breaking news
Manipur High Court
-
జడ్జి పదవిలో ఉంటూ సైడ్ బిజినెస్?
న్యాయ పీఠం అంటే కేవలం ఓ పదవి కాదు.. అది విశ్వాసానికి ప్రతీక. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై సమాజంలో అత్యున్నత నమ్మకం ఉంటుంది. అందుకే వారి వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకత, నైతికతకు పెద్దపీట వేయడం ఆనవాయితీ. అలాంటి విలువలకే ఓ న్యాయమూర్తి తిలోదకాలు ఇచ్చారనే వ్యవహారం ఇప్పుడు న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. దేశాన్ని కుదిపేసిన నోట్ల కట్టల జడ్జి ఘటన మరువక ముందే వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలోకి వెళ్తే.. మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, మణిపూర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్కు చెందిన ‘కిచెన్ ఫ్లేమ్’ ఎల్పీజీ డీలర్షిప్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనూ ఈ డీలర్షిప్ కొనసాగిందన్న అంశంపై వివాదం రేగింది. జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ 2008లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 అక్టోబర్లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. 2024 నవంబర్లో పదవీ విరమణ చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు రాజ్యాంగబద్ధమైన న్యాయ పదవుల్లో కొనసాగిన సమయంలోనే గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్ కొనసాగిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.న్యాయ పదవి.. వ్యాపార సంబంధం.. ఏంటి తప్పా?రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు వ్యక్తిగత వ్యాపారాలు, ఆర్థిక ప్రయోజనాలకు దూరంగా ఉండాలన్న నైతిక ప్రమాణాలు ఉన్నాయి. ప్రయోజన సంఘర్షణ (Conflict of Interest)కు అవకాశం లేకుండా వారి ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. కానీ, జస్టిస్ మృదుల్ విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ‘కిచెన్ ఫ్లేమ్’ ఏజెన్సీకి సంబంధించి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో డీలర్షిప్ ఒప్పందాలు పలుమార్లు రెన్యువల్ అయ్యాయి. 1995, 2005, 2010, 2015 సంవత్సరాల్లో ఒప్పందాల పునరుద్ధరణతో పాటు 2025లోనూ ఒప్పందం కొనసాగినట్లు సమాచారం. అయితే న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో ఈ వ్యాపార సంబంధం కొనసాగడం నిబంధనలకు విరుద్ధమా? అనే అంశంపై బీపీసీఎల్ వివరణ కోరింది.నోటీసులు.. స్పందన లేక సస్పెన్షన్ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన బీపీసీఎల్.. 2025 డిసెంబర్లో వచ్చిన ప్రజా ఫిర్యాదును ఆధారంగా చేసుకుని జస్టిస్ మృదుల్కు నోటీసులు జారీ చేసింది. న్యాయ పదవిలో ఉన్న సమయంలో ఎల్పీజీ డీలర్షిప్ కొనసాగించడం, ఆ సమయంలో అవసరమైన అనుమతులు తీసుకున్నారా? డీలర్షిప్ ఒప్పంద నిబంధనలు పాటించారా? అనే అంశాలపై సంస్థ వివరణ కోరింది. జనవరి 30, ఫిబ్రవరి 26 తేదీల్లోనూ బీపీసీఎల్ నుంచి లేఖలు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులకు సమాధానం రాకపోవడంతో.. జూలై 6న ‘కిచెన్ ఫ్లేమ్’ డీలర్షిప్ను సస్పెండ్ చేసి పారేసింది.మోనికా పిటిషన్.. కొత్త మలుపుఈ వ్యవహారంలో మరో కోణం కూడా తెరపైకి వచ్చింది. ‘కిచెన్ ఫ్లేమ్’ ఎల్పీజీ ఏజెన్సీని నిర్వహిస్తున్న దీపక్ యాదవ్ మరణం తర్వాత.. ఆయన భార్య మోనికా యాదవ్ డీలర్షిప్ యాజమాన్య మార్పు (reconstitution of proprietorship) కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గతంలో బీపీసీఎల్ను ఆదేశించింది. అయితే ఆ తర్వాత ఏజెన్సీని బీపీసీఎల్ సస్పెండ్ చేయడంతో మోనికా మరోసారి కోర్టును ఆశ్రయించారు. తాను అన్ని నిబంధనలు పాటించినప్పటికీ.. మాజీ యజమాని జస్టిస్ మృదుల్, బీపీసీఎల్ చర్యల కారణంగా తాను నష్టపోతున్నానని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం.న్యాయవ్యవస్థపై వరుస వివాదాలుఈ వివాదంపై జస్టిస్ మృదుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇదే సమయంలో. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం మరోసారి న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయన అధికారిక నివాసంలో నగదు కట్టలు బయటపడిన ఘటన అనంతరం.. పార్లమెంట్ ద్వారా తొలగింపు ప్రక్రియ(అభిశంసన) ప్రారంభం కావడం, చివరకు ఒత్తిళ్లతో ఆయన జడ్జి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒకవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం.. మరోవైపు జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ ఎల్పీజీ ఏజెన్సీ వివాదం.. న్యాయమూర్తుల వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. న్యాయవ్యవస్థకు ప్రజల విశ్వాసమే ప్రధాన బలం. అందుకే ఉన్నత న్యాయ పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రతి అడుగు కూడా నైతిక ప్రమాణాల తూకంలోనే పరిశీలనకు వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మణిపూర్: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు
ఇంఫాల్: మణిపూర్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలైన కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణకు దారితీసిన తమ వివాదాస్పద ఉత్తర్వులో సవరణ చేసింది. మైతేయి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)ల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2023 మార్చి 27న జారీ చేసిన ఉత్తర్వులో ఒక పేరాను తొలగించింది. అప్పట్లో కోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ గిరిజనులైన కుకీలు ఆందోళన ప్రారంభించారు. క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది. రాష్ట్రంలో నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 200 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హైకోర్టు ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ గతేడాది అక్టోబర్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఉత్తర్వులో రెండు తెగల మధ్య శత్రుత్వానికి కారణమైన ఒక పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. . గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. -
Manipur: ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తేయండి!
ఇంఫాల్: గిరిజనలు.. గిరిజనేతర వర్గపోరుతో మొదలైన అలర్లు.. హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ నిషేధాన్ని ఎత్తేయాలంటూ శనివారం బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు నెలలుగా అక్కడ నిషేధం అమలులో ఉంది. మే 3వ తేదీ నుంచి మణిపూర్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధం విధించి.. ఆ బ్యాన్ను కొనసాగిస్తూ వస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తేయాలని.. కనీసం పాక్షికంగా అయినా నిషేధం ఎత్తివేసి పరిమితంగా అయినా సేవలను అందించాలని ప్రభుత్వాన్ని తన ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు. పైగా రాష్ట్రంలో లీజుకు తీసుకున్న లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు ఉన్నవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వాళ్లకు ఇంటర్నెట్ యాక్సెస్ను అనుమతించాలని పేర్కొంది. పర్వత ప్రాంతాల్లో నివసించే కుకీ తెగ.. లోయ ఏరియాల్లో నివసించే మెయితీస్ల మధ్య ఘర్షణలు.. మణిపూర్ను రణరంగంగా మార్చేశాయి. తప్పుడు సమాచారం ద్వారా హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందంటూ మే 3వ తేదీ నుంచి ఇంటర్నెట్ను బ్యాన్ చేసి.. పలుమార్లు ఆ నిషేధాన్ని పొడిగించుకుంటూ వస్తోంది బీరెన్ సింగ్ ప్రభుత్వం. అయితే.. హింసతో ప్రాణాలు పోవడం మాత్రం ఆగడం లేదక్కడ. -
హైకోర్టు చీఫ్ జస్టిస్గా.. మాజీ సీఎం కూతురు
ఇంఫాల్(మణిపూర్) : మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అభిలాష కుమారి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ కుమారికి మంగళవారం పదోన్నతి లభించింది. జస్టిస్ అభిలాష కుమారి హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమార్తె. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వవిద్యార్థి అయిన జస్టిస్ కుమారి హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీలో లా పూర్తి చేశారు. 1984లో న్యాయవాద వృత్తిని స్వీకరించి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసి, 2005లో గుజరాత్ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. తండ్రి వీరభద్ర సింగ్తో జస్టిస్ అభిలాష కుమారి( ఫైల్ ఫోటో) -
అభ్యర్థి విద్యార్హత తెలుసుకోవడం ఓటరు హక్కు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల విద్యార్హతల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా నామినేషన్ పత్రాలు తిరస్కరించవచ్చని తెలిపింది. పోటీలో ఇద్దరే ఉండి,గెలిచిన అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పుడు వివరాలు ఉన్నాయని నిరూపితమైతే, ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని ఓడిన అభ్యర్థి రుజువులు సమర్పించనక్కర్లేదనీ తెలిపింది. మణిపూర్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పృథ్వీరాజ్, శరత్చంద్ర పరస్పరం వేసుకున్న దావాలను కోర్టు విచారించింది. 2012 ఎన్నికల్లో నామినేషన్ పత్రాల్లో తన విద్యార్హత ఎంబీఏ అని తప్పుగా పేర్కొని విజయం సాధించిన పృథ్వీరాజ్ ఎన్నిక చెల్లదని మణిపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది.


