breaking news
Mukteswara rao
-
గ్రామదర్శిని..మళ్లీ తెరపైకి
చిలుకూరు, న్యూస్లైన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టే పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు గ్రామదర్శనం కార్యక్రమం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో గ్రామదర్శిని పేరుతో జరిగిన కార్యక్రమాన్ని ఇప్పుడు గ్రామదర్శనంగా మార్పు చేశారు. ఈ కార్యక్రమం తిరిగి శుక్రవారం నుంచి జిల్లాలో అమలు కానున్నది. ఈ మేరకు మండల స్థాయి అధికారులకు బుధవారం జిల్లా కలెక్టర్ చిరంజీవులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు ఈ పథకాన్ని 2012 ఫిబ్రవరిలో జిల్లాలో ప్రవేశపెటినా అశించిన స్థాయిలో అమలు కాలేదు. తిరిగి నూతనంగా వచ్చిన కలెక్టర్ చిరంజీవులు ఈ గ్రామదర్శనం పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి మండలంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. మండల పరిషత్ ప్రత్యేక అధికారి సమక్షంలో మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ గ్రామదర్శనం కార్యక్రమం నిర్వహించాలి. గ్రామాల్లో పథకాల పనితీరును పర్యవేక్షించడం, ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంపొందించడం, మనంకోసం మనం కార్యక్రమం విజయవంతం చేయడం, గ్రామస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించడం, ప్రభుత్వ పాఠశాలల పనితీరు, రహదారులు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర పనులను పర్యవేక్షించి వాటిని సక్రమంగా అమలు చేయడమే గ్రామదర్శనం ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి శుక్రవారం అమలు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి శుక్రవారం అమలు చేస్తారు. కార్యక్రమానికి మండలస్థాయి అధికారుల నుండి గ్రామస్థాయి అధికారులు అందరూ హజరవుతారు. మండల పరిషత్ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈవో, మండల పశువైద్యాధికారి, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వ్యవసాయాధికారి, అంగన్వాడీ సూపర్వైజర్, ఉపాధిహమీ ఏపీఓ, ఐకేపీ ఏపీఎం, సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్, హౌసింగ్, పంచాయితీ రాజ్, విద్యుత్ ఏఈలు తదితరులు పాల్గొంటారు. వీరేకాకుండా గ్రామస్థాయి అధికారులు పాల్గొంటారు. వీరంతా గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించి లోపాలను సవరించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులపై జవాబుదారీతనం పెరుగుతుంది. -
86 దేవాలయాలకు మాస్టర్ ప్లాన్!
అడ్డగోలు నిర్మాణాలు, పాలకమండళ్ల నిర్ణయాలకు చెక్! వేములవాడ, న్యూస్లైన్: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అడ్డగోలు నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది. వాటిపై నిధులు వృథా చేసేలా ఉండే పాలకమండళ్లు, కార్యనిర్వాహక అధికారుల (ఈవోల) నిర్ణయాలు ఇక చెల్లవు. ఇందుకోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది. సంస్కృతీ సంప్రదాయాలు, స్థలపురాణం, భక్తుల మనోభావాలు, వారికి సౌకర్యాల కల్పన తదితర అంశాలన్నింటికీ పెద్దపీట వేస్తూ ప్రధాన ఆలయాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 15లోగా ఆయా ఆలయాల స్థితిగతులపై నివేదికలు సమర్పించాలని ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆలయాలకున్న స్థిరాస్తుల పరిరక్షణతో పాటు మరో 30 సంవత్సరాల వరకు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన నిర్మాణాలను చేపట్టడం మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వర్రావు, చీఫ్ ఇంజనీరు సత్యనారాయణ రెడ్డి, స్థపతి సౌందర్యరాజన్, స్థపతి సలహాదారు వేలుతో కూడిన ప్రత్యేక కమిటీ... హైదరాబాద్లో బుధవారం ప్రధాన దేవాలయాల ఈవోలు, ఈఈలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జాయింట్ కమిషనర్, డిప్యూటీ జాయింట్ కమిషనర్, సహాయ కమిషనర్ స్థాయి అధికారులు ఈవోలుగా ఉన్న మొత్తం 86 ఆలయాలకు ఈ మాస్టర్ ప్లాన్ వర్తిస్తుంది. వాటిలో జాయింట్ కమిషనర్ స్థాయిలో వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, విజయవాడ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, పెనుగంచిప్రోలు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవాలయాలున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన జాబితాలో సికింద్రాబాద్ గణేశ్ ఆలయం, బాసర, కొమురవెల్లి, కొండగట్టు, మహానంది, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయాలను చేర్చారు. సహాయ కమిషనర్స్థాయి కలిగిన సుమారు 68 దేవాలయాలను మాస్టర్ ప్లాన్లో చేర్చారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఇలా... ప్రస్తుతం ఆలయ స్థితిగతులు, సౌకర్యాలు, చేపట్టిన పనులు, దేవస్థానానికి చేరుకునే మార్గాలు, వాటిలో దుకాణాలు, వాటి నిర్వహణ, నీరు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, గత పదేళ్లలో ఏటా ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య తదితర వివరాల ఆధారంగా నూతన మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని కమిటీ సూచించింది. మరో 30 ఏళ్ల వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా, దూరం నుంచికూడా ఆలయం కనిపించేలా ఆవరణను విస్తరించడం, రానున్న రోజుల్లో పెరిగే భక్తుల సంఖ్య అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.