breaking news
Santnar
-
పోరాడుతున్న ఇంగ్లండ్
మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ఇంగ్లండ్తో జరుగుతున్న తొలిటెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ శాసించే స్థితిలో నిలిచింది. ఆదివారం కివీస్ బ్యాట్స్మన్ వాట్లింగ్ (205; 24 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ సాధించగా... సాన్ట్నర్ (126; 11 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీతో పాటు బౌలింగ్తోనూ ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. నాలుగో రోజు ఆటలో వీరిద్దరి వీరోచిత ప్రదర్శన న్యూజిలాండ్కు గెలుపు అవకాశం సృష్టించింది. ఓవర్నైట్ స్కోరు 394/6తో ఆట కొనసాగించిన కివీస్ తొలి ఇన్నింగ్స్ను 615/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వాట్లింగ్, సాన్ట్నర్ ఏడో వికెట్కు 261 పరుగులు జోడించారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్కు 262 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ను ఆఫ్స్పిన్నర్ సాన్ట్నర్ (3/6)బంతితోనూ దెబ్బ తీశాడు. దీంతో ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే ఆఖరి రోజు ఇంగ్లండ్ ఇంకా 207 పరుగులు చేయాల్సివుంది. చేతిలో మరో 7 వికెట్లున్నాయి. -
ఆస్ట్రేలియానే ఫేవరెట్
సంజయ్ మంజ్రేకర్ తమ గ్రూపులో జరుగుతున్న పరిణామాలపై ఆస్ట్రేలియా జట్టు సంతోషంలో మునిగి ఉంటుంది. టి20 ఫార్మాట్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టును సొంత గడ్డపైనే న్యూజిలాండ్ ఓడించింది. ఈ ఫార్మాట్లో కివీస్ ఆటతీరు తెలిసిన వారికి షాక్ కలిగించిన ఫలితం అది. ఇక బంగ్లాదేశ్పై పాకిస్తాన్ జట్టు అనూహ్యంగా అద్భుత బ్యాటింగ్తో గెలిచింది. నిజానికి వారి బలమంతా బౌలింగే. ఇది ఆసీస్ గమనించే ఉంటుంది. హఫీజ్, షెహజాద్ బ్యాటింగ్ తీరుతో పాక్పై ఉన్న అనుమానాలు తేలిపోయాయి. దీంతో 19న ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్ను భారత్ కాస్త జాగ్రత్తగానే ఆడాల్సి ఉంది. పొట్టి ఫార్మాట్ను మనం ధనాధన్ క్రికెట్గానే చూస్తాం. ఇతర ఫార్మాట్లలాగా ఇక్కడ టాస్, పిచ్, మైదానం పరిస్థితులు ఏవీ ప్రభావితం చూపవనుకుంటాం. కానీ ఈ పరిస్థితిని నాగ్పూర్ పిచ్ మార్చి భారత్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈడెన్లో మంచుతో కూడిన పిచ్ కూడా విండీస్ బ్యాట్స్మెన్కు స్వర్గధామంగా మారింది. అయితే వాతావరణం సరిగా ఉంటే ఆసీస్, కివీస్ మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ పెద్దగా నిర్ణాయకం కాకపోవచ్చు. ఇదే జరిగితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియానే ఫేవరెట్గా చెప్పవచ్చు. భారత్తో జరిగిన ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ తేడాతో విజయం సాధించింది. దీంట్లో భాగంగా వారి స్పిన్నర్లు సోధి, సాన్ట్నర్ కలిపి 29 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. టి20 పరంగా చూస్తే ఇవి అద్భుతమైన గణాంకాలు. అయితే ధర్మశాలలో పిచ్ స్వభావరీత్యా వీరు ఇలాంటి ప్రదర్శనే ఇస్తారని ఆశించలేము. అందుకే ఆసీస్కు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయి.