breaking news
jwala ashwini
-
జ్వాల, అశ్వినిలను తిరస్కరించలేదు
టాప్ స్కీమ్లో చేర్చడంపై క్రీడాశాఖ వ్యాఖ్య న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్వినిలను టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) స్కీమ్లో చేర్చడాన్ని ఎప్పుడూ మర్చిపోలేదని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 21న జరిగిన ఐడెంటిఫికేషన్ కమిటీ సమావేశంలోనే వాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించింది. ‘ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత వీళ్ల ప్రదర్శన గురించి చర్చించింది. చర్చ తర్వాత ఈ ఇద్దర్ని స్కీమ్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. డబుల్స్లో వీళ్లిదరికి కలిపి శిక్షణ ఇప్పించాలని కమిటీ భావించింది’ అని క్రీడా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాడ్మింటన్లో సైనా, సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, హెచ్.ఎస్.ప్రణయ్లను టాప్కి ఎంపిక చేయగానే... జ్వాల, అశ్విని క్రీడాశాఖపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. -
కాంస్యాలతో సరి
సెమీస్లో ఓడిన సింధు జ్వాల-అశ్విని జోడీకి నిరాశ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గిమ్చియోన్ (కొరియా): భారత రైజింగ్ స్టార్ పి.వి.సింధు, జ్వాల-అశ్విని జోడి... ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-15, 20-22, 12-21తో టాప్సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమిపాలైంది. గంటా 18 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ ఆరంభంలో హైదరాబాద్ అమ్మాయి అద్భుతంగా ఆడింది. అటాకింగ్తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లోనూ అదే జోరు కనబరిచింది. 20-18తో రెండు మ్యాచ్ పాయింట్లను సంపాదించింది. అయితే కీలకదశలో ఒత్తిడికిలోనైన సింధు వరుసగా రెండు పాయింట్లను కోల్పోవడంతో స్కోరు 20-20 వద్ద సమమైంది. ఆ తర్వాత షిజియాన్ మరో రెండు పాయింట్లు నెగ్గి రెండో గేమ్ను 22-20తో నెగ్గి మ్యాచ్లో నిలిచింది. ఓటమి అంచుల్లోంచి బయటపడిన షిజియాన్ మూడో గేమ్లో విజృంభించడంతో సింధు చేతులెత్తేసింది. మహిళల డబుల్స్ సెమీస్లో జ్వాల-అశ్విని 12-21, 7-21తో లూ యింగ్-లూ యూ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు. తొలి గేమ్ ఆరంభంలో నెట్ వద్ద జ్వాలా జోడి కొన్ని పాయింట్లు చేజార్చుకోవడం దెబ్బతీసింది. బ్యాక్ కోర్టులో అశ్విని అద్భుతంగా ఆడటంతో 3-3తో స్కోరు సమమైంది. కానీ చిన్న చిన్న తప్పిదాలతో 6-11, 6-15, 11-20తో వెనుకబడి గేమ్ను కోల్పోయారు. షాట్లలో భిన్నత్వాన్ని రాబట్టేందుకు ప్రయత్నించిన జ్వాల ద్వయం రెండో గేమ్లో సుదీర్ఘ ర్యాలీలు ఆడింది. కానీ చైనా జోడి మెరుగైన డిఫెన్స్తో 11-2 ఆధిక్యంలో నిలిచింది. అయితే సర్వీస్ తప్పిదాలతో భారత్కు కొన్ని పాయింట్లు సమర్పించుకున్నా విజయానికి సరిపోలేదు. 20-6 స్కోరుతో వద్ద జ్వాల-అశ్విని మ్యాచ్ పాయింట్ను కాపాడుకున్నా.. తర్వాత సర్వీస్ కోల్పోయారు. ఆసియా బ్యాడ్మింటన్లో సెమీస్కు చేరితే కాంస్యం వస్తుంది. కాబట్టి అటు సింధు, ఇటు జ్వాల జోడిలకు కాంస్యాలు దక్కుతాయి. ‘ఓవరాల్గా సింధు బాగా ఆడింది. రెండో గేమ్లో 20-18తో ముందంజలో ఉన్న దశలో సింధు రెండు పాయింట్లను కోల్పోయింది. ఈ తరహా మ్యాచ్ల్లో కాస్త అదృష్టం కూడా కలసిరావాలి. ఒకరోజు మనం గెలుస్తాం. మరోరోజు ఓడిపోతాం. మొత్తానికి సింధు ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నాను.’ - పుల్లెల గోపీచంద్, చీఫ్ కోచ్