breaking news
Parveez Rasool
-
ఐపీఎల్లో అవమానం.. విదేశీ లీగ్లో ఆడనున్న టీమిండియా ప్లేయర్లు
2022 ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోక భంగపడ్డ భారత క్రికెటర్లు, క్యాష్ రిచ్ లీగ్ జరిగే రెండు నెలల కాలాన్ని వృధా కానీయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. భారత టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్లో కౌంటీలు ఆడేందుకు వెళ్లనుండగా.. మరో టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారి ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. విహారితో సహా మొత్తం ఏడుగురు భారత ప్లేయర్లు (అభిమన్యు ఈశ్వరన్, పర్వేజ్ రసూల్, బాబా అపరాజిత్, అశోక్ మెనరియా, చిరాగ్ జానీ, గురిందర్ సింగ్) డీపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వాస్తవానికి భారత ప్లేయర్లకు విదేశీ లీగ్ల్లో పాల్గొనే అవకాశం లేదు. అయితే డీపీఎల్.. బంగ్లాదేశ్ లిస్ట్ ఏ క్రికెట్ టోర్నీ కావడంతో భారత క్రికెటర్లకు అనుమతి లభించింది. భారత క్రికెటర్లు డీపీఎల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు. కోవిడ్కు ముందు కూడా విహారి, ఈశ్వరన్, అపరాజిత్, మెనరియా ఈ టోర్నీలో పాల్గొనగా అంతకుముందు దినేశ్ కార్తీక్, మనోజ్ తివారి, యూసఫ్ పఠాన్ లాంటి టీమిండియా స్టార్లు వివిధ సీజన్లలో బంగ్లాదేశ్ లిస్ట్ ఏ టోర్నీలో పాల్గొన్నారు. ఈ సీజన్లో భారత ప్లేయర్లే కాకుండా పాక్, జింబాబ్వేలకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. వీరిలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి, పాక్ వెటరన్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్, జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా సెంటర్ ఆప్ అట్రాక్షన్గా నిలువనున్నారు. ప్రస్తుత డీపీఎల్ సీజన్ మార్చి 15న ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ మెగా వేలం 2022లో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, తాజాగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఓ మోస్తరుగా రాణించిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన విహారి.. 3 ఇన్నింగ్స్ల్లో ఓ అర్ధ సెంచరీ సాయంతో 41.33 సగటున 124 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. విహారి ఐపీఎల్లో చివరిసారి 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. చదవండి: హైదరాబాద్లో రవిశాస్త్రి.. సిరాజ్, విహారిలపై కీలక వ్యాఖ్యలు -
రసూల్ను తీసుకోకపోవడం దురదృష్టకరం
కాశ్మీర్ క్రికెటర్ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ను చివరి వన్డేలో ఆడించకపోవడం దురదృష్టకరమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అయితే తాను తీసుకున్న నిర్ణయాన్ని కోహ్లి సమర్థించుకున్నాడు. జట్టులో స్థానంలో ఎంతో మంది ఎదురు చూస్తున్నారని చెప్పాడు. జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో ఆడేందుకు రిజర్వు బెంచ్ ఆటగాళ్లు రెండు నెలలు నుంచి ఎదురుచూస్తున్నారని వెల్లడించాడు. రవీంద్ర జడేజా స్థానంలో రసూల్ను ఆడించాల్సిందని అడిగిన ప్రశ్నకు... ఏ మ్యాచ్ను తాను తక్కువగా తీసుకోనని స్పష్టం చేశాడు. భారత జట్టు తరఫున ఆడిన తొలి కాశ్మీర్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరిన పర్వేజ్ రసూల్కు జింబాబ్వే టూర్లో నిరాశే ఎదురైంది. ఆఖరి వన్డేలోనూ తుది జట్టులో అతనికి చోటు దక్కలేదు. దీంతో భారత జాతీయ జట్టులో అరంగేట్రం కోసం రసూల్ మరి కొంతకాలం వేచి చూడక తప్పడం లేదు. ఈ సిరీస్ ద్వారా ఉనాద్కట్, మోహిత్, పుజారా, రాయుడులకు వన్డేల్లో అరంగేట్రం అవకాశం కల్పించిన భారత్... రసూల్ను మాత్రం విస్మరించింది. వన్డే సిరీస్ గెలిచిన తర్వాత కూడా రసూల్కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం దారుణమని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. స్వదేశంలో పక్కనబెట్టడం కంటే ఇది మరీ దారుణంగా ఉందని ట్విట్టర్లో ఘాటుగా విమర్శించారు. తుది జట్టులో రసూల్కు అవకాశం కల్పించకపోవడాన్ని కేంద్ర మంత్రి శశి థరూర్ కూడా తప్పుబట్టారు.