breaking news
needle attacks
-
వణుకు పుట్టిస్తున్న ఇంజక్షన్ సైకో
ఏలూరు : ఇంజక్షన్ సైకో దాడుల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజురోజుకూ ఇంజక్షన్ సైకో దాడులు పెరిగిపోతున్నాయి. మరోపక్క సైకో దాడులు గోదావరి జిల్లాల ప్రజలకే కాదు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నది వాస్తవం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, దువ్వలో ఇంజక్షన్ సైకో సంచారం చేస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. సైకోను పట్టుకోబోయిన వ్యక్తి నుంచి దాడులకు పాల్పడుతున్న ఇంజక్షన్ సైకో తప్పించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే, సైకోను ఓ వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించగా సిరంజీలు, చెప్పులు అక్కడి వదిలి పారిపోయాడని ఆ ప్రాంతాల వాళ్లు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిన్న కూడా రఘునాథ్ అనే వ్యక్తిపై సైకో దాడి చేశాడన్న విషయం విదితమే. సైకోకు మరో వ్యక్తి కూడా సహాయం చేస్తున్నాడని రఘు ఆరోపిస్తున్నాడు. మోటార్ సైకిల్పై వీళ్లిద్దరూ తిరుగుతూ ఈ దాడులు చేస్తున్నారని చెప్పాడు. పెనుగొండ ఎస్సై మాత్రం ఆ వ్యక్తి చెప్పిన విషయాలు అవాస్తవాలని కొట్టిపారేయడం గమనార్హం. ఇంజక్షన్ దాడుల నేపథ్యంలో సైకోను పట్టించిన వారికి రూ.50 వేలు అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ గతంలో ప్రకటించిన విషయం విదితమే. -
సిరంజీ సైకోను పట్టిస్తే 50వేలు..
ఏలూరు : మహిళలపై ఇంజక్షన్ దాడులకు పాల్పడుతున్న సైకో సమాచారం అందించిన వారికి రూ.50 వేల బహుమతి అందిస్తామని పశ్చిమ గోదావరి ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 ప్రత్యేక బృందాలు, 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహిళలపై ఇంజక్షన్ దాడులను సీరియస్గా తీసుకున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 9 కేసులు నమోదయ్యాయని చెప్పారు. బాధితుల సమాచారం ప్రకారం ఊహాచిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్ 100, లేదంటే 9440796600 నంబర్ కు నిందితుని సమాచారం ఇవ్వాలని తెలిపారు. నిందితుడు ఉపయోగిస్తున్నది నీడిల్ మాత్రమే, అందులో ఎలాంటి మందులేదని నిర్ధారించినట్లు ఎస్పీ వివరించారు. సైకో చర్యలపై ఎవరూ ఆందోళన చెందొద్దని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని భాస్కర్ భూషణ్ అన్నారు.