breaking news
Shri Rama
-
శ్రీరాముని రూపంలో మహాకాళేశ్వరుడు
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చాడు. నేడు (బుధవారం) తెల్లవారుజామున నాలుగు గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి నిర్వహించారు. గర్భగుడిలోని స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేసి, వివిధ పూజలు చేశారు. హారతి అనంతరం మహాకాళేశ్వరునికి వెండి కిరీటం, రుద్రాక్ష మాల ధరింపజేశారు. భస్మ హారతి సమయాన మహాకాళేశ్వరుణ్ణి శ్రీరాముని రూపంలో అలంకరించారు. అనంతరం మహాకాళ్వేర జ్యోతిర్లింగాన్ని వస్త్రంతో కప్పి, అస్థికలను సమర్పించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు మహాకాళేశ్వరుని దివ్య దర్శనాన్ని చేసుకున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీ మహాకాళ్ నినాదాలతో మారుమోగిపోయాయి. -
ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట కార్యక్రమం
-
రామరాజ్యానికి అర్థం అదే!
ఆశ్రమంలో వశిష్ఠుడు, అరుంధతి శ్రీరామకల్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పదిరోజులు ముందుగానే చలువ పందిళ్లు వేయించారు. కల్యాణానికి వచ్చేవారందరూ కమనీయంగా ఆ వేడుక చూడటం కోసం ఈత ఆకులు, తాటి ఆకుల చాపలు సిద్ధం చేశాడు. పానకం, వడపప్పుకు కావలసిన సంభారాలన్నీ దండిగా ఇచ్చింది కామధేనువు. అన్నీ సిద్ధమయ్యాయి. అరుంధతి వశిష్ఠులవారిని సమీపించి–‘‘స్వామీ! తెల్లవారితే శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుందనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ఆయన అడవుల పాలయ్యాడు కదా. ఆయన ఎంత స్థితప్రజ్ఞుడో కదా! నాకొక సందేహం స్వామీ! ఇన్ని వేల సంవత్సరాలుగా సీతారాముల కల్యాణం ఎందుకు జరిపిస్తున్నారు. రామావతారానికి ముందు, తరువాత కూడా అవతారాలున్నాయి కదా! ఈ రాముడికే ఎందుకు ఇంత వైభోగం. మీరు ఆయన కులపురోహితులు, రాముల వారిని దగ్గర నుంచి చూశారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన సుగుణాలు మీకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియవు! ఏ కారణంగా ఆయనకు నేటికీ కల్యాణం జరుపుతున్నారు. రామరాజ్యం అనే పేరే ఎందుకు స్థిరపడిపోయింది. రామరాజ్యాన్ని అధిగమించే రాజ్యమే రాలేదా!’’ అని ప్రశ్నించింది అరుంధతి. వశిష్ఠుడు గంభీరంగా నవ్వుతూ, ‘‘అరుంధతీ! నా రాముడని నేను గొప్పలు చెప్పడం కాదు కానీ, దశరథ మహారాజుని మించినవాడు నా రాముడు. దశరథుడి పాలన కూడా అద్భుతంగానే సాగింది. కాని ఆయన ముగ్గురిని వివాహం చేసుకున్న కారణంగా, కన్నకొడుకుని అడవుల పాలు చేయవలసి వచ్చింది. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు కదా! ఆ విషయం పక్కన పెడితే –రామపట్టాభిషేకానికి ముందురోజు దశరథుడు రాముడిని పిలిచి, ‘నాయనా! ఈ కోసల రాజ్య ప్రముఖులందరూ రేపు ఉదయం నిన్ను పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. కనక పట్టాభిషిక్తుడు కావలసిన రాజనందనుడు ఏ నియమవ్రతాలు అనుసరించాలో గురువులు చెబుతారు. ఆ ప్రకారం ఈ రాత్రి గడుపు. ఉదయమే మంగళ స్నానానంతరం పట్టాభిషేకం చేస్తారు’ అని నా దగ్గరకు పంపాడు. నేను నా రామునికి ధర్మశాస్త్రం వివరించి, సింహాసనం అధివసించేవాడు, రాత్రి ఉపవసించి, కటిక నేల మీద దర్భాసనం పరిచి పడుకోవాలి. తెల్లవారేవరకూ మౌనంగా ఉండాలి. రాజభోగాలు అనుభవించడానికి అన్ని అధికారాలూ లభించే క్షణంలో తిండి లేకుండా, రాతి నేల మీద పడుకుని, స్నేహితులతో, భార్యతో ముచ్చటలాడుకునే అవకాశం లేకుండా రాత్రి గడపాలి’ అని వివరించాను.‘‘దేని కోసం ఈ నియమం?’’ అని అమాయకంగా ప్రశ్నించింది అరుంధతి.రాజు కాబోయేవానికి తన ప్రజల ఆకలి బాధ తెలియాలి. దారిపక్కన చెట్టు నీడన కాపురం చేస్తూ బండ రాళ్ల మధ్య నిద్రించేవారి బాధ వంటబట్టాలి. రాజ్యం చేతికందనున్న సమయంలో ఆవేశం పెరిగి ‘అవి చేస్తాం, ఇవి చేస్తాం’ అని వాగ్దానాలు చేయకూడదు, చెయ్యవలసిన లోక క్షేమంకర పథకాలను ఆలోచించుకుని, ఆచరణలో వచ్చే కష్టసుఖాలు తెలుసుకోవాలి. అప్పుడు సింహాసనం ఎక్కినవాడు ప్రజల జీవితావసర కార్యాలు నిరాఘాటంగా నిర్వహించగలుగుతాడు, వారి బాధలను గ్రహించి పరిష్కారం చేయగలిగి, అందరి అభిమానాన్నీ పొందగలుగుతాడు’ అని వివరించాను అన్నాడు.‘‘మరి రాముడు మీ ఆదేశాలను ఆచరించాడా మహర్షీ!’’ అంది అరుంధతి.‘‘నా ఆదేశాలను పాటించి, రామభద్రుడు ఉపవాస నియమంతో, అధశ్శయనంతో, మౌనంగా ఆ రాత్రి గడిపాడు. అందుకే రాముడు ధర్మానికి ప్రతీక అయ్యాడు’’ అన్నాడు వశిష్ఠుడు.తండ్రి మాటలకు మారుమాటాడకుండా నా దగ్గరకు రావటమే కాదు, నేను చెప్పిన నియమాలను కూడా త్రికరణశుద్ధిగా అనుసరించాడు. ‘ఇలా ఎందుకు చేయాలి?’ అని ఎదురు ప్రశ్నించని సుగుణాభిరాముడు నా రాముడు.... అని కించిత్ గర్వంగా అన్నాడు వశిష్ఠుడు, తన శిష్యుడి వినయాన్ని మనసులోనే అభినందిస్తూ. ‘‘రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం కదా! ఆయనకు కూడా ఇన్ని నియమాలు విధించారా స్వామీ!’’ అన్నది అరుంధతి.‘‘మానవరూపంలో ప్రభవించాక పరమేశ్వరుడైనా, ఆదిగర్భేశ్వరి అయినా మానవ ధర్మాన్ని ఆచరించి ఆదర్శం చూపాలి’’ అన్నాడు కులగురువులు వశిష్ఠులు.‘‘ప్రజల కష్టం తెలుసుకోలేని వాడికి రాజు కాగల అర్హత లేదు. కష్టాలను స్వయంగా అనుభవించాలి. రాజుకి ఆకలి బాధ తెలియాలి, కటిక నేల మీద నిద్రించేవాడి బాధ తెలియాలి, బంధువులకు పదవులు కట్టబెట్టకూడదని తెలియాలి. అయినవారికి అనుకూలంగా ప్రవర్తించేవాడికి రాజు కాగల అర్హత లేదని తెలుసుకోవాలి. ఇవన్నీ నా రాముడికి నేను తెలియచెప్పాను. గురువునైన నా ఆజ్ఞను త్రికరణశుద్ధిగా అనుసరించిన నా రాముడు జగదభిరాముడు కాకుండా ఉండగలడా, ఆయన పరిపాలన రామరాజ్యం కాకుండా ఉంటుందా అరుంధతీ!’’ అన్నాడు వశిష్ఠుడు.ఈ దృష్టితో రామాయణం చదివి వివేకంతో వ్యవహరించేవారు అధికారంలో ఉంటే అశేషప్రజల జీవితం ప్రశాంతంగా సాగుతుందని రాముడి నడవడిక ద్వారా తెలియచెప్పాడు ఆదికవి వాల్మీకి. – డా. వైజయంతి పురాణపండ -
దేశంలోనే అపురూపం శేషశయన రాముడు
పుణ్య తీర్థం ►సకల దేవతల నెలవుగా ప్రతీతి ►గ్రహబాధల నుండి విముక్తి ►చీమకుర్తి కోటకట్ల వారి వీధిలో ఆలయం ఎక్కడైనా శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమత్సమేతుడై దర్శనమిస్తాడు. అయితే ఆదిశేషువుపై శ్రీరాముడు శయనించిన స్థితిలో ఉన్న విగ్రహాన్ని, విశేషాన్ని చూడాలంటే మాత్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణం కోటకట్ల వారి వీధిలోని శ్రీ శేషశయన శ్రీ రామాంజనేయస్వామి వారి ఆలయానికి రావాల్సిందే. శ్రీరాముడు ఆదిశేషువుపై శయనించినట్లుగా ఉన్న ఆలయం దేశంలో ఇదే ప్రథమమని భక్తులు పేర్కొంటున్నారు. తాటికొండ రామయోగికి 1972లో ఆంజనేయస్వామివారి దర్శన భాగ్యం లభించింది. అనంతరం ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. ఆలయంలోని ఆంజనేయస్వామి సింగరకొండ ఆంజనేయస్వామి ప్రతిరూపమేనని పలువురి విశ్వాసం. భూతప్రేతపిశాచ గ్రహ బాధలతో బాధపడేవారు ఈ ఆలయంలో 40 రోజులపాటు ప్రదక్షిణలు చేస్తే వారికి స్వస్థత చేకూరుతుందని నిర్వాహకులు చెప్తారు. వారు చెప్పడమే గాక పలువురు భక్తుల ప్రత్యక్ష అనుభవం కూడా. ఆలయంలో గత మూడు దశాబ్దాల నుండి భక్తులు నిత్యం శ్రీరామ నామ జపపారాయణ నిర్వహిస్తున్నారు. అక్కడ పద్మనాభుడు ఇక్కడ శ్రీరాముడు ఆంజనేయస్వామి శ్రీరాముని భక్తుడు కావడంతో 1998 ఫిబ్రవరి 6న శేష శయన శ్రీరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. శ్రీరాముని పాదాల వద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాలతో కూర్చుని ఉన్నట్లుగా విగ్రహాన్ని సుందరంగా మలిచారు. కేరళలోని అనంత పద్మనాభస్వామి వారిని స్ఫురింపచేసేలా శ్రీరాముడు శేషశయనుడిగా దర్శనమిస్తాడు. భక్తులపాలిట సంజీవని ఎక్కడా నయంకాని మానసిక రుగ్మతలతో బాధపడే వారితోపాటు గ్రహ బాధలతో కుంగిపోయేవారికి ఈ ఆలయం సంజీవని వంటిది అంటారు. రోజూ ఎంతోమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. శనివారం గ్రహపీడితులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. సాయంత్రం మూడుగంటల పాటు జరిగే భజన సంకీర్తన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడవలసినదే. 21 దేవతామూర్తులు.. ఆలయ ఆవరణలో 21 దేవతామూర్తులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి భజన చేస్తున్న విగ్రహాన్ని సుందరంగా మలిచారు. దుర్గాదేవి, నృసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వేంకటేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి, వినాయకుడు, అష్టలక్ష్ములతోపాటు పలు దేవతామూర్తులకు నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం ఆంజనేయస్వామి సన్నిధిలో భజన సంకీర్తనల ఆలాపన జరుగుతుంది. ప్రముఖ గాయకులు తాటికొండ బాలయోగి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. చూడదగిన ప్రదేశాలు చీమకుర్తి వచ్చిన భక్తులు శేషశయన రామాలయంతోపాటు హరిహర క్షేత్రం, సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయం, గుంటిగంగ గంగమ్మ ఆలయం, అగ్రహారం వేంకటేశ్వరస్వామి ఆలయం, గోనుగుంట శివాలయం, రామతీర్థం మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయం, రామతీర్థం జలాశయం, చీమకుర్తి గ్రానైట్ క్వారీలను కూడా చూడవచ్చు. ఆలయానికి చేరుకునే మార్గం చీమకుర్తి... ఒంగోలు పట్టణానికి 21 కి.మీ.ల దూరంలో ఒంగోలు–మార్కాపురం ప్రధాన రోడ్డుమార్గంలో ఉంది. బస్సులు, ఆటోలలో, ప్రైవేట్ వాహనాలలో సులభంగా చేరుకోవచ్చు. – ఎం.వి.ఎస్. శాస్త్రి సాక్షి, ఒంగోలు