breaking news
Marri raghavayya
-
రైల్వే కార్మిక సమస్యలపై కేంద్రం మొండి వైఖరి
హైదరాబాద్: రైల్వే కార్మికుల సమస్యలపట్ల కేంద్రం మొండివైఖరి కనబరుస్తోందని ఎన్.ఎఫ్.ఐ.ఆర్, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య అన్నారు. శుక్రవారం ఇక్కడ లాలాగూడ వర్క్షాప్ ఎస్సీఆర్ఈఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సౌత్ ఇన్స్టిట్యూట్లో 20వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్మికులు భారీ ర్యాలీగా ఇన్స్టిట్యూట్కు చేరుకున్నారు. రాఘవయ్య మాట్లాడుతూ 7వ వేతన కమిషన్లో రైల్వే కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. రైల్వేలోని రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం ఓ వైపు ‘మేకిన్ ఇండియా’ అంటూనే రైల్వేను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అప్రెంటీస్లకు ఉద్యోగాలిచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వర్క్షాప్లో పనిచేసే ఇంజనీర్లు, సూపర్వైజర్లు, వర్కర్లకు ఇన్సెంటివ్స్, బోనస్లను పెంచాలని డిమాండ్ చేశారు. లాలాగూడ వర్క్షాప్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్మికుడి కుటుంబసభ్యులకు సంఘ్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో సంఘ్ జోనల్ ప్రెసిడెంట్ ప్రభాకర్ ఆండ్రూ, సెక్రటరీ ఎం.జి.అరుణ్కుమార్, సంఘ్ ప్రతినిధులు సాంబశివరావు, హేమంత్కుమార్, నర్సింగ్రెడ్డి, మోహన్రావు, హైమరాజన్, గుణాకర్, బుచ్చాగౌడ్, ముస్తఫా, రమణ, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
11 నుంచి కేంద్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె
ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రైల్వే కార్మికులు, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెలో పాల్గొంటారని నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్) ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తమ 11 డిమాండ్లను నెరవేర్చాలంటూ జంతర్మంతర్లో రైల్వే, రక్షణ, తపాలా ఉద్యోగులతో శుక్రవారం ధర్నా నిర్వహించారు. జూలై 11 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కేంద్రం సమస్యను పరిష్కరిస్తే సమ్మెపై పునరాలోచిస్తామన్నారు. రైల్వేలో కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని, పాత పెన్షన్ విధానం అమలు, రైల్వే ప్రైవేటీకరణకు అనుమతించరాదని, బోనస్ పెంచాలని, కార్మికుడి పదవీకాలంలో 5 పదోన్నతులు కల్పించాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే తదితర డిమాండ్లతో సమ్మె చేపడుతున్నట్టు వివరించారు.