breaking news
response to treatment
-
వైద్యుల స్పందన భేష్
డాబాగార్డెన్స్/పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): తెలతెలవారుతోంది.. కేజీహెచ్ వైద్యులకు ఫోన్.. గ్యాస్ లీకయింది.. బాధితులు వస్తున్నారని. తర్వాత కొద్దిసేపటికే అంబులెన్సులు, కార్లు, జీపులు, బస్సుల్లో బాధితులను తెస్తున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. వస్తూనే ఉన్నారు. వైద్యులు, సిబ్బంది వారిని చకచకా బెడ్ల మీదకు చేర్చారు. ఆక్సిజన్ పెట్టారు. వేగంగా వైద్యం అందించారు. నేవీ నుంచి కూడా అధునాతన ఆక్సిజన్ యంత్రాలను తెప్పించారు. అలుపెరగకుండా వైద్యం అందించారు. బాధితుల ప్రాణాలను కాపాడారు. విషవాయువును పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన వారితో కేజీహెచ్ అంతా నిండిపోయింది. క్యాజువాలిటీతో పాటు రాజేంద్రప్రసాద్–ఎ, రాజేంద్రప్రసాద్–బి, రాజేంద్రప్రసాద్–డి, పీడియాట్రిక్ వార్డు, ఎస్–1.. ఇలా పలు వార్డుల్లో క్షతగాత్రులను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వార్డులన్నీ నిండిపోవడంతో చాలామంది కొద్దిసేపు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఊపిరి ఆడకపోవడంతో పాటు కళ్ల మంటలతో కొందరు.. చర్మంపై దద్దుర్లతో మరికొందరు.. కడుపులో వికారంతో ఇంకొందరు.. ఇలా పలు లక్షణాలతో ఎందరో అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మొత్తం 193 మందిని కేజీహెచ్కు తరలించారు. వీరిలో 44 మంది చిన్నారులు ఉన్నారు. ప్రాణాపాయంలో ఉన్న ఆరుగురిని ఐఆర్సీయూలో ఉంచి వైద్యం చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో వీరంతా కుదుటపడ్డారు. ఐఆర్సీయూలో ఉన్న ఆరుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. కాగా, ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన వారిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలీక కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. మృతిచెందిన వారి కోసం మార్చురీ వద్ద పడిగాపులు కాసిన వారు ఇంకొందరు. ఇలా కేజీహెచ్లో గురువారం రోజంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. ఇదే ఘటనలో అస్వస్థతకు గురైన మరికొందరిని నగరంలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. కేర్ ఆస్పత్రి–1లో 18 మంది, సెవెన్హిల్స్లో నలుగురు, క్యూ–1లో ముగ్గురు, అపోలోలో 28 మంది, ఎంబీ ఆస్పత్రిలో 12 మంది, పినాకిల్ ఆస్పత్రిలో ఒకరు మొత్తం 66 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే, గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 32 మంది, పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 25 మంది, కొత్తవలసలో హెల్త్ సెంటర్లో 32 మంది చికిత్స పొందుతున్నారు. ఇంటి బయటే స్పృహ కోల్పోయా గ్యాస్ లీకైన తర్వాత ఇంటి బయటకు వచ్చి స్పృహ కోల్పోయాను. ఆస్పత్రికి ఎవరు తీసుకువచ్చారో తెలీదు. ఇక్కడకు వచ్చాకే మెలకువ వచ్చింది. గ్యాస్ పీల్చిన సమయంలో ఊపిరి ఆడలేదు. ప్రస్తుతం బాగుంది. – డి.నాగేంద్రబాబు, బాధితుడు ఏం జరిగిందో అర్థంకాలేదు తెల్లవారుజామున నిద్రలోనే గ్యాస్ పీల్చడంవల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాను. కళ్లు, ముక్కు మండిపోయాయి. ఇంటి వెలుపలికి వచ్చి స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచేసరికి కేజీహెచ్లో ఉన్నాను. ఏం జరిగిందో అర్ధంకాలేదు. – ఇల్లపు శివాజీ, బాధితుడు -
జయలలిత మాట్లాడుతున్నారు!
-
జయలలిత మాట్లాడుతున్నారు!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమానులకు శుభవార్త. ఆమె మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాదాపు పది రోజుల తర్వాత మళ్లీ ఆమె హెల్త్ బులెటిన్ను వైద్యులు వెల్లడించారు. జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని.. అయితే ఇంకా మరికొన్ని రోజులు మాత్రం ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని తెలిపారు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో వైద్యబృందం ఆమెను గత నెల రోజులుగా కంటికి రెప్పలా కాపాడుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా ముగ్గురు వైద్యులతో కూడిన ఒక బృందం వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. అమ్మ కూర్చున్నారని, మరి కొన్ని రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. దాంతో కొన్నాళ్ల తర్వాత అయినా.. జయలలిత మళ్లీ అధికార పగ్గాలను చేపడతారని పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరపడుతున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె క్షేమం కోరుతూ తమిళనాడు వ్యాప్తంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేలాదిమంది అభిమానులు ఆస్పత్రి బయటే అమ్మ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎట్టకేలకు తమ పూజలు ఫలించాయని వాళ్లంతా సంబరపడుతున్నారు. ఎవరెవరు చూస్తున్నారంటే... క్రిటికల్ కేర్ నిపుణులు, సీనియర్ కార్డియాలజిస్టులు, సీనియర్ రెస్పిరేటరీ ఫిజిషియన్లు, సాంక్రమిక వ్యాధుల శాఖకు చెందిన సీనియర్ కన్సల్టెంట్లు, సీనియర్ ఎండోక్రినాలజిస్టు, అపోలో ఆస్పత్రికి చెందిన డయాబెటాలజిస్టు.. వీళ్లంతా కలిసి జయలలితకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో ఆస్పత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సత్యమాంబ బులెటిన్లో పేర్కొన్నారు. పౌష్టికాహారం, అత్యవసరమైన న్యూట్రియెంట్ ఇన్టేక్ విషయాలను డయెటరీ బృందానికి చెందిన సీనియర్ కన్సల్టెంట్లు చూసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, క్రమంగా కోలుకుంటున్నారని వివరించారు.