సమ్మెలోకి సీమాంధ్ర రెవెన్యూ సిబ్బంది
12న అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తామని సీఎస్కు నోటీసు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నామని సీమాంధ్ర రెవెన్యూ ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో వీఆర్వోలు, రెవెన్యూ సహాయకుల సంఘాల ప్రతినిధులతో కూడిన బృందం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి సమ్మె నోటీసు అందజేసింది. అనంతరం వారు సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
12వ తేదీ అర్ధరాత్రిలోగా సీమాంధ్రకు చెందిన ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు. విభజన వల్ల ఉద్యోగులకు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. జోనల్ వ్యవస్థ రద్దయితే ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లు అస్తవ్యస్తంగా తయారవుతాయని, అందువల్ల విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ సహాయకుల నుంచి తహసీల్దార్ల వరకు.. దాదాపు 55 వేల మంది సమ్మెలో పాల్గొననున్నారని వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్ల సంఘంతోనూ తాము మాట్లాడామని, 13న కార్యాచరణ ప్రకటిస్తామని వారు చెప్పారని పేర్కొన్నారు.