breaking news
MLA Vidyasagar Rao
-
కల సాకారమవుతోంది..
సాక్షి, కోరుట్ల: పదేళ్లుగా పెండింగ్లో ఉన్న మద్దుల చెరువు మినీట్యాంక్ బండ్ ఏర్పాటు కల సాకారమవుతోంది. ఇప్పటికే సుమారు రూ. 3.50 కోట్లు కేటాయించి పూడికతీత, పుట్పాత్, గేట్లు, బతుకమ్మ ఘాట్లు, బండ్ నిర్మాణం పూర్తి కాగా..ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు కొంత మేర మిగిలిపోయాయి. ఈ పనుల కోసం ఆరు నెలల క్రితం అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన నిధుల రూ. 25 కోట్ల నుంచి రూ. 33 లక్షలు కెటాయించారు. ఈ నిధులతో మినీట్యాంక్ బండ్గా మారిన మద్దుల చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త సోయగాలు.. కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి వెంట ఉన్న మద్దుల చెరువును దాదాపుగా మినీట్యాంక్ బండ్ రూపం సంతరించుకుంది. నిర్మాణపరమైన పనులు పూర్తి కాగా.. మినీ ట్యాంకు బండ్ సుందరీకరణ పనులు మిగిలిపోయాయి. ఈ పనుల్లో బాగంగా ఫిట్నెస్ ఓపెన్ జిమ్, కట్టపై పార్కులు, అందమైన ఆకృతులతో నిర్మాణాలు, చెట్లు, గడ్డిమొక్కలు పెంపకం, ఫుట్పాత్ పక్కన అందంగా ఉండటానికి అవసరమైన బొమ్మలు, బతుకమ్మ ఘాట్ వద్ద చిన్నపాటి గద్దెల నిర్మాణం వంటి వాటి కోసం ఈ నిధులు కేటాయించనున్నారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు చెందిన టెండర్లు త్వరలో పూర్తి కానున్నాయి. మరో రూ. 50లక్షలు మినీట్యాంక్ బండ్లో నీటిని ఎప్పకప్పుడు శుద్ధీకరణ చేయడానికి అవసరమైన సాంకేతికతను ఏర్పాటు చేయడంతో పాటు మిషన్ భగీరథ పైప్లను అనుసంధానం చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉంది. ఈ పనుల కోసం మరో రూ. 50లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నిధులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. త్వరితగతిన ఈ నిధులు మంజూరైతే కోరుట్ల మద్దుల చెరువుకు చెందిన దాదాపు అన్ని పనులు పూర్తి అయినట్లే. ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది కాలం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘నాన్న’ను ఆదుకుంటాం..
సాక్షి కథనానికి స్పందించిన కోరుట్ల ఎమ్మెల్యే కోరుట్ల: స్వైన్ఫ్లూతో హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్కల్దేవి ప్రకాశ్ కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకంట్ల విద్యాసాగర్ రావు ఆదివారం పరామర్శించారు. ‘మా నాన్నను ఆదుకోరూ..’అనే శీర్షికన ‘సాక్షి’మెయిన్లో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు. ప్రకాశ్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రకాశ్ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ప్రకాశ్ కుటుంబసభ్యులకు దాతలు తోచిన సాయం అందిస్తున్నారు. ఆదివారం కోరుట్ల రేషన్ డీలర్ల సంఘం వారు రూ.10 వేలు, అవధూత శ్రీధర్ రూ.5 వేలు, చింతామణి కావ్యశ్రీ రూ.2 వేల సాయం అందజేశారు.