breaking news
karmnagar
-
ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి
జగిత్యాల క్రైం: త్వరలో జరగబోయే ఎన్నికలను శాంతియుతంగా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా కృషి చేయాలని కరీంనగర్ రేంజ్ డీఐజీ పి.ప్రమోద్కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సింధూశర్మతో కలిసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘటనలూ జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల కోసం జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వారిలో ఎంతమందిని బైండోవర్ చేశారు..? ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఎంత మంది రౌడీషీటర్లు ఉన్నారు..? ఎన్ని పోలింగ్ కేంద్రాలున్నాయి..? వాటి స్థితిగతులు ఏమిటీ..? ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఎంతమంది పోలీసు భద్రత ఏర్పాట్లు అవసరం..?అక్కడ ముందస్తు చర్యలు ఎలా సుకుంటున్నారు..? వంటి అంశాలపై చర్చించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాల గురించి అధికారులు డీఐజీకి వివరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక నైపుణ్యంతో పనిచేయాలని డీఐజీ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంతోపాటు ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించే వ్యక్తులను గుర్తించి గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన నేరస్తుల సమాచారాన్ని సేకరించి వారిపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. పోలీస్స్టేషన్ల వారిగా రౌడీషీటర్ల జాబితా రూపొందించుకుని వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. ప్రతి హెచ్ఎస్వో తమతమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు అన్ని పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహిస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలా చొరవ చూపాలన్నారు. ప్రతి పీహెచ్సీవోకి ఒక్కో గ్రామం పేరుతో పలకరించేలా రాజకీయేతర వ్యక్తులతో సంబంధం కలిగి ఉండాలన్నారు. చెక్పోస్ట్ల తనిఖీ సమయంలో తప్పనిసరి వీడియో, ఫొటోగ్రఫీ తీసి జాగ్రత్తగా పొందుపర్చాలని సూచించారు. సాక్ష్యాధారాలు నేరానికి పాల్పడేవారికి శిక్ష పడటంలో కీలకమన్నారు. జిల్లాలో అన్ని పోలీస్స్టేషన్లలో అధికారులు ప్రజలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రతి గ్రామం ఒక ప్రాతిపాదికన తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, మల్లారెడ్డి, సీతారాములు, ఏఆర్ డీఎస్పీ ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రాజు పాల్గొన్నారు. -
‘నోటు’ కు చోటివ్వద్దు
కలెక్టరేట్, న్యూస్లైన్ : ‘ఓటు హక్కు చాలా గొప్పది.. యథా ప్రజా తథా రాజా అనే పరిస్థితి ఉంది.. ఓటు కోసం నోటుకు చోటివ్వొద్దు’ అంటూ యువతకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ సూచనలు చేశారు. పటిష్ట ప్రజాస్వామ్యానికి ఆయుధమైన ఓటుపై ప్రజలను చైతన్యపరచాలని కోరారు. గురువారం పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. జనవరి 1, 2014 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 95శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరి గేలా చూసి రికార్డు సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులను ఓటర్ల జాబితాలో చేర్చే బాధ్యత సంబంధిత ప్రిన్సిపాళ్లపై ఉందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, ఓటుహక్కు వినియోగంపై నియోజకవర్గాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఓటరు నమోదుకు ఫారం 6, ఓటరు కార్డులో తప్పుల సవరణకు ఫారం-8 పూరించి దరఖాస్తు చేయాలని, ఈ మెయిల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 20 లక్షల మందిని ఓటర్ల జాబితాలో చేర్చినట్లు వివరించారు. రూ.40 లక్షల మంది ఓటర్ల వివరాలు సరిదిద్దామన్నారు. జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని, త్వరలో కచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు. జనాభాలో మహిళలే ఎక్కువ.. ఓటర్లుగా తక్కువ కలెక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ, జిల్లాలో 38 లక్షల జనాభాలో 28 లక్షల ఓటర్లున్నారని, అందులో 1.50 లక్షల మందిని వివిధ కారణాలతో తొలగించాల్సి ఉందన్నారు. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1009మంది మహిళలుం డగా ఓటర్లుగా మాత్రం తక్కువగా నమోదయ్యారని చెప్పారు. ఓటరు నమోదుకు కళాశాల ప్రిన్సిపాళ్లు, స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని కోరారు. ఎస్పీ రవీందర్, జేసీ అరుణ్కుమార్, డీఆర్వో కృష్ణారెడ్డి, జగిత్యాల సబ్కలెక్టర్ శ్రీకేశ్, డ్వామా పీడీ మనోహర్, జెడ్పీ సీఈవో చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో ర్యాలీ జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఓటరు నమోదు, అవగాహన ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో కళాశాల విద్యార్థులు, ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. ప్రత్యేకంగా రూపొందించిన శకటాలను కలెక్టరేట్ వద్ద భన్వర్లాల్ ప్రారంభించారు. ఆకట్టుకున్న పాటలు పద్మనాయక కల్యాణ మండపంలో ఓటరు నమోదుపై యువతను చైతన్యపరిచేలా కళాకారులు కళారూపాలు ప్రదర్శించారు. ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామస్తులు పోతరాజుల వేషంతో ఆకట్టుకున్నారు. సిరిసిల్ల, హుస్నాబాద్లకు చెందిన రాంప్రసాద్ శర్మ, తిప్పర్తి శ్రీనివాస్ కళాబృందాల గేయాలు ఆలోచింపజేశాయి. ఈవీఎం గోదాం త్వరగా పూర్తిచేయాలి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాం నిర్మాణా న్ని త్వరగా పూర్తి చేయాలని భన్వర్లాల్ అన్నా రు. గోదాం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ ఫిటింగ్తో సహా గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తిస్థాయిలో చేసి ఈవీఎం భద్రపరిచేందుకు అప్పగించాలని ఈఈని ఆదేశించారు. ప్రతిపాదనలు పంపితే అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు. అక్టోబర్ 3 లోగా ముసాయిదా జాబితా అక్టోబర్ 3లోగా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణకు చర్యలు తీసుకోవాలని భన్వర్లాల్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్, జేసీ, ఆర్డీవోలు, తహశీల్దార్లతో గురువారం ఓటరు నమోదు, అవగాహన కార్యక్రమం(స్వీప్)పై సమీక్షించారు. జిల్లాలో 18ఏళ్లు నిండినయువత 1,65,994మంది ఉన్నా 70,081 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఈ అంతరాన్ని సరిచేయాలని సూచించారు. జిల్లా జనాభా 38,83,088 మంది ఉండగా 67 శాతం నిష్పత్తిలో ఓటర్లు నమోదు కావాల్సి ఉందన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు సవరించాలని కోరారు. భాగస్వామ్యంతో ముందుకు..: కలెక్టర్ జిల్లాలో మహిళా సమాఖ్యలు, నెహ్రూయువ కేంద్రం, ఎన్జీవోలు భాగస్వామ్యంతో ఓటర్లు నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కళాశాలల్లో ప్రత్యేకంగా రాయబారులను నియమించి, డ్రాప్బాక్స్లను ఏర్పాటు చేసి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేస్తున్నట్లు చెప్పారు.