బెజవాడలో జనసేన కార్యకర్తల ఆందోళన
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గళమెత్తింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు శనివారం విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు నమ్మి మోసం చేశారని జనసేన కార్యకర్తలు ఈ సందర్భంగా ఆరోపించారు.
రాష్ట్రానికి చెందిన బీజేపీ, టీడీపీలకు చెందిన కేంద్రమంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ స్ఫూర్తి, ఆయన ప్రేరణతోనే ఈ ధర్నాకు దిగినట్లు జనసేన కార్యకర్తలు వెల్లడించారు.