ఆమె ప్రశ్నిస్తే ట్రంప్కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఎదురుగా డొనాల్డ్ ట్రంప్లాంటి నేతల ముందు అడుగు వేయడం అంటేనే చాలా మంది జర్నలిస్టులు జాగ్రత్తపడే పరిస్థితి. కానీ ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా ధైర్యంగా కఠిన ప్రశ్నలు వేసిన ఒక జర్నలిస్ట్.. ఇప్పుడు హాట్టాపిక్గా మారారు. ఇక చాలూ అనుకుంటూ ఆయన్ని ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేయించిన.. “ఆమె ఎవరబ్బా?” అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.. ఆమె పేరు.. క్రిస్టెన్ వెల్కర్. ఎన్బీసీ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆధారాలు చూపాలంటూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే అంశాన్ని ఆమె మళ్లీ మళ్లీ ప్రస్తావించడంతో ఇంటర్వ్యూ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సారీ డార్లింగ్ అంటూనే.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రంప్ విసుగ్గా కోటుకు ఉన్న లాపెల్ మైక్, వైర్లెస్ ట్రాన్స్మిటర్తో పాటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే మళ్లింది.WOW -- Trump crashes out and cuts his interview with Welker short as she presses him on his lack of evidence for claiming elections are rigged"You're either crooked or you're stupid. Let's call it quits. Because I've had enough. Thank you darling," he tells her.""I traveled… pic.twitter.com/qQaNIDnX4y— Aaron Rupar (@atrupar) June 7, 2026క్రిస్టెన్ వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వార్తా రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్రను అభ్యసించారు. అనంతరం జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని స్థానిక టెలివిజన్ ఛానళ్లలో రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించారు. రిపోర్టింగ్లో చూపిన ప్రతిభతో 2010లో ఆమె ఎన్బీసీ న్యూస్లో చేరారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. వైట్హౌస్ కరస్పాండెంట్గా నియమితులైన ఆమె, అమెరికా అధ్యక్షుల విదేశీ పర్యటనలు, ఎన్నికలు, జాతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలను కవర్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే.. క్రిస్టెన్ వెల్కర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి పెద్దగా వినిపించింది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో. అప్పటి ట్రంప్–బైడెన్ మధ్య జరిగిన చివరి ప్రత్యక్ష చర్చకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇద్దరు అభ్యర్థులను సమతుల్యంగా ప్రశ్నిస్తూ, చర్చను నియంత్రించిన తీరు ఆమెకు విస్తృత ప్రశంసలు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ చర్చా కార్యక్రమాల్లో ఒకటైన “మీట్ ద ప్రెస్”కు 2023లో ఆమె హోస్ట్గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా హోస్ట్గా, రెండో మహిళా యాంకర్గా నిలిచి విశేష గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ను ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. ట్రంప్ మాత్రమే కాదు.. గతంలో బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, జో బైడన్.. ఇంకా పలువురు టాప్ డెమోక్రటిక్, రిపబ్లికన్ లీడర్లను ఆమె తనదైన శైలి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రశ్నించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలు వేయడం, సమాధానాల్లోని అస్పష్టతను వెంటనే గుర్తించి తిరిగి ప్రశ్నించడం ఆమె జర్నలిజం శైలి. స్పష్టమైన సమాధానం వచ్చే వరకు వెనక్కి తగ్గకపోవడం వల్లే ఆమెను అమెరికా రాజకీయ జర్నలిజంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా భావిస్తారు. తాజా ఘటనతో మరోసారి ఆమె పేరు.. తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది.