breaking news
Shirtless protest
-
అంతర్జాతీయ వేడుకలో మురికి రాజకీయాలా?
మీరట్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆ పార్టీ కార్యకర్తలు టీ–షర్టులు విప్పేసి నిరసన తెలపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మురికి రాజకీయాలకు, సిగ్గుమాలిన రాజకీయాలకు కాంగ్రెస్ వేదికగా మార్చుకుందని మండిపడ్డారు. మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పర్యటించారు. రూ.12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మీరట్ మెట్రో రైలుకు పచ్చజెండా ఊపారు. నమో భారత్ రైలును ప్రారంభించారు. మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో, ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. సిద్ధాంతపరంగా ఆ పార్టీ దారుణంగా పతనమైందని మోదీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ అన్ని హద్దులూ అతిక్రమించింది. ఆ పార్టీ ప్రవర్తనను దేశవ్యాప్తంగా అందరూ ఆక్షేపిస్తున్నారు. చేసిన తప్పుకు సిగ్గుపడాల్సింది పోయి టీ–షర్టులు విప్పేసి దేశాన్ని కించపర్చిన వారిని కాంగ్రెస్ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఆ ఘటనను ఖండించిన ఇతర విపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఆయా పార్టీలు సత్యం పక్షాన, దేశ ప్రతిష్ట పక్షాన నిలిచాయని ప్రశంసించారు. సొంత దేశాన్ని కించపరుస్తారా? ‘‘దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పౌరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మన దేశం విజయాలు సాధిస్తుండడాన్ని కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 80కిపైగా దేశాల ప్రతినిధులు, 20 దేశాల అధినేతలు పాల్గొన్న సదస్సులో చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం సమంజసమేనా? కాంగ్రెస్ నిజస్వరూపం అందరికీ తెలుసు. చొక్కాలు విప్పి నగ్నంగా మరోసారి బహిర్గతం చేసుకోవాల్సిన అవసరమేమిటి? కాంగ్రెస్ దుస్థితిని నేతల చేష్టలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సొంతదేశాన్నే కించపర్చే స్థాయికి దిగజారారు. ఒక ఊళ్లో పెళ్లి జరిగితే ఊరి వాళ్లంతా కలిసి దాన్ని వైభవంగా నిర్వహిస్తారు. వచ్చిన అతిథులు సంతృప్తిగా తిరిగివెళ్తారు. మన దేశంలో మనం నిర్వహించుకొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్ నేతలు మోదీని ద్వేషించవచ్చు. నా సమాధిని తవ్వాలని అనుకోవచ్చు. నా తల్లిని దూషించవచ్చు. బీజేపీని, ఎన్డీయేను వ్యతిరేకించవచ్చు. వారి రాజకీయాలకు అది అవసరం కావొచ్చు. దాన్ని అర్థం చేసుకోగలం, సహించగలం. కానీ ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. అక్కడ బీజేపీ నేతలెవరూ లేరు. అది ప్రభుత్వ కార్యక్రమం. దేశ ప్రతిష్టను దెబ్బతీయడం సహించరాని విషయం’’ అన్నారు. మహిళలను ముందు పెట్టి రాజకీయమా? కాంగ్రెస్ తీరుతో పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా జరగడం లేదని మోదీ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్ సభ్యులు సృష్టిస్తున్న అలజడి కారణంగా ఆ పార్టీ మిత్రపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. ఫిబ్రవరి 4న లోక్సభలో ప్రధాని స్థానాన్ని కాంగ్రెస్ సభ్యులు చుట్టుముట్టి నినాదాలు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం సిగ్గుచేటు. వాళ్లు నిజంగా ప్రధాని స్థానంలో కూర్చోవాలనుకుంటే ముందు ప్రజల హృదయాలు గెల్చుకోవాలి. మహిళా ఎంపీలను ప్రధాని స్థానం వద్దకు పంపి నినాదాలు చేయిస్తే ప్రధాని అయిపోతారా? మహిళలను ముందు పెట్టి రాజకీయం చేయడమేమిటి? మీలో చేవ చచ్చిపోయిందా? కాంగ్రెస్ ఈ దేశానికి పెద్ద భారంగా మారింది. నీచ రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు గతంలోనే సూచించా. అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పా. అయినా బుద్ధి మార్చుకోవడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వానికి దేశ అభివృద్ధి, ప్రజల సౌభాగ్యమే ముఖ్యమన్నారు. ‘‘యూపీ ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. దశాబ్దాల క్రితం అరాచకానికి మారుపేరుగా ఉన్న యూపీ ఇప్పుడు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది’’ అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.అత్యంత వేగవంతమైన మీరట్ మెట్రో ఢిల్లీ–మీరట్ నడుమ 82 కిలోమీటర్ల రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్ఆర్టీఎస్)లో మిగతా మార్గాలతోపాటు 23 కిలోమీటర్ల మీరట్ మెట్రోను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా చెబుతున్నారు. ఢిల్లోలో సరాయ్ కాలేఖాన్, న్యూ అశోక్నగర్ మధ్య 5 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా 21 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్ సౌత్ నుంచి శతాబ్దినగర్ స్టేషన్ దాకా మెట్రో సెక్షన్ను ప్రారంభించారు. దీంతో ఢిల్లీ నుంచి మీరట్ వరకు ప్ర యాణం గంటలోపే పూర్తవు తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైలుమార్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే మీరట్ సౌత్ నుంచి మోదీపురం దాకా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ మార్గం పొడవు 23 కిలోమీటర్లు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు ప్రయాణిస్తుంది. మీరట్ సౌత్ నుంచి మోదీపురానికి 30 నిమిషాల్లోపే చేరుకోవచ్చు. -
మహిళా కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: సీపీఎం మద్దతుదారుడు, పత్రికా విశ్లేషకుడు చెరియాన్ పిలిప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ టికెట్ల కోసం కొందరు మహిళా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రహస్యంగా అర్థనగ్న (షర్ట్ లెస్) నిరసనలు తెలిపి చివరికి టికెట్లు పొందరాని ఆరోపించి వివాదంలో చిక్కుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత ఏకే ఆంటోనికి మాజీ కీలక సహచరుడిగా ఉన్న పిలిప్ అనంతరం కొన్ని విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వెళ్లి సీపీఎం పార్టీలో చేరారు. త్రిశూర్ లో వచ్చే నవంబర్ లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ఉద్దేశించి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆయన అందులో.. 'ఇటీవల త్రిశూర్లో వచ్చే నవంబర్లో జరగనున్న స్థానిక ఎన్నికల కోసం సీట్లు ఇవ్వలేదని కొందరు యువ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్ధులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. గట్టిగా అరుస్తూ రహస్యంగా అర్ధనగ్న ఆందోళన నిర్వహించి చివరకు టికెట్లు సాధించారు' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపట్ల మహిళ సంఘం నేతలు, ఇతర పార్టీ పెద్దలు, మహిళా హక్కుల నేతలు భగ్గుమన్నారు. దీంతో ఆయన ఫేస్బుక్లో మరో పోస్ట్ చేశారు. అందులో తాను మహిళలకు వ్యతిరేకిని కాదని, అసలు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తానెప్పుడూ మహిళలను గౌరవిస్తానని, పురుషుల ఆధిపత్యం కొనసాగుతుందని, మహిళలను అణిచివేస్తున్నారనే చెప్పానన్నారు. మరోపక్క, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వీఎం సుధీరన్ కూడా పిలిప్ వ్యాఖ్యలపట్ల మండిపడ్డారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని కోరారు. సీపీఎం సీనియర్ నేత రాజా, ఐద్వా నేత టీఎన్ సీమా కూడా పిలిప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


