breaking news
irregation
-
1,600 కోట్లతో 400 వంతెనలు
బషీరాబాద్ (తాండూరు): రాష్ట్రంలో మూడున్నర ఏళ్లలో రూ. 1,600 కోట్లతో 400 వంతెనల నిర్మాణం చేపట్టినట్లు రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రవీందర్రావు తెలిపారు. ఇందులో ఇరిగేషన్ కోసం 150 చెక్డ్యామ్లను నిర్మించినట్లు చెప్పారు. ప్రధానంగా గోదావరి నదిపై 5, కృష్ణానదిపై 2 భారీ వంతెనల పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 162 వంతెనల నిర్మాణాలు పూర్తిచేసినట్లు చెప్పారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 82 భారీ వంతెనల నిర్మాణం జరుగుతోందన్నారు. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీలో కాగ్నా నదిపై రూ.13.40 కోట్లతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న వంతెనలను వచ్చే ఏడాది జూన్లోపు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 6,017 కి.మీ. పొడవున ఉన్న డబుల్లేన్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,500 కోట్ల నిధులు ఖర్చు చేసి 4 రెట్ల మేర విస్తరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,450 కి.మీ. డబుల్లేన్ రోడ్లు నిర్మాణం అయినట్లు పేర్కొన్నారు. 10 సంవత్సరాల వరకు మరమ్మతులకు గురికాకుండా ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా లో ప్రయోగాత్మకంగా ‘సాయిల్ స్టెబిలైజేషన్’ పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం తవ్విన రోడ్లను కాంట్రాక్టర్లే సీసీతో మరమ్మతులు చేయాల్సి ఉందని, దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆర్అండ్బీ ఎస్ఈ రమేశ్బాబు ఉన్నారు. -
పిలాయిపల్లి సర్వే పనులు పది రోజుల్లో పూర్తి చేయాలి
భూదాన్పోచంపల్లి : పది రోజుల్లో పిలాయిపల్లి కాలువ సర్వే పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కె. సురేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్ ఎస్ఈ ధర్మ, డీఈఈ శ్రీధర్రావు, సర్వే అధికారులతో కలిసి మండలంలోని పిలాయిపల్లి వద్ద కాల్వ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చినపుడు మూసీ కాల్వలకు రూ.350 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో మూసీపై గల పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వల సర్వే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ¯ సర్వే పనుల కోసం ప్రభుత్వం రూ. 1.23 కోట్లు విడుదల చేసిందన్నారు. 400 క్యుసెక్కుల సామర్థ్యంతో పిలాయిపల్లి కాల్వను విస్తరించనున్నట్లు తెలిపారు. వారం, పదిరోజుల్లో సర్వే పనులు పూర్తి చేసి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వీరి వెంట ఏఈ రాజశేఖర్, సర్పంచ్ అందెల స్వాతిహరీష్, ఎంపీటీసీ రంగ జ్యోతివిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.