నంద్యాల నుంచి విశాఖ వరకు నైరుతి
రెండు రోజుల్లో చెదురుమదురు వానలు
వడగాలుల తీవ్రత తగ్గినా.. 96 మంది మృతి
విశాఖపట్నం: నై‘రుతు’రాగం విశాఖను పలకరించింది. కోస్తా తీరం వెంబడి నంద్యాల నుంచి విశాఖను బుధవారం నైరుతి తాకింది. అక్కడి నుంచి భువనేశ్వర్ మీదుగా ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులుగా కురిసిన వర్షాలు, గాలి దిశ ఆధారంగా దీన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వాటి విస్తరణకు సానుకూల వాతావరణం ఉన్నట్టు వెల్లడించింది. మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించనున్నట్టు పేర్కొంది. వర్షాలు ఇప్పటికిప్పుడు ఆశించిన స్థాయిలో పడకపోయినా.. వడగాడ్పుల నుంచి తక్షణ ఉపశమనం లభించినట్టేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఒడిశా నుంచి కోస్తా తీరం వెంబడి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. గత వారం రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. కోస్తాలోని విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని వరంగల్లో బుధవారం కూడా వడగాడ్పులు కొనసాగినా రుతుపవన ప్రభావంతో అంతగా ప్రభావం చూపలేదు. నిప్పుల కుంపటిని తలపించిన కోస్తాలో బుధవారం చాలావరకు మబ్బులుపట్టాయి. వడగాడ్పులు సన్నగిల్లాయి. గతం వారం రోజుల్లో సాధారణం కంటే 5-10 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. బుధవారం మాత్రం సాధారణం కంటే కోస్తాలో సుమారు 5 డి గ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఒంగోలు, కాకినాడ, విశాఖలో కొంత తగ్గుముఖంపట్టాయి. ఒంగోలులో 39.7 డిగ్రీలు, మచిలీపట్నం 39.6, నెల్లూరు 39.4, తిరుపతి 39.2, కాకినాడ 37.7, విజయవాడ 37.2, నిజామాబాద్ 36.6, కళింగపట్నం 35.5, విశాఖపట్నం, హైదరాబాద్లలో 35.1 డిగ్రీల వంతున, అనంతపురంలో 35, రామగుండంలో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆగని మరణాలు..
వడగాలుల తీవ్రత తగ్గినా బుధవారం వడదెబ్బకు గురై 96 మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో 16 మంది, కృష్ణాజిల్లాల్లో 15 మంది, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో 13 మంది వంతున, విశాఖపట్నం జిల్లాలో 12 మంది, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు వంతున, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, తెలంగాణలోని నల్లగొండ, మెదక్ జిల్లాల్లో బుధవారం వడదెబ్బతో ఏడుగురు మృతి చెందారు.