీలు, యాజమాన్యానికి మధ్య వివాదం చినికి చినికి గాలి వానలా మారుతోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో కాంట్రాక్టర్లు స్పాట్ బిల్లింగ్ తీయమంటూ నిలిపివేశారు. సీఎండీ మాత్రం నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో 52లక్షల 73వేల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వారి నుంచి ప్రతినెలా రూ.511కోట్ల రూపాయల బిల్లులను సంస్థ వసూలు చేస్తోంది. సర్వీసుల మీటర్ రీడింగ్ , బిల్లుల పనిని ప్రతి జిల్లాలో సుమారు 200 మంది ప్రైవేట్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరు ప్రతినెలా 4వ తేదీ నుండి 11వ తేదీ వరకూ ఓ స్లాట్లో, 14 నుంచి 21వరకూ మరోస్లాట్లో మీటర్ రీడింగ్ తీయాలి. గత కొన్నేళ్లుగా ఇదే నడుస్తోంది. కాంట్రాక్టర్లు గడువులోపు బిల్లులు ఇవ్వలేకపోతున్నారని, రీడింగ్ ఆలస్యమవడంతో స్లాబ్ మారిపోయి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని సీఎండీ ఆర్ ముత్యాలరాజుకు వినియోగదారుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. పలువురు కాంట్రాక్టర్లు తక్కువ మంది సిబ్బందితో కాలం వెళ్లదీస్తూ బిల్లులు ఆలస్యం చేస్తున్నారని గుర్తించిన సీఎండీ గడువులోపు రీడింగ్తీయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో కాంట్రాక్టర్లు టేబుల్ రీడింగ్తో (ఒక చోట కూర్చొని అంచనా) బిల్లులు ఇచ్చేయడం ప్రారంభించారు. ఫలితంగా బిల్లుల్లో మరలా తప్పులు దొర్లి వినియోగదారులపై భారం పడుతోంది. దీనిని గమనించిన సీఎండీ స్పాట్ బిల్లింగ్లో సమూల మార్పులు అవసరమని భావించి దాని ప్రకారం రేట్లు నిర్ణయించారు. సర్వీసుకి రూ.1.85 నుంచి రూ.2.31పైసలు కమిషన్గా నిర్ధారించారు. రేట్లు తక్కువగా ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. సీఎండీ తన నిర్ణయాన్ని సవరించేది లేదని తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. మార్చి 31తో ఏజెన్సీల కాంట్రాక్టు గడువు ముగిసింది. కొత్త కాంట్రాక్టు కుదిరేవరకూ పాత కొనసాగవచ్చని సీఎండీ చెప్పడంతో వీరు బిల్లింగ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా పశ్చిమగోదావరి జిల్లాలో కాంట్రాక్టర్లు బిల్ రీడింగ్ నిలిపివేశారు. దీంతో ఈపీడీసీఎల్ తాత్కాలిక సిబ్బంది, శాశ్వత సిబ్బందితో రీడింగ్ తీయిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో వచ్చే నెల నుంచి బిల్లింగ్ చేయమంటున్నారు. అగ్రిమెంట్ కాలాన్ని రెండేళ్లు చేయాలని, స్పాట్ బిల్లింగ్ రేట్లను 33 శాతానికి పెంచి కొత్త రేట్లు నిర్ణయించాలని,సబ్ డివిజన్ వారీగా పిలిచిన టెండర్లను మార్చి సెక్షన్ వారీగా పిలవాలని డిమాండ్లతో స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు బిల్లు తీయకుండా, టెండరులో పాల్గొనకుండా నిరసన తెలుపుతున్నారు. రేట్లు తక్కువేం కాదు: ‘‘స్పాట్ బిల్లింగ్ రేట్లు ఓవరల్గా చూస్తే గతం కంటే ఎక్కువగానే ఉన్నాయి. మీటర్ రీడర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ కట్టాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు సెక్షన్ వారీ టెండర్లకు పట్టుబడుతున్నారు. సెక్షన్కు ఐదుగురికి మించి ఉండరు కనుక ఆ నిబంధనలు వర్తించవని వారి ఆలోచన. కానీ అలా చేయడం వల్ల మీటర్ రీడర్లు నష్టపోతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కనీసం డివిజన్ వారీగా టెంటర్లు వేయమన్నాం. అదీ కుదరదంటే మేం చేయగలిగింది ఏమీ లేదు. ప్రత్యామ్నాయాలు చూస్తాం.’’ - ఆర్.ముత్యాలరాజు, సీఎండీ, ఈపీడీసీఎల్