breaking news
Land Line phone
-
చిన్న ఐడియా.. మూడు రోజుల్లో రూ.కోటి సంపాదన!
ఒక్కోసారి కొంతమంది చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద విజయంగా మారుతుంటాయి. స్మార్ట్ ఫోన్ వాడకంతో విసిగిపోయి తాను సొంతంగా స్క్రీన్ టైమ్ను తగ్గించుకుందామని ఓ టెకీ చేసిన చిన్నపాటి ప్రయోగం.. ఆమెకి అద్భుతమైన వ్యాపార అవకాశంగా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ఆమె ఉత్పత్తి 120,000 డాలర్ల (సుమారు రూ.కోటి) అమ్మకాలను నమోదు చేసింది.రెండేళ్ల క్రితం, ఆన్లైన్లో క్యాట్జీపీటీ (CatGPT) ఏర్పాటుతో గుర్తింపు పొందిన క్యాట్ గోయెట్జ్.. నిరంతర స్మార్ట్ఫోన్ వినియోగంతో విసిగిపోయి, పాతకాలపు ల్యాండ్లైన్ ఫోన్ వినియోగం వైపు మళ్లాలనుకుంది. అయితే ల్యాండ్లైన్ ఫోన్ వాడాలంటే కొత్త నంబర్, కనెక్షన్ కావాలి. దీంతో పాతకాలపు పింక్ క్లామ్షెల్ హ్యాండ్సెట్ను తీసుకుని, దాన్ని బ్లూటూత్తో స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేసుకుని కాల్స్ మాట్లాడుకునేలా మార్పులు చేసింది. ఇది ఆమె అపార్ట్మెంట్లో ఒక వినూత్న ఆకర్షణగా మారింది.తర్వాత జూలై 2025లో ఆమె ఈ పరికరం గురించి ఆన్లైన్లో షేర్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. ఇలాంటిది తమకు కూడా కావాలని వందలాది మంది కామెంట్ పెట్టారు. దీంతో ఆమె వీటికి ‘ఫిజికల్ ఫోన్’ అని పేరు పెట్టి ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది. ఏదో 15–20 ప్రీ–ఆర్డర్లు వస్తాయని భావిస్తే.. అంచనాలను మించి, మూడే రోజుల్లోనే అమ్మకాలు 120,000 డాలర్లు దాటాయి. అక్టోబర్ చివరి నాటికి 3,000 యూనిట్లు అమ్ముడవగా, మొత్తం ఆదాయం 280,000 డాలర్లను దాటింది.ఫిజికల్ ఫోన్లు ఎలా పనిచేస్తాయంటే..ప్రస్తుతం ఫిజికల్ ఫోన్స్ బ్రాండ్ కింద 90–110 డాలర్ల ధరల్లో ఐదు రకాల హ్యాండ్సెట్ డిజైన్లు లభిస్తున్నాయి. ఉత్పత్తి పెరిగిన దృష్ట్యా, గోయెట్జ్ ఒక ఎలక్ట్రానిక్స్ తయారీదారుతో భాగస్వామ్యం చేసుకుని డిసెంబరు నుండి మొదటి బ్యాచ్ ఉత్పత్తుల షిప్పింగ్ని ప్రారంభించనుంది.ఈ ఫిజికల్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా ఐఫోన్, ఆండ్రాయిడ్ పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్టైమ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి యాప్స్ నుంచి వచ్చే కాల్స్ను ఇందులో మాట్లాడవచ్చు. నంబర్ను డయల్ చేయడం ద్వారా లేదా ‘స్టార్’(*) కీని నొక్కి ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ను యాక్టివేట్ చేయడం ద్వారా అవుట్గోయింగ్ కాల్స్ కూడా చేయవచ్చు. -
కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలు షురూ
జమ్మూ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో విధించిన ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ల్యాండ్లైన్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగానికి ఇప్పటికే కేంద్రం అనుమతులివ్వగా.. 5 నెలల తర్వాత శనివారం కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించారు. 2జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలనూ పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పోస్ట్పెయిడ్ మొబైల్ కనెక్షన్లపై 2జీ ఇంటర్నెట్ సేవలను కశ్మీర్లోని బండిపోరా, కుప్వారా జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతోపాటు కొన్ని పరిమితులతో సాఫ్ట్వేర్ సర్వీసులు అందించే కంపెనీలకు ల్యాండ్ లైన్ ద్వారా ఇంటర్నెట్ పొందే అవకాశాన్ని కల్పించినట్లు జమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ తెలిపారు. ‘ ఆంక్షల పాక్షిక సడలింపు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని టెలికం సంస్థలకు సూచించాం. అన్ని భద్రత, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పాం’ అని ఆయన అన్నారు. ఈ ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు టెలికం సంస్థలు వినియోగదారుల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుందని రోహిత్ చెప్పారు. గత ఏడాది ఆగస్టు నుంచి జమ్మూ కశ్మీర్లో టెలికామ్ సేవలను ఆపేయగా.. సుప్రీంకోర్టు వారం క్రితం వ్యక్తం చేసిన అభ్యంతరాలతో తాజాగా ఆంక్షల తగ్గింపు మొదలైంది. ‘శనివారం నుంచి వాయిస్, ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారి ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్ మొత్తమ్మీద ప్రీపెయిడ్ సిమ్కార్డుల్లో ఇకపై ఈ సేవలు అందుబాటులోకొస్తాయి’ అని రోహిత్ వివరించారు. -
ఫోన్ ఎత్తగానే.. ప్రాణాలు పోయాయి
మార్టూరు : రింగైన ల్యాండ్ లైన్ ఫోన్ ఎత్తగానే విద్యుదాఘాతానికి గురై ఓ ఇంటి యజమాని మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బొబ్బేపల్లిలో శుక్రవారం వేకువ జామున జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దండా మారుతీరావు(54) ఇంట్లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ ఉంది. అందరూ నిద్రపోతుండగా వేకువ జామున ఫోన్ మోగింది. మారుతీరావు ఫోన్ ఎత్తటంతో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య పార్వతి, కుమారుడు కృష్ణచైతన్య, కుమార్తె అనిత ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అజయ్కుమార్ తెలిపారు. ఇదీ.. కారణం టెలిఫోన్ తీగల మీదగా విద్యుత్ తీగలు కూడా మారుతీరావు ఇంటికి వ్యాపించి ఉన్నాయి. మెయిన్ లైన్ విద్యుత్ తీగల సేఫ్టీ కోసం ఇంటి ముందు వరకు ప్లాస్టిక్ గొట్టాలు తొడిగారు. అయినా విద్యుత్ తీగలకు టెలిఫోన్ వైరులోని రాగి వైరు తగలటంతో టెలిఫోన్ తీగలకు విద్యుత్ ప్రసారమైంది. ఫలితంగా ఫోన్ లిఫ్ట్ చేసిన మారుతీరావు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.


