-
పురాణ దృశ్య కావ్యాలు.. పద్య నాటకాలు
– ముగిసిన నంది నాటకోత్సవాలు కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల కళాకారులు ప్రదర్శించిన పద్యనాటకాలు భారతీయ పురాణ గాథల దృశ్యకావ్యాలుగా నిలిచాయి. రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల్లో నిర్వహించగా.. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన నాటక సమాజాలకు కర్నూలు వేదికగా నిలిచింది. ఉదయం 10.30 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు ప్రదర్శించిన పద్యనాటకాలు పౌరాణిక నాటక ప్రాభవాన్ని చాటిచెప్పాయి. కర్నూలు లలిత కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘ప్రమీలార్జున పరిణయం’, కోడుమూరు వల్లెలాంబ నాటక కళాసమితి ప్రదర్శించిన ‘దేవుడు’, సావేరి కల్చరల్ అసోసియేషన్ హైదరబాద్వారు ప్రదర్శించిన ‘గంగాంబిక’ పద్య నాటకాలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రమీలార్జున ప్రణయ వృత్తాంతానికి అద్దం పట్టిన ప్రమీలార్జున పరిణయం... కర్నూలు లలిత కళాసమితి కళాకారులు గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రదర్శించిన ప్రమీలార్జున పరిణయం పద్యనాటకం మహాభారతంలోని ప్రమీలార్జున ప్రణయగాథకు అద్దం పట్టింది. కురుక్షేత్ర యుద్ధానంతరం పాప పరిహారం కోసం ధర్మరాజును అశ్వమేథ యాగం చేయాలని వ్యాసుడు ఆదేశిస్తాడు. ధర్మరాజు అర్జునుడికి అశ్వరక్షకుడిగా పంపిస్తాడు. భీముడు, అర్జునుడు యుద్ధాలలో తమ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నా పేరు, ప్రఖ్యాతులు మాత్రం శ్రీకృష్ణునికే చెందుతున్నాయని బాధపడతారు. ఇది గమనించిన కృష్ణుడు అశ్వమేథ యాగానికి తాను దూరంగా ఉంటానని భీమార్జునులతో చెబుతాడు. అర్జునుడు అశ్వరక్షణకు బయలుదేరి మహిళా సామ్రాజ్య అధినేత్రి ప్రమీల రాణిని చేరుకుంటాడు. స్త్రీ సామ్రాజ్యానికి మహారాణిగా చాటుకున్న ప్రమీల అర్జునుడిని యుద్ధంలో ఓడిస్తుంది. గర్వభంగమైన అర్జునుడు.. కృష్ణుడు తన వెంట లేకపోవడమే తన ఓటమికి కారణమని గుర్తిస్తాడు. ఘటోత్కచుని తనయుడు మేఘవర్ణుడు శ్రీకృష్ణుడిని అశ్వమేథ యాగంలో ప్రవేశపెడతాడు. కృష్ణుడు ప్రమీలకు గర్వభంగం చేసి అర్జునునితో పరిణయం చేయిస్తాడు. నాటకం మధ్యలో భీముడు, మేఘవర్ణుని యుద్ధ సన్నివేశం, కుతూహలం, కోలాహలం అనే పాత్రల మధ్య సాగే హాస్య సరస సంభాషణ ప్రేక్షకులను అలరించాయి. పల్లేటి కులశేఖర్ రచించిన ఈ నాటకానికి పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. దైవభక్తి విశిష్టతను చాటిన ‘దేవుడు’... కోడుమూరు వల్లెలాంబ నాటక కళాసమితి కళాకారులు ప్రదర్శించిన ‘దేవుడు’ పద్యనాటకం ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి విశిష్టతను చాటుకుంది. దైవభక్తి మెండుగా కల్గిన మహేంద్రుడనే యువకుడు సన్యాసిగా మారి దేశమంతటా పర్యటిస్తూ ధర్మప్రచారం చేస్తూ సాటి వారిపై ప్రేమానురాగాలు చూపిస్తూ మానవతా దృక్పథాన్ని చాటిచెప్పడమే ఈ నాటకంలోని ప్రధాన ఇతివృత్తం. మహేంద్రుడు ఒక వృద్ధుడిని కాపాడబోయి చేతిలోని శివలింగాన్ని జారవిడుస్తాడు. శివలింగం ముక్కలైపోగా విచారంగా ఇల్లు చేరుకుంటాడు. అతని తండ్రి విశ్వనాథుడు ఆ నింద నుండి విముక్తి పొందడానికి కాళీ మాతని దర్శించమని కోరుతాడు. గంగానది ఒడ్డున ఉన్న కాళీ మాత దర్శనం కోసం వెళ్తూ ఒక పడవ వాడిని, పవిత్ర అనే దేవదాసిని, దళితుడైన లక్ష్మన్నను కలసి మానవత్వం గురించి తెలుసుకుంటాడు. చివరకు బాధితులైన మానవులకు సేవ చేయడంలోనే దైవదర్శనం జరుగుతుందని మహేంద్రుడు గ్రహిస్తాడు. బి.పద్మనాభాచారి ఈ నాటకానికి రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మానవతా విలువలను చాటిన ‘గంగాంబిక’... సావేరి కల్చరల్ అసోసియేషన్ హైదరబాద్ కళాకారులు ప్రదర్శించిన గంగాంబిక పద్యనాటకం మానవతా విలువలను చాటిచెప్పింది. భూలోకంలో మానవతా విలువలు తగ్గుముఖం పట్టి రాక్షసత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో నారదుడు మానవులలో ప్రేమానుబంధాల పట్ల విశ్వాసాన్ని, వర్ణవైశమ్యాలు లేని సమసమాజాన్ని ఏర్పరచమని దేవతలను కోరతాడు. త్రిమూర్తులలో ఒకరైన మహేశ్వరుడు సంగమేశ్వరుడై తన బాధ్యతను గంగా బసవేశ్వర రూపంలో నెరవేరుస్తాడు. గంగా బసవేశ్వరులను భూలోకానికి పంపి భార్యాభర్తల అనుబంధాన్ని, మనిషి మనిషికి మధ్య ఉండాల్సిన మానవీయ బంధాన్ని ఏర్పరచడమే శైవ మత ప్రధాన లక్ష్యమని తెలియజేస్తాడు. తడకమల్ల రామచంద్రరావు రచించిన ఈ నాటకానికి సావేరి భవాని దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. విజయవంతంగా ముగిసిన నంది నాటకోత్సవాలు కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో జరిగిన నంది నాటకోత్సవాలు విజయవంతంగా ముగిశాయని, ఈ నాటకోత్సవాల నిర్వహణకు సహకరించిన కళాకారులు, ప్రేక్షకులు, టీజీవి కళాక్షేత్ర నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో నంది నాటకోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నంది నాటకోత్సవాల విశేషాలను తెలియజేశారు. 16 రోజులుగా టీజీవి కళాక్షేత్రంలో జరిగిన నంది నాటకోత్సవాల్లో సాంఘిక, బాలల, పౌరాణిక పద్య నాటకాల విభాగాల్లో 61 నాటకాలు ప్రదర్శించారని.. 1300 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారన్నారు. ఈ నాటకోత్సవాల్లో ప్రముఖ సినీ, టీవీ కళాకారులు కోట శంకర్రావు, సుబ్బరాయ శర్మ, మేక రామకృష్ణ, గోవాడ వెంకట్, జబర్దస్త్ మురళి, కృష్ణమోహన్, సురభి ప్రభావతి తదితరులు పాల్గొన్నారన్నారు. సాంఘిక నాటికల విభాగంలో 30 ప్రదర్శనలు, కళాశాల, విశ్వవిద్యాలయ విభాగంలో రెండు ప్రదర్శనలు, బాలల విభాగంలో 7 ప్రదర్శనలు, పద్యనాటక విభాగంలో 22 ప్రదర్శనలు టీజీవి కళాక్షేత్రంలో జరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల్లో జరిగిన నంది నాటకోత్సవాలలో విజేతలైన కళాకారులకు మార్చి మొదటి వారంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, 14 వ్యక్తిగత బహుమతులు అందజేస్తామన్నారు. నాటకోత్సవాలకు ఐదుగురు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారన్నారు. పద్య నాటకాలకు ప్రథమ బహుమతిగా రూ.80 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.60 వేలు, తృతీయ బహుమతిగా రూ.40 వేలు పారితోషికంగా అందుతుందన్నారు. సాంఘిక నాటకాలకు ఇదే వరుసలో రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు.. నాటికలు, బాలల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు పారితోషికంగా అందజేస్తామన్నారు. -
పద్య నాటకం.. పౌరాణిక పరిమళం
- అలరించిన నంది నాటకోత్సవాలు కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక టీజీవి కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు పురాణ గాథలకు అద్దం పట్టాయి. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ జనతా సేవా సమితి ఆధ్వర్యంలో ‘అన్నమాచార్య’ నాటకం ప్రదర్శించారు. నందవర వైదిక బ్రాహ్మణ వంశంలో జన్మించిన అన్నమాచార్యులు వెంకటేశ్వరస్వామి భక్తుడిగా మారడం.. ఆయనపై వేలాది కీర్తనలు పాడడం.. శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు అనేక అష్టకష్టాలు ఎదుర్కోవడం.. కాళ్వ నరసింహరాయుడు అనే రాజు అన్నమయ్యను ఆస్థాన గాయకుడుగా నియమించడం..తదితర ఘట్టాలు ప్రేక్షకులను అలరింపజేశాయి. అన్నమయ్య..వెంకటేశ్వరస్వామిని చేరి ఆయనలో ఐక్యవడంతో నాటకం ముగుస్తుది. వరకవుల నరహరి రాజు.. రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపిన సతీసావిత్రి... అనంతపురం లలిత కళాపరిషత్ నాటక సమాజం వారు ప్రదర్శించిన సతీసావిత్రి పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భర్త ప్రాణాలను కాపాడుకోవడంలో సతీసావిత్రి చూపిన చొరవ, అంకితభావాన్ని ఈ నాటకంలో చక్కగా ప్రదర్శించారు. రాజకుమారి అయిన సావిత్రి సత్యవంతుణ్ణి ప్రేమించి వివాహమాడాలని నిశ్చయించుకుంటుంది. అయితే సత్యవంతుడికి వివాహ అనంతరం ప్రాణగండముందని నారదుడు తెలియజేస్తాడు. అయినా సత్యవంతుడినే వివాహమాడతానని సావిత్రి భీష్మించుకుంటుంది. తన ప్రేమను నిరూపించుకున్న సావిత్రికి ఆమె తల్లిదండ్రులు సత్యవంతుడికిచ్చి వివాహం చేస్తారు. వివాహం తర్వాత సావిత్రి, సత్యవంతుడు అడవికి వెళ్లి కట్టెలు కొడుతుంటారు. కట్టెలు కొడుతూ కింద పడిపోయిన సత్యవంతుని ప్రాణాలను యమధర్మరాజు తీసుకెళ్తుంటాడు. తన భర్త ప్రాణాలను తిరిగి ఇవ్వమని వెంటపడిన సావిత్రి వాగులు, వంకలు, అరణ్యాలు దాటి ఇహలోకాన్ని చేరుతుంది. సావిత్రి పాతివ్రత్యాన్ని గ్రహించిన యముడు సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. భార్యాభర్తల మధ్య అమితమైన అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచిన సావిత్రి కథను ఈ నాటకం అత్యంత హృద్యంగా చిత్రించింది. ఆకట్టుకున్న కృష్ణా నదీ చరిత్ర... తిరుపతి వెంకటపద్మావతి నాట్యమండలి వారు ప్రదర్శించిన కృష్ణానదీ చరిత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. భూలోకంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆకాశవాణి.. ఇంద్రుని వద్దకు వెళ్లి ప్రజల కష్టాలను తీర్చమని వేడుకుంటుంది. ఇంద్రుడు విష్ణుమూర్తిని వేడుకుని కృష్ణవేణిని ఉద్భవింపజేస్తాడు. విష్ణుమూర్తి కృష్ణవేణిని నదీ ప్రవాహినిగా ప్రవహింపజేస్తూ ఆమెకు తగిన ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మను కోరతాడు. సహ్యముని తపస్సు చేసి పర్వత ప్రాంతమే కృష్ణవేణికి తగిన ప్రాంతమని సూచిస్తాడు. విష్ణుమూర్తి.. కృష్ణవేణిని పర్వత ప్రాంతానికి పంపించగా సహ్యముని రావి చెట్టుగా మారి కృష్ణవేణిని నదిగా ప్రవహింపజేస్తాడు. వి.ఎస్.భరద్వాజ్ రచన, దర్శకత్వ బాధ్యతలు వహించిన ఈ పద్య నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్నేహభావానికి ప్రతిబింబంగా నిలిచిన కుచేలోపాఖ్యానం... కళామయి సాంస్కృతిక సంస్థ(రంగారెడ్డి జిల్లా) కళాకారులు ప్రదర్శించిన కుచేలో పాఖ్యానం పద్యనాటకం కృష్ణ, కుచేలుర స్నేహబంధానికి ప్రతీకగా నిలిచింది. సాందీపుడు అనే గురువు వద్ద ఆశ్రమ పాఠశాలలో సుధాముడు, శ్రీకృష్ణుడు విద్యను అభ్యసిస్తారు. విద్యను అభ్యసించే క్రమంలో వారిద్దరి మధ్య తరగని స్నేహం ఏర్పడుతుంది. పేద బ్రాహ్మణుడు. తొడుక్కోవడానికి సరిౖయెన దుస్తులు కూడా లేని దుస్థితిలో ఉన్న సుధాముడిని అందరూ కుచేలుడు అని అవహేళన చేస్తుంటారు. అదే అతని పేరుగా ప్రాచుర్యంలోకి వస్తుంది. విద్యాభ్యాసం అనంతరం కృష్ణుడు ద్వారకకు వెళ్లిపోగా కుచేలుడు పౌరహిత్యం చేసుకుంటూ జీవిస్తుంటాడు. వివాహ అనంతరం చాలీచాలని జీతం చూసిన అతని భార్య కృష్ణుని వద్దకు వెళ్లిరమ్మని సలహా ఇస్తుంది. కృష్ణుడిని వెతుక్కుంటూ అరణ్యాలకు వెళ్లిన కుచేలుడిని చూసిన కృష్ణుడు గరుత్మంతుడితో ద్వారకకు తరలిస్తాడు. ద్వారకలో ద్వారపాలకులు కుచేలుడిని అడ్డగిస్తారు. అయితే కృష్ణుడు ప్రత్యక్షంగా కుచేలుడిని చూసి లోపలికి తీసుకెళ్లి సింహాసనంపై కూర్చుండబెట్టి కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగిస్తాడు. కుచేలునికి తగిన సత్కారము చేస్తాడు. నిజమైన స్నేహానికి పేద, ధనిక అనే భేదభావములు ఉండవు అని తెలియజెప్పిన భారత గాథను ఈ నాటకం చక్కగా వివరించింది. ఈ నాటకానికి రచన, దర్శకత్వం బాధ్యతలను అమరలింగ శర్మ నిర్వహించారు. నేటి నాటక ప్రదర్శనలు... ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మార్కండేయ విజయం పద్యనాటకం, సాయంత్రం 4 గంటలకు స్వామి అయ్యప్ప పద్యనాటకం, సాయంత్రం 7 మైరావన పద్యనాటక ప్రదర్శనలు ఉంటాయని లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement